సోమవారం 28 జూలై 2008

‘ఫ్రెషర్స్ డే’ రిపోర్ట్

కొద్దిరోజుల నుండి ‘కూడలి కా ఖోజ్’ అనే కార్యక్రమం ప్రారంభించి మంచి మంచి బ్లాగులను గుర్తించి నా ‘బ్లాగ్ లిస్ట్’లో చేర్చడం మొదలుపెట్టాను. అది ఇంకా పూర్తవలేదు లెండి. కానీ రాత్రి 'కూడలి కబుర్ల 'లో ‘ఖోజ్’ చెయ్యవలసింది బ్లాగుల కావల చాలా ఉన్నదని తెలిసింది.

కూడలి కబుర్లలో ‘తెలుగు బ్లాగర్ల ఫ్రెషర్స్ డే’ సందర్భంగా కొన్ని నిర్ణయాలు జరిగాయి. తెలుగు బ్లాగర్లలో జూనియర్, సీనియర్ అనేటటువంటి తేడాలేవీ లేవనీ..అంతా సమానమేననీ. ఇక కొత్త బ్లాగర్లకు మార్గదర్శకంగా ఉండటానికి వీలుగా కూడలిలో ఓ పేజీ కేటాయించి దానిలో ‘త.వ.స.’ (తరచుగా వచ్చే సందేహాలు) అంటే ‘వర్డ్ వెరిఫికేషన్’ లాంటి వివరణలు..ఇంకా ఇలాంటి విషయాలు ఉండాలని నిర్ణయించారు. ఇంకా ‘ఫండ్ రైజింగ్’..అలానే మరికొన్ని సాంకేతిక విషయాల మీద చర్చలు జరిగాయి.

ముందుగా ఛలోక్తులు, తరువాత బ్లాగర్ల పరిచయ కార్యక్రమం, తరువాత వివిధ విషయాల మీద చర్చ, ఆ తరువాత సందేహాలు..వాటి నివృత్తి, విజ్ఞప్తులు, వీడ్కోళ్ళు …ఇలా సమావేశం ముగిసింది.

ఇక నెలలో ప్రతి నాల్గవ ఆదివారం సాయంత్రం 6గం||కు పిలుపుతో పని లేకుండా కూడలి కబుర్లకు రావాలనీ.. రావచ్చనీ తెలియజేయబడింది.

పరిచయ కార్యక్రమం కొంత ఎక్కువ టైం తీసుకునేసరికి చివరి వరకూ అందరూ ఉండలేకపోయారు. రాత్రి జరిగినది ‘ఫ్రెషర్స్ డే’ అనే కాన్సెప్ట్ తో గనుక పరిచయ కార్యక్రమం తప్పదు. ఇక నుండి జరిగే వాటిలో ‘అందరూ ఒకరికొకరు సుపరిచితులే’అనే ప్రాతిపదికతో (కొత్త వారు తమ తమ బ్లాగుల ద్వారా పరిచయమవుతూనే ఉంటారు కదా!) ఛలోక్తులు (ఇవి ఏటూ తప్పవు) అయిన వెంటనే చర్చ ప్రారంభిస్తే అందరూ ఒకేసారి డిస్పర్స్ అవ్వచ్చు.

దిలీప్ గారి నిష్క్రమణ బావుంది.’నే వెళ్తున్నా..!వంట చేసుకోవాలి’. సో ఆయన బ్రహ్మచారి అన్న మాట.

ఒరెమూనా గారు ‘తెలుగు తెలుగు’ అని ఎవరినో హెచ్చరించారు.కానీ పూర్ణిమ గారు టింగ్లింష్‌లోనే కబుర్లాడారు. ఆ టింగ్లింష్ చాలా బావుంది.

‘muralee !Edi nijaM?’

naatO Emainaa samasyalunnaayaa?

సాలభంజికలు గారి అధ్యక్షత బావుంది. రానారె గారు రాగానే సాలభంజికలు గారు తన బాధ్యతను ఆయన కప్పగించి నిష్క్రమించారు.(తరువాత మరలా వచ్చారులేండి)

రానారే గారు రాగానే ఒరెమూనా గారు ‘రెడ్డి’ గారూ స్వాగతం అన్నారు. జ్యోతిగారు ‘రాము’ గారూ స్వాగతం అన్నారు. మిగతా ‘నారాయణ’ను నేనూహించుకున్నాను.

{కబుర్ల మధ్యలో బ్లాగింగ్ ఓ వ్యసనం అనే కోణంలో కొందరు సీనియర్ బ్లాగర్ల నుండి (సారీ..!సీనియర్,జూనియర్ అనకూడదు కదూ!)వ్యాఖ్యలు వచ్చాయి. దానితో నా మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ అంశాన్ని జ్యోతి గారితో ప్రస్తావిస్తే అది మన చేతిలోనే ఉందన్నారు. ఈ విషయం మీద నేనో టపా రాస్తాను}

గుడ్‌నైట్ చెప్పేటపుడు మీనాక్షి గారిని, మురళీధర్ గారినీ నేను సంబోధించలేక పోయాను. నేను ‘లేఖిని’ తో కుస్తీ పడుతూ కాపీపేస్ట్‌లు చేస్తున్నాను. దానికి తోడు ‘మంటనక్క’ ఒకటి లేకపోవడం. దానితో ఆలస్యమైపోతూ ఉన్నది. ‘అక్షరమాలలో రాయండి!’ అని ఉన్నది. దానితో ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకోవాలి. అందరూ స్పీడ్‌గా కబుర్లు చెప్పడానికి అక్షరమాలే కారణమనుకుంటా!

జ్యోతిగారు ‘మంటనక్క’ అన్నారు. ప్రతాప్ గారు, ప్రదీప్ గారు ‘ఫైర్ ఫాక్స్’ అన్నారు. అదే ఇదని తట్టేసరికి తెల్లారింది.

జ్యోతిగారు ‘జ్యోతక్క’ ఎందుకైనారో నాకు రాత్రే తెలిసింది.

మురళీధర్ గారు పరిచయకార్యక్రమంలో అందరి వ్యక్తిగత వివరాలు చెబితే బాగుండేది అన్నారు. పూర్ణిమ గారు వాటిని తెలుసుకుని ఎంజేస్తామన్నారు. దానికి సమాధానంగా మురళీధర్ గారు తోటి బ్లాగర్ల గురించి తెలుసుకుంటే అదో ‘తుత్తి’ అన్నారు.

ఇద్దరి అభిప్రాయాలూ నిజమే. అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు..ఇవి అనవసరం. కానీ వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, చేసే పని, ప్రస్తుత నివాసం..ఇత్యాదివి తెలిస్తే మురళీ గారు అన్నట్లు అదో ‘తుత్తే’ కదా! కనీసం వయసన్నా తెలిస్తే ఈ ‘గారె’ల (గారు) బాధ కొంతైనా తగ్గి కాస్త చనువైనా ఏర్పడుతుంది. అందుకే నా వివరాలు చెబుతున్నాను.

నన్ను సాలభంజికలు గారు సరస్వతీ పుత్రులు అన్నారు.ఆయన అర్థంలో నేను లక్ష్మీ పుత్రుడిని కూడా.ఎందుకంటే నా పూర్తి పేరు లక్ష్మీ సరస్వతీ కుమార్.

నేను పుట్టిన సంవత్సరం 1970.

నేను పుట్టి పెరిగినది,చదువుకున్నది గుంటూరు జిల్లా బాపట్లలో.

ప్రస్తుత నివాసం వైజాగ్.అచ్చ తెలుగులో విశాఖపట్నం.

గురువారం 24 జూలై 2008

బ్లాగింగ్ లో రాగింగ్

కొత్తగా వచ్చే బ్లాగర్లకు బాధ కలిగించే విధంగా ఉన్న టపాలు రెండు ఇపుడు కూడలిలో ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరూ చేయి తిరిగిన హాస్య రచయితలే. అందులో ఒక టపాలో కొత్త(లేత)బ్లాగర్ల మీద ఉన్న ఆరోపణలు రెండు. అవి:

1.ఒక టపాను ఒకేరోజులో పదేపదే పోస్టు చేసి తద్వారా కూడలిలో నిరంతరం పైన వచ్చేటట్లు చేయడం.

2.'హోల్ సేల్ టపా'లు. అంటే ఒకే బ్లాగునుండి ఒకే రోజు అనేక పోస్టులు రావడం. దీనివలన దీనికన్నా ముందు పోస్టు చేయబడిన మిగతా బ్లాగుల యొక్క టపాలు కూడలిలో త్వరగా కనిపించకుండా పోతాయి.

ఆ రచయిత ఎవరిని ఉద్దేశించి రాసాడోగానీ ఇందులో మొదటి పొరపాటు మాత్రం నేనే చేసాను. సాధారణంగా నేను ఒక టపాను ఒక్కసారే పోస్టు చేస్తాను. కానీ ఈ నెల 6వ తారీఖున రాసి పోస్టు చేసిన టపాలోని నూతన భావాలను ఎవరూ miss అవకూడదనే ఉద్దేశంతో..మరలా..ఆ టపావలన నా బ్లాగు చూసే వారిసంఖ్య ఒక్కసారిగా నాలుగింతలవడవం వలన ఒక కొత్త బ్లాగరుకుండే సహజ ఉత్సాహం వలన..అదీగాక ఆ విధంగా టపాను మరలా మరలా ఫ్రెష్ గా కనిపింపజేసే విధానం నాకు అప్పుడే తెలియడంవలన ఆ టపాను పదేపదే 11 వ తారీఖు వరకూ పోస్టు చేసాను. ఇంత ఎక్కువగా కాకపోయినా ఒక పోస్టును ఈ విధంగా మరలా మరలా పోస్టు చేయడం కూడలిలో అమోదయోగ్యంగా ఆచరింపబడుతూనే ఉన్నది. ఐతే నేను మరీ 5 రోజులు చేసేసరికి కూడలి నిర్వాహకులచే నా బ్లాగు తాత్కాలికంగా అచేతనం చేయబడినది.

అదే 11వ తారీఖున మా ఏరియాలో BSNL కేబుల్స్ తెగిపోవడంతో 5 రోజుల పాటు నాకు నెట్ సౌకర్యం లేకుండా పోయింది. అదే సమయంలో కూడలి ఆగ్రిగేటర్లో ఏదో సాంకేతిక లోపం తలయెత్తి పోస్టు చేయబడిన టపాలను సరిగా ప్రదర్శించడంలేదని తెలిసినది. అప్పటికే నా PC లో ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ను Up date చేసుకోవలసినది గా వార్నింగ్ రావడం మొదలైనది. ఈ మొత్తం కన్ఫ్యూజన్లో ఆ 5 రోజులూ గడిచిపోగా మరలా నెట్ సౌకర్యం సమకూరిన వెంటనే తెలుగు బ్లాగర్ల గూగుల్ గుంపులో కూడలి నిర్వాహకులకు విజ్ఞప్తి చేసుకుని నా బ్లాగును తిరిగి సచేతనం చేయించుకుని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.

ఇక ఆ టపాలో చేయబడిన రెండవ ఆరోపణ హోల్‌సేల్ టపాలు. ఇది నాకు తెలిసి మరో కొత్త బ్లాగరు చేశారు. ARADHANA అనే బ్లాగు నుండి రెండు రోజుల క్రిందట ఒకే సమయంలో వరుసగా 13 కొత్త టపాలు పోస్టు చేయబడ్డాయి. ఆ ధాటికి అంతకు ముందు పోస్టు చేయబడిన ఇతర బ్లాగర్ల టపాలన్నీ చాలా కొద్ది సమయంలోనే కూడలిలో Push down అయిపోయాయి.

కొత్త బ్లాగర్లు మొదట్లో ఉత్సాహంతో ఇటువంటి పనులు చేస్తుంటారు. చేయవచ్చా..?, చేయకూడదా..? అనేవి మర్యాదకు సంబంధించిన అంశాలుగానే ఉన్నాయిగానీ ‘టపాలను ఈ విధంగా పోస్టు చేయాలి’ అనేటటువంటి స్పష్టమైన మార్గదర్శకాల రూపంలో ఉన్నట్లుగా నేను గమనించలేదు. ఒక వేళ అటువంటి మార్గదర్శకాలు ఉన్నట్లైతే వాటిని ఉల్లంఘించిన వారిమీద ఎన్ని సెటైర్లయినా వేయవచ్చు, ఎన్ని జోకులైనా పేల్చవచ్చు.

మరో విషయం: కొత్త బ్లాగర్లకు సీనియర్ బ్లాగర్లనుండి తరచుగా ఎదురయ్యే మరో మాట ‘వర్డ్ వెరిఫికేషన్’ తీసివేయండి. అసలు అదేంటో తెలిస్తేకదా దానిని ఉంచడానికి, తీసివేయడానికి. నాకు కూడా ఈ మాట ఎదురవడంతో ఆ విషయాన్ని నేను గూగుల్ గుంపులో ప్రశ్నించి తెలుసుకుని దానిని నా బ్లాగు నుండి ఈ రోజే తొలగించాను.

కనుక కొత్త బ్లాగర్ల పరిస్థితిని సీనియర్లు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

తన హాస్యంతో నా అభిమానాన్ని కూడా చూరగొన్న ఈ బ్లాగరు కూడలి నిర్వాహకులకు ఈ విషయమై ఇచ్చిన సలహా ఇది.

‘దయచేసి లేత100 అని తయారు చేసి లేతల్ని అటుపంపు బాసూ…బ్లాగు ముదిరిన కొద్దీ పాతబ్లాగుల్లోకి తొయ్యి బాసూ లేదా కూడలి 100 కాస్త ఉతికి ఆరెయ్ బాసూ’

ఈ సలహాను కొందరు కామెంటేటర్లు కూడా సపోర్ట్ చేశారు.వీరందరికీ నా ధన్యవాదాలు.కానీ నా ఉద్దేశంలో రూపొందవలసినది లేత100 కాదు. మార్గదర్శకాలు. అవి:

1.రోజుకు ఒక బ్లాగు నుండి ఎన్ని టపాలు పోస్టు చేయవచ్చో తెలియజేయడం.

2.ఒక కొత్త పోస్టును ప్రపంచ వ్యాప్తంగా చూస్తారు గనుక పగలు రాత్రుల లో తేడాలుంటాయి గనుక మొదటి సారి ఒకటి రెండు రోజులు ‘రీపోస్టింగ్’ అవకాశం కల్పించడం.

3.అలాగే పాత పోస్టులను రచయిత మరలా పోస్టు చేయదలచుకుంటే నెలకో, రెండు నెలలకో ఒక సారి అవకాశం కల్పించడం…

ఇత్యాది మార్గదర్శకాలు కనుక కల్పిస్తే వాటిని ఉల్లంఘించేంతటి దుష్ప్రవర్తన బ్లాగర్లలో ఉన్నదని నేను అనుకోను.

ఇక రెండవ టపా విషయం.

ఈ టపాలో కొత్త బ్లాగర్ల వలన బ్లాగ్ప్రపంచంలో రాను రాను నాణ్యత పడిపోతున్నదనీ,బ్లాగ్ప్రపంచంలో తీవ్రపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సినిమా కథ రూపంలో చెప్పుకొచ్చి రచయిత విమర్శించారు.

మొదటి తరం బ్లాగర్ల వలన తెలుగు సంస్కృతీ సాహిత్యాలు అంతర్జాలంలో వెలిసాయనీ, వారు నిజయితీ, ఇంటెగ్రిటీ గల గొప్ప బ్లాగర్లనీ,బ్లాగులకు వీరివలన వైభవం,నాణ్యత కల్గినవనీ ఆ రచయిత పేర్కొన్నారు.

కొత్త బ్లాగర్లలో కొందరి లక్షణాలు ఈ విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరివలనే బ్లాగ్లోకం పాడైపోతున్నదని ఆయన ఉద్దేశం.

వీరు స్వప్రయోజనపరులు, దుష్టులు,చేతగాని వారు. నిజ జీవితంలో వారికి ఎటువంటి ఆరాధనా లేదు. తీవ్ర అభద్రతా భావంతో ఉంటారు. వారు సగటాతి సగటు దినచర్య బ్లాగులు రాస్తారు. మసాలా సరకు నింపి హిట్లు సంపాదిస్తారు. పవిత్రమైన బ్లాగ్లోకాన్ని కంపు చేస్తారు. వీరివలన తెలుగు సినిమాలని పట్టిపీడిస్తున్న మాస్ తత్వం మెల్లగా బ్లాగుల్లోకి వ్యాపిస్తున్నది.వీరివలన ఆదర్శ సీనియర్ బ్లాగర్లు కూడా చెడిపోతున్నారు.

(ఈ అభిప్రాయాలను తెలిపిన ఒకట్రెండు పేరాలలో రచయిత చాలా ప్రతిభను కనపరచారు. థామస్ మూర్ ‘ఉటోపియా’ను కార్ల్ మార్క్స్ ‘ఆదర్శ కమ్యూన్ వ్యవస్థ’ ను గుర్తుచేశారు.(ఇది వెటకారం కాదు,నిజమే))

ఈయన ఒక సీనియర్ బ్లాగర్. 2005 నుండి బ్లాగింగ్ చేస్తున్నారు. తెలుగు బ్లాగింగ్ కు పునాది పడింది 2004లో..ఇది 2008. ఈ కొద్ది కాలంలోనే కొత్త,పాతల తేడాలవసరమా? ఇప్పటికే బ్లాగర్లు తెలంగాణా వాదులు, సమైక్యవాదులుగా విడిపోయారు. అగ్రకులాలు, నిమ్నకులాలు గా విడిపోయారు. ఇప్పుడు కొత్త బ్లాగర్లు, పాత బ్లాగర్లు అంటూ మరో ప్రాతిపదిక అవసరమా?

బ్లాగింగ్ అంటే కాలేజీలో చదవడం కాదుగా. కాలేజీలో అయితే కొత్తవారి కన్నా పాతవారు కనీసం వయసు లో,చదువులో ఎక్కువగా ఉంటారు. కానీ బ్లాగింగ్ లో అదెలా సాధ్యం? పాతవారికన్నా కొత్తవారు వయసులో, విజ్ఞానంలో ఎక్కువ అనటం సాధ్యం కాదని ఎవరైనా ఎలా అనగలరు? పాతవారు మాత్రమే నాణ్యతా ప్రమాణాలు నిలబెట్టగలరని కొత్తవారు దానిని త్రుంచివేయటం మాత్రమే చేయగలరని హాస్యానికైనా ఎవరైనా అనగలరా? ఇంకో 15 ఏళ్ళు పోతే అప్పుడు కొత్త పాతలు అంటూ విడదీయడం సాధ్యమేమోగానీ ఆ ప్రాతిపదిక ఇప్పుడే అవసరం లేదు.

బ్లాగర్లు పెరిగేకొలదీ బ్లాగుల్లో వైవిధ్యం పెరుగుతుంది. ఇది సహజ పరిణామం. ఇది ఆహ్వానించదగిన పరిణామం. దీనిని నెగెటివ్ దృష్టితో చూడటం మంచిది కాదు.

ప్రస్తుత సమాజంలో దాదాపూ మీడియా అంతా ఈ వ్యవస్థకు పుట్టిన బిడ్డలతోనే నిండి పోయి ఉన్నది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా..ఏదైనా సరే వాటిలో నూతన భావాలకు అస్కారమే లేదు. మనం రాసిన విషయాన్ని ఎడిటర్ కత్తిరించి,మార్చి ప్రచురిస్తాడు. అది కూడా ఆయనకు నచ్చితేనే. కానీ బ్లాగుల్లో మనమే రచయితలం,మనమే ఎడిటర్లం. ఇప్పుడు సమాజంలో నూతన భావాలకు అస్కారం ఉన్నది బ్లాగ్ప్రపంచం ఒక్కటే అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే బ్లాగులు ఈ వ్యవస్థ నుండి కాక ప్రజల్లోంచి ఉద్భవిస్తున్నాయి.

ఇటువంటి బ్లాగులనన్నింటినీ ఒక దగ్గర చేర్చి మన భావాలను యథాతథంగా నలుగురితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్న ‘కూడలి’ ఋణం తీర్చుకోలేనిది.

బ్లాగర్లందరూ సహోదరుల వలే మెలగాలని నా ఆకాంక్ష. మనం ఎగతాళి చేయడానికి, విమర్శించడానికి బయట చాలామంది ప్రజాద్రోహులున్నారు.

వేయి బ్లాగులు వికసించనీ..! కోటి భావాలు పురివిప్పనీ..!

ఆదివారం 20 జూలై 2008

'బ్రేక్' విలువలు

ఇప్పుడు టి.వి.ఛానళ్ళలో ఒక యాడ్ వస్తున్నది.అది ఒక ట్రౌజర్స్ కంపెనీ యాడ్.దానిలో ఒక యువతి తన ఇంట్లోనే తన ప్రియుడితో రహస్య ప్రేమాయణం సాగిస్తుంటుంది. అది గమనించిన ఆమె తండ్రి తుపాకి తో వెంటబడతాడు. దానితో ఆ ప్రియుడు గ్రిల్స్ లేని ఫ్రెంచ్ విండోలోనుండి (అర్థనగ్నంగానే) బయటకు దూకుతాడు. అప్పుడా యువతి అతనికి అతడు విప్పిన పాంట్‌ను అందించి తన తండ్రిని అతడి వెంట పడకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో ఆ పాంట్ తొడుక్కుని ఆ ప్రియుడు ఉడాయిస్తాడు. ఈ లోపు కూతురును విదిలించుకుని ఆ తండ్రి ‘బఫూన్ ’లా ఆ యువకుడి వెంట పడతాడు.

దీనికి ముందు మరో యాడ్ వచ్చేది. అది ఒక ‘బాడీ స్ప్రే ’ యాడ్. దానిలో ఒక ఇంటిలో ఒక స్త్రీని ఒక పురుషుడు చూచుకోకుండా డాష్ ఇస్తాడు.ఆ సమయంలో ఆ పురుషుడి నుండి వస్తున్న బాడీ స్ప్రే సువాసనను పీల్చిన ఆ స్త్రీలో వలపులు రేగి తన మనోలోకంలో ఆ పురుషుడితో శృంగారంలో పాల్గొన్నట్లు పచ్చిగా ఊహించుకుంటుంది.(ఆమె మనసులో ఊహించుకున్నా మనకు మాత్రం యాడ్‌లో అంతా చూపిస్తార్లెండి.)

దీనికన్నా ముందు మరో ప్రకటన వచ్చేది. దానిలో ఒక హిందీ సినిమా హీరో నటించాడు. ఓ బేకరీలో పనిచేస్తుండే ఒక యువకుడు బేకరీ యజమానికి మస్కా కొట్టి అతని కూతురుతో శృంగారం సాగిస్తాడు. ఆ సమయంలో వారి వేడి ‘మహిమ’ వలన వారి క్రింద కొన్ని బిస్కట్లు తయరవుతాయి.

వీటన్నింటి వలన యువతకు ఎటువంటి సందేశం వెళుతున్నది? ‘ప్రీ మారైటల్ సెక్స్’(వివాహ పూర్వ శృంగారం), అక్రమ సంబంధాలు…ఇలాంటివి తప్పేమీ కాదనీ, పైగా అవి చాలా ‘ఫన్నీ’ అనీ, వాటిని వ్యతిరేకించేవాళ్ళంతా బఫూన్లేననీ, అవి ఇతరులను ఫూల్స్‌ను చేస్తూ, వారికి మస్కాకొట్టి, వారికి తెలియకుండా సాగించి, చిలిపిగా నవ్వుకునే ‘థ్రిల్లింగ్’ విషయాలనే సందేశాన్ని యువతకు ఈ ప్రకటనల రూపకర్తలు చెప్పకనే చెబుతున్నారు.

(ఇక కొన్ని(చాలా) సినిమాల గురించైతే చెప్పుకోవటమే అనవసరం. అక్కడ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఇంకా ఆవుడ్, ఈవుడ్ అన్నీ కలిపి చాలా శృంగారాన్నే ఒలకబోస్తున్నాయి. ప్రేమ పేరుతో అభూత కల్పనలను సృష్టిస్తూనే ఉన్నాయి. యువతకు బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉన్నాయి.)

(ఇప్పుడు సమాజంలో తమ మానాన తాము చదువుకుంటూ, తమ బంగారు భవిష్యత్తు వైపు సాగిపోయే అమ్మాయిలపై ప్రేమోన్మాదుల సాగించే మారణకాండకు ఇటువంటి సందేశాల, సంకేతాల ప్రభావం, ఇటువంటి సినిమాల ప్రభావం లేదంటారా..?!)


ఇటువంటి ప్రకటనల కాన్సెఫ్టుల యొక్క రూపకర్తలు, ఇటువంటి ప్రకటనలను రూపొందించే యాడ్ ఏజెన్సీలు, వీటిని రూపొందించమని కోరే కంపెనీలు, వీటిని ప్రకటించే TV ఛానెళ్ళు..వీళ్ళెవరికీ బాధ్యతలేదా..?! వీళ్ళ ఉత్పత్తులను ఏదోరకంగా అమ్ముకోవటమేనా వీరిపని..! వీళ్ళను నియంత్రించడానికి యంత్రాంగమంటూ లేదా..?!

ఈ పరిస్థితి నేటి మన సమాజంలో విలువల యొక్క పతనానికి చిహ్నం. ఇస్లామిక్ దేశాలలో అయితే ఇటువంటి ప్రకటనలకు బాధ్యులైన వారికి ఎటువంటి గతి పట్టేదో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. విలువల యెడల వారికి అంత పట్టు. అంత కాఠిన్యం అవసరం లేదు కానీ ఎవరికైనా విలువల యెడల నిబద్ధత ఉండాలి. ఇటువంటి పోకడల యెడల నియంత్రణ ఉండాలి.

వ్యభిచారం చేసేవారికి ఎయిడ్స్ రాకుండా చూచుకోమని జాగ్రత్తలు చెప్పే ప్రభుత్వాలున్న ఈ దేశ వ్యవస్థలో అటువంటి నియంత్రణ సాధ్యపడుతుందంటారా..?!!

శుక్రవారం 11 జూలై 2008

మన ముందున్న మహాకర్తవ్యం

మునుపటి వ్యాసానికి స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆ వ్యాసంతో నా భావజాలం మీద కొన్ని అపోహలు తలయెత్తే అవకాశం ఉన్నందున నా వాస్తవ ఉద్దేశాలను, లక్ష్యాలను, ఆలోచనలను తెలియజేయాలి అని అనుకుంటున్నాను. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న వ్యవస్థ తొలగింపబడాలని నేను కోరుకుంటున్నట్లు మీలో చాలామందికి తెలుసు.అయితే దళిత వ్యతిరేకతనో లేక మరే ఇతర వర్గపు వ్యతిరేకతనో దానికి ప్రాతిపదికగా నేను భావించడం లేదు.

కొద్ది రోజుల క్రిందట మన రాష్ట్రంలో అగ్రకులానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు ఓ దళితనాయకుడిని ఉద్దేశించి మాట్లాడేటపుడు ‘గేదెపాలు’ అనే పదాన్ని ఉపయోగించినందుకు అతనికి జరిగిన పరాభవం మనందరికీ తెలుసు. ఆయన అనేక మందికి జీవనాధారం కల్పిస్తున్న ఒక పారిశ్రామిక వేత్త, ఒక యువ రాజకీయ నాయకుడు. ఆ పెద్దమనిషిని పట్టుకుని కొందరు దళితయువకులు నడిరోడ్డుమీద, నలుగురు చూస్తుండగా చాలా అగౌరవప్రదంగా కొట్టారు. ఆయన తరపున ఏ ఉద్యమమూ తలయెత్తలేదు. కేవలం ఆ రాజకీయ నాయకుడే తనకు జరిగిన అన్యాయానికి తనకొద్దిమంది అనుచరులతో కాసేపు ధర్నా చేశాడు. ఆయన భార్య వచ్చి తన భర్త దీనావస్థ చూచి కన్నీళ్ళు పెట్టుకుని దీనంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఈ సంఘటన ఎవరి స్మృతిపథం నుండి ఇంకా చెరిగిపోలేదనే అనుకుంటున్నాను.

అసలు ‘గేదెపాలు’ అనే పదంలో తప్పేమిటో నాకింతవరకూ బోధపడలేదు. మనమంతా తెల్లవారిలేస్తే తాగేది అవేకదా! మన పసివారికి తల్లిపాలు చాలకపోతే పట్టేది ఆ పాలే కదా! మరి దానిలో తప్పు ఎక్కడనుండి వచ్చింది. బహుశా గేదె వాళ్ళకు అంటరానిదైపోయి ఉంటుంది.

ఇక U.P.లోని B.S.P. నినాదాన్ని తీసుకుంటే మరింత బాధ కలుగుతుంది. ఆ నినాదాన్ని చదివితే ‘ఈ భరతఖండంలో ద్విజులకు చివరికి మిగిలింది చెప్పుదెబ్బలా..!! ‘నామాలు పెట్టుకునేవారు’.. ‘తరాజులు పట్టుకునేవారు’.. ‘కత్తులు తిప్పేవారు’..లాంటి వెక్కిరింతలా..!!’ అనే ఆలోచన వైదిక మతంలో విశ్వాసం కలిగిన ఎవరికైనా కలుగకమానదు.

ఆఖరికి ‘దళితులు పెట్టిన ప్రాణభిక్షతో పెద్దకులాల వారు బ్రతుకులీడుస్తున్నారు’ అనే పరిస్థితి రావడంతో వాస్తవాలను తెలుపుతూ ఆ వ్యాసం రాసాను.

మునుపటి వ్యాసానికి నేపథ్యం ఇంతే తప్ప ప్రస్తుత వ్యవస్థ మార్పునకు ఈ దళిత వ్యతిరేకతను నేను ప్రాతిపదికగా స్వీకరించడంలేదు. ఎవరికైనా ఉద్యమ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. దళిత వ్యతిరేకతతో ఉద్యమం తలయెత్తితే మనం అంతవరకే సాధించగలుగుతాము. కానీ మనకు కావలసినది అది కాదు. మన లక్ష్యం అది కాదు. ఇవన్నీ మన దారిలోని ఆటంకాలు మాత్రమే. మన గమ్యం వేరే ఉన్నది. అదేమిటంటే మహోజ్వలమైన భారత జాతీయ వైభవాన్ని మనం తిరిగి సాధించుకోవాలి. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలి.

చరిత్రలో మన సార్వభౌమత్వాన్ని ఒకరు హరిస్తే, మన సంపదను మరొకరు కొల్లగొట్టారు. ఇందుకు ప్రతీకారం కాదుగానీ ఈ పరాభవానికి మనం సమాధానం చెప్పితీరాలి…లేదంటే ఈ భారతజాతి ఒక పరాభవిత జాతిగానే చరిత్రలో మిగిలిపోతుంది. ఆ సమాధానం విధ్వంసకర విధానంలో ఉండకూడదు. నిర్మాణాత్మకంగా ఉండాలి. మన జాతి వైభవాన్ని తిరిగి సాధించుకోవడమే ఈ పరాభవానికి సరైన సమాధానమని నేను భావిస్తున్నాను. ఇది చరిత్ర మనకు విధించిన కర్తవ్యం.

విర్రవీగిన జాతులన్నీ కుప్పకూలిపోయాయి. గడచిన చరిత్రలో సామర్థ్యమున్న ప్రతి జాతీ తనకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తాను ప్రపంచం కొరకు ఏమి చెయ్యగలదో చేసి చూపింది. ఇప్పుడు మన సమయం వచ్చింది. మనజాతి యొక్క ఉజ్వలమైన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకోవటానికి ఈ అవకాశం మనం ఉపయోగించుకొనితీరాలి. ప్రపంచ జాతులమధ్యన భారతజాతి తన న్యాయమైన స్థానాన్ని,తనకు అర్హమైన స్థానాన్ని పొందటానికి ఇంతకు మించిన అవకాశం మరోసారి వస్తుందని నేను అనుకోను.

ఇప్పుడు ఈ ఓడిపోయిన ప్రపంచానికి గెలుపునివ్వటం, దారిచూపటం ఈ వేదభూమికి తప్ప అన్యులెవ్వరికీ సాధ్యంకాదు కనుక మనకు ఈ కర్తవ్యం విధాయకమైనది.

మన ముందున్న ఈ మహా కర్తవ్యం తో పోల్చుకుంటే ఈ దళిత సమస్య చాలాచిన్నది.అయితే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతున్నంతకాలం మనం ఇటువంటి చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేము.అందుకే ముందుగా ఈ వ్యవస్థ తొలగింపబడాలి.

(‘ఈ వ్యవస్థ తొలగింపబడాలా?..వద్దా?’ అనేది భావజాలానికి సంబంధించిన ప్రశ్న. ‘ఎలా తొలగింపబడాలి?’ అనేది కార్యాచరణకు సంబంధించిన ప్రశ్న. ఈ వ్యాస పరిధి భావజాలం మాత్రమే.)

ఈ వ్యవస్థ పరిధిలోనే ఏవో చట్టాలద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తే అది ఈ వ్యవస్థ యెడల ఇంకా తొలగిపోని మన భ్రమలకు ఋజువు మాత్రమే అవుతుంది.ఒక సారి మనం ఈ వ్యవస్థను అంగీకరించామూ అంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలను మనమే మరింతగా బలపరచినవారమౌతాము. ఏ చట్టాలద్వారా కూడా వాటిని మనం అంతం చేయలేము.ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఈ వ్యవస్థ పెంచిపోషిస్తున్నవే కదా!

మనం ఇలా విడివిడి సమస్యల పరిధిని దాటి మన ముందున్న మహా లక్ష్యం వైపుగా అడుగు కదిపినపుడే మనదారిలో అడ్డుతగిలే ఇలాంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవటమేకాక మన అంతిమ లక్ష్యాన్ని సాధించి ఈ ప్రపంచానికి వెలుగును ప్రసాదించినవారమౌతాము.

ఈ లక్ష్య సాధన కొరకే నేను “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షికతో వ్యాసావళి రాయడం ద్వారా సిద్ధాంత నిర్మాణం చేస్తున్నాను. మీరంతా ఆ వ్యాసాలను చదువుతున్నారనే నేను ఆశిస్తున్నాను.

ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాగారమై
సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియై
వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్థిల్లు నారాయణా!


వైదిక జీవనం వర్ధిల్లుగాక..!

ఆదివారం 6 జూలై 2008

ఎవరు దురహంకారులు..??

తాడేపల్లి వారు ‘తెగేదాకా లాగడం’ పేరుతో ఈ దేశంలో దళితుల యెడల ఈ ప్రభుత్వాలు చూపిస్తున్న పక్షపాత ధోరణిని విమర్శిస్తూ వ్యాసావళి రాస్తున్నారు.ఈయన వాదాన్ని తన కామెంట్ల ద్వారా కత్తి మహేష్ కుమార్ గారు దీటుగా ఎదుర్కొంటున్నారు.

‘దళితులు SC/ST అట్రాసిటీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అగ్రవర్ణాలవారిని బాధిస్తున్నారు’ అనే తాడేపల్లి వారి ఆరోపణకు మహేష్ కుమార్ గారు చెప్పిన సమాధానం నన్ను విభ్రాంతికి గురిచేసింది. ఆ సమాధానం…

‘ప్రతీకారం,హింస దీనికి సమాధానమని దళితులు తలచి ఉంటే ఏ గ్రామంలోనూ “పెద్ద కులాల” వాళ్ళు బ్రతికి ఉండేవారు కాదేమో!

వీరు భారతీయ వ్యవస్థను నమ్మి చట్టాన్ని గౌరవించి, కేసులతో సరిపెడుతున్నారు. కాబట్టే చాలామంది బతికున్నారు. Let’s pray that they continue to adopt this path.’

దీనిని బట్టి అగ్రవర్ణాలవారు ఈనాడు బ్రతికి బట్టకట్టి, ఊపిరి పీల్చి, మనుగడ సాగించడం అనేది కేవలం దళితుల దయాధర్మాల వలన మరియు ఈ దేశ చట్టాల యెడల వారు కలిగి ఉన్న గౌరవం వలన మాత్రమే సాధ్యపడుతున్నది అని మనం గ్రహించాలి. దళితులు ఇదే పంథాను ఇక ముందు కూడా అనుసరించాలని ఈయన అగ్రవర్ణాల వారందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన కూడా చేసారు.

తమ కొమ్ముకాసే వ్యవస్థనేగా వీరు నమ్ముతున్నది. తమకు చుట్టాల్లాంటి చట్టాలనేగా వీరు గౌరవిస్తున్నది.

మరో సందర్భంలో ఈయన తనను దళిత పక్షపాతి అని ఆరోపించడం తనకు బాధాకరం కాదనీ అది తనకు గర్వకారణమనీ పేర్కొన్నారు.

మహేష్ కుమార్ గారూ!…ఇంతకూ మీ గర్వకారణం ఏమిటి?…దళితవాదం ఒక పాలక పక్ష వాదమనా..?!లేక అది ఒక విప్లవకర వాదమనా..?!దేనికి గర్వపడుతున్నారు..?

దళితవాదం ఏనాడో పాలకపక్ష వాదమైపోయింది. ఇప్పుడు అణగద్రొక్క బడుతున్నవారు ఖచ్చితంగా అగ్రకులాల వారే. చరిత్రలో ఒకనాడు దళితులు అణగద్రొక్క బడినారు అన్నది నిజమే. అందుకు ఫూలే, అంబేద్కర్ లాంటి వారు ఉద్యమాలు నడిపి ఆయావర్గాలకు హక్కులు సాధించిపెట్టారు. అవి నిజమైన దళిత ఉద్యమాలు. న్యాయమైన పోరాటాలు.కానీ ఈనాడు దళితోద్యమనాయకుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి?!ఈనాడు దళితోద్యమం ఏవిధమైన స్వభావాన్ని సంతరించుకున్నది?!ఆనాటి పోరాటాలకు పూర్తి భిన్నమైన స్వభావం ఇది. ఇప్పుడు దురహంకారులు అగ్రవర్ణాలవారు కాదు. కోట్లాది మంది దళితుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న నేటి దళిత నాయకత్వమే దురహంకారపూరితమైనది. గ్రామాలలో అగ్రవర్ణాల మనుగడ దళితుల దయాధర్మాల మీద మాత్రమే వీలుపడుతున్నదనే మహేష్ కుమార్ గారి వ్యాఖ్య కూడా ఆ దురహంకారాన్నే ప్రతిబింబిస్తున్నది.

జరుగుతున్న సంఘటనలు, వర్తమాన పరిస్తితులను బట్టి చూస్తే మనకు ప్రస్తుత దళిత నాయకత్వ దురహంకార వైఖరి గురించి అవగాహన కలుగుతుంది . దళితులు చేస్తున్న అత్యాచారాలను తాడేపల్లి వారు చాలానే ఉదహరించారు. వాటిని నేను మరలా చెప్పవలసిన పనిలేదు.

తిలక్..తరాజూ..ఔర్ తల్వార్….మారో ఉన్కో జూతే చార్. అంటే ‘బ్రాహ్మణుడిని (తిలకధారులు), వైశ్యుడిని (తరాజు పట్టేవారు) క్షత్రియుడిని (కరవాలం చేబూనే వారు) చెప్పుతో కొట్టండి’ అనేది ఉత్తర్ ప్రదేశ్‌లో దళిత పార్టీ అయిన ‘బహుజన్ సమాజ్ పార్టీ’ యొక్క నినాదం. ఇది పోరాటమా?! లేక దురహంకారమా?!

మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరిగిన ఒక వ్యవహారంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ‘కమ్మజ్యోతి’ గా అభివర్ణింపబడింది. ‘దాడులు మళ్ళీ మళ్ళీ చేస్తాం’ అని బాహాటంగా చెబుతున్నారు. ఇది పోరాటమా?! లేక దురహంకారమా?! మన రాష్ట్రంలో ఆ నాయకుడు తప్ప ఇంకెవరూ కులాలను అంత బహిరంగంగా ఉటంకించరు. దళితోద్యమ నాయకత్వం పోరాట స్థాయి నుండి దురహంకార స్థాయికి ఏనాడో పరిణామం చెందింది.డిఫెన్స్ నుండి అఫెన్స్ లోకి ఎప్పుడో మారిపోయింది.

దళితులు అణచబడుతున్నారు అనేది పాతపాట. దళితుల ఆగడాలను ఎదిరించాలనేది కొత్త మాట. ఆ మాటే తాడేపల్లి వారు చెబుతున్నారు.

ఇప్పుడు పోరాడవలసిన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారూ అంటే అది అగ్రవర్ణాలే…ఇప్పుడు తిరగబడవలసిన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారూ అంటే అది అగ్రవర్ణాలే…ఇప్పుడు విప్లవకర వర్గం ఎవరైనా ఉన్నారూ అంటే అది అగ్రవర్ణాలే. ఎందుకంటే ‘విప్లవం’ ఎవరిసొత్తూ కాదు. ఎవరు అణగద్రొక్క బడతారో వారి చేతిలోని ఆయుధమే ‘విప్లవం’.

ఇప్పుడు దళితోద్యమ నాయకత్వంలో ఉన్నది పోరాటస్ఫూర్తి కాదు. అది ఏనాడో అంతరించినది. ఇప్పుడున్నది కేవలం తామెన్ని ఆగడాలు చేసినా తమనెవరూ ఏమీ చేయలేరనే నిర్భీతి మాత్రమే. తామెన్నైనా అంటారు…ఏమైనా చేస్తారు. కానీ తమనెవరు ఏమి అన్నా, కనీసం ఆత్మరక్షణ కోసం తమచర్యలను తిప్పికొట్టినా ఇక అంతే….SC/ST అట్రాసిటీ చట్టం అంటారు. దళితులనందరినీ అగ్రవర్ణాల వారు అణచివేస్తున్నారని 100 ఏళ్ళ నాటి పరిస్థితులన్నింటినీ ఇప్పుడే జరుగుతున్నట్లుగా ఏకరువు పెడతారు. అగ్రవర్ణ దురహంకారులని నిందిస్తారు.

TTD వారు ‘దళిత గోవిందం’ పేరుతో తమ సౌజన్యాన్ని చాటుకోవాలనుకున్నారు. అపోహలను తొలగించాలనుకున్నారు. కానీ పుణ్యానికి పోతే పులి ఎదురైందన్న చందంగా ఈ వ్యవహారంలో వారికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

హిందూ దళిత వాడల్లోని దేవాలయాల్లో పూజా పునస్కారాల నిమిత్తం కొందరు దళిత యువకులకు పౌరోహిత్యంలో తర్ఫీదు ఇచ్చారు. అయితే దళితోద్యమ నాయకత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ‘పౌరోహిత్యంలో తర్ఫీదు ఇచ్చారు బానే ఉంది…కానీ మాకు తిరుమలలో శ్రీవారిసన్నిధిలో పౌరోహిత్యానికి అవకాశం ఈయకుండా మా దళిత వాడల్లోని దేవాలయాలకే మమ్మల్నెందుకు పరిమితం చేస్తున్నారు?ఇది దళితుల యెడల చూపిస్తున్న వివక్ష…ఇది అగ్రవర్ణ దురహంకారం’ అని ఆరోపించారు. TTDవారు ‘దళిత గోవిందం’ పేరుతో చొరవ చూపించనంతకాలం ఏ సమస్యాలేదు. కొంత సౌజన్యాన్ని ప్రదర్శించటంతోటే మొదలయ్యాయి వాదనలు, డిమాండ్లు.

(1930ల్లో కమ్మవారు బ్రాహ్మణ కులంతో వచ్చిన విభేదాలతో వారిని బహిష్కరించి తమ పౌరోహిత్యం తామే చేసుకోవటం ప్రారంభించినప్పుడు వారు కూడా అటువంటి కోరిక కోరలేదు.)

చదువుల్లో రిజర్వేషన్లు…OK. స్కాలర్‌షిప్పులు…OK. ప్రవేశ పరీక్షలలో మినహాయింపులు…OK. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు…OK. చట్ట సభల ప్రాతినిథ్యంలో రిజర్వేషన్లు…OK. ఇంకా ‘ఆ’ రిజర్వేషన్లు…OK. ఇంకా ‘ఈ’ రిజర్వేషన్లు…OK. వీటిలో వేటికీ కూడా అగ్రవర్ణాలవారు నోరెత్త లేదు. మౌనంగానే అంగీకరించారు. కానీ తమ సనాతన విశ్వాసాల్లో, తమ శాస్త్రాలలో జోక్యం చేసుకుంటే ఒక వైదికుడు రుద్రతాండవం చేస్తాడనే విషయాన్ని వీరు విస్మరిస్తున్నారు. దీనిని గుర్తించే అక్బర్ అంతటి వాడు సైతం ఈ విషయంలో ఉదారంగా ప్రవర్తించాడు. బ్రిటిష్ వారు సైతం వైదిక మత విశ్వాసాల విషయంలో ఆచితూచి ప్రవర్తించేవారు.

నిజమే వీరు దేశంలో ప్రస్తుతం నెలకొన్న వ్యవస్థ వలన పరిరక్షితులే. నిస్సందేహంగా సురక్షితులే. వీరేమి చేసినా ప్రభుత్వం వీరికొమ్మే కాస్తుందనటంలో సందేహంలేదు. కానీ అణచి వేత భరించలేక, వీరి ఆగడాలు సహించలేక ఈ దేశంలో అగ్రవర్ణ ఫాసిజం తలయెత్తితే..(కారంచేడు, చుండూరు ఘటనలు దానికి సూక్ష్మ రూపాలు) అప్పుడు ఈ వ్యవస్థా ఉండదు…ఈ ప్రభుత్వాలూ ఉండవు. తెగేదాకా లాగితే జరిగేది అంతే.

మండల్ కమిషన్ వ్యవహారంలో అనేక మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు బహిరంగంగా సజీవదహనానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నారు.తమకు జరిగే అన్యాయానికి అగ్రవర్ణాలవారి ప్రతిస్పందన ఎల్లవేళలా అలానే ఉంటుందనుకుంటే అది పొరపాటే.

[[తాడేపల్లి వారి 'తెగేదాకా లాగడం' వ్యాసావళి (ప్రస్తుతానికి నాలుగు భాగాలు) కొరకు |http://www.tadepally.com/]]

గురువారం 3 జూలై 2008

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---11

సామ్యవాద సిద్ధాంతం


సొంత ఆస్తి-కుటుంబం-రాజ్యం

మార్క్స్ తన గ్రంథాలలో ప్రవచించిన కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం మొదట్లో ప్రజలు ‘కమ్యూన్’ అనే సామాజిక వ్యవస్థలో జీవించేవారు. ఈ వ్యవస్థలో ఉన్నపుడు మానవునికి సొంత ఆస్తి, కుటుంబం, రాజ్యం ఇవేవీ ఉండేవి కావు. ప్రజలంతా ఎవరిపని వారు చేసుకొని దొరికిన ఆహారంతో బ్రతికేవారు. ఉత్పత్తి వనరులను ఎవరూ తమ వ్యక్తిగత ఆస్తులుగా ఉంచుకునేవారు కారు. ఎవరూ ఎవరిమీద దాడి చేసేవారు కాదు. వర్గాలు ఉండేవి కావు. కనుక వర్గ పోరాటం ఉండేది కాదు. దానితో పాలక(పీడక)వర్గం, పాలిత(పీడిత)వర్గాన్ని అణచటానికి ఉపయోగించే ‘రాజ్యం’ యొక్క అవసరం ఉందేది కాదు (సామ్యవాదం రాజ్యాన్ని ఇలానే అభివర్ణించింది). ఏ స్త్రీ ఏ ఒక్కరికీ స్వంతంకాదు. ఎవరు ఎవరితోనైనా సంతానం కనవచ్చు. కనుక కుటుంబాలు ఉండేవికావు. ఇటువంటి వ్యవస్థలో పీడన, దోపిడి ఉండేవికావు. ప్రజలంతా దేనికీ లోటు లేకుండా హాయిగా జీవించేవారు.

కానీ కాలక్రమంలో వ్యక్తి స్వార్థంతో స్వంత ఆస్తి కూడబెట్టడం ప్రారంభించాడు. దానితో సమాజంలో ప్రాబల్యం కలిగిన వ్యక్తులు మిగతా వారిని అణచి సమాజంలోని ఉత్పత్తి వనరులను తమ ఆస్తిగా ఉంచుకునేవారు. ఇలా ‘సొంత ఆస్తి’ ఏర్పడింది. అలా అణచటానికి సాధనంగా ‘రాజ్యం’ ఏర్పడింది. ఇలా కూడబెట్టిన ఆస్తిని తనదైన సంతానానికి వారసత్వ సంపదగా ఈయటానికి తనకు మాత్రమే సంతానాన్ని కనటానికి తనకు మాత్రమే స్త్రీ పరిమితమయ్యేటట్లుగా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా సమాజంలో ‘సొంత ఆస్తి’, ‘కుటుంబం’, ‘రాజ్యం’ అనబడే వ్యవస్థలు ఏర్పడ్డాయి. మరో సమూహం దాడినుండి తన సమూహాన్ని రక్షించుకొనటానికి కూడా ‘రాజ్యం’ అనే ఆయుధం ఉపయోగపడింది.


వర్గ పోరాటం

సొంత ఆస్తి, కుటుంబం, రాజ్యం ఏర్పడటంతో సమాజంలో ఆర్థికంగా కొందరు బలవంతులుగా మరికొందరు బలహీనులుగా ఉన్న పరిస్థితి తలయెత్తి సమాజం రెండు వర్గాలుగా (Classes) విడిపోయింది. బలవంతులు తమ ప్రాబల్యం కోసం బలహీనులను రాజ్యం అనే సాధనంతో అణచి ఉంచటానికి ప్రయత్నించటంతో ఈ రెండు వర్గాల మధ్యన అనివార్యమైన సంఘర్షణ తలయెత్తి వర్గపోరాటం (Class Struggle) ప్రారంభమైనది.

ఈ వర్గపోరాటం వలన సమాజం అనేక మార్పులకు లోనై, అనేక పరిణామ దశలను దాటి నేటి రూపంలోకి వచ్చింది. ఇప్పుడు బూర్జువా వర్గానికి, కార్మిక వర్గానికి పోరాటం జరుగుతున్నది. ఈ వర్గపోరాటంలో కార్మిక వర్గం అంతిమంగా విజయం సాధించి సమాజంలో కార్మిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించి స్వంత ఆస్తిని రద్దు (ఆస్తిహర్తల ఆస్తిహరణం) చేస్తుంది. తద్వారా సమాజంలో వర్గాలను నిర్మూలిస్తుంది. దానితో పాలిత వర్గాన్ని అణచటానికి తప్ప మరిదేనికీ పనికిరాని రాజ్యం నిరుపయోగమై డుల్లిపోతుంది (Withering Out of the State). దానితో అది కూడా రద్దౌతుంది. ఈ విధంగా ‘ఆధునిక కమ్యూన్ వ్యవస్థ’ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలో ఆదిమ కమ్యూన్ వ్యవస్థలో వలెనే ఎవరికీ ఆస్తులుండవు. వర్గాలు ఉండవు.రాజ్యం ఉండదు. అంతా సమానంగా ఉంటారు. ఎవరూ ఎవరినీ పీడించరు. అందరికీ వారి అవసరాలు సమృద్ధిగా తీరతాయి. కమ్యూన్ వ్యవస్థను ఆదర్శంగా భావించినది కనుక ఈ సిద్ధాంతానికి ‘కమ్యూనిజం’ అనే పేరు ఏర్పడింది.

గతితార్కిక భౌతికవాదం-చారిత్రక భౌతిక వాదం

ఆదిమ కమ్యూన్ వ్యవస్థ నుండి ఆధునిక కమ్యూన్ వ్యవస్థకు జరిగే ఈ మొత్తం పరిణామాన్ని గతితార్కిక తాత్త్విక విధానంలో కార్ల్‌మార్క్స్ వివరించాడు. ‘కాలగతిలో సమాజంలో మార్పు జరుగుతూ ఉత్పత్తి సాధనాలు మారినపుడు అది ఉత్పత్తి సంబంధాలలో మార్పునకు దారితీస్తుంది. ఆ మార్పు కొత్త ఉత్పత్తి సంబంధాలకు అనుగుణమైన వ్యవస్థ సమాజంలో ఏర్పడటానికి దారితీస్తుంది’ అని నిర్ధారించిన మార్క్స్ దానిని ఈ క్రింది విధంగా విశదీకరించాడు.

సొంత ఆస్థి, కుటుంబం, రాజ్యం ఏర్పడటంతో ఆదిమ కమ్యూన్ వ్యవస్థలో వర్గాలు ఏర్పడి మొదటగా బానిస వ్యవస్థ ఏర్పడింది. అంటే పాలక వర్గం చేతిలో ఆస్తి ఉండేది. అపుడు ఆస్తి అంటే ప్రధానంగా భూమి. సేద్య బానిసలు పనిచేసి ఉత్పత్తి చేసేవారు. ఈ బానిసలకు కూలి రూపంలోగానీ మరేరూపంలోగానీ డబ్బు చెల్లించబడేది కాదు. కేవలం బ్రతకడానికింత తిండి పడేసేవారు. రెండవది ఈ బానిసలకు పని చేయటం అనివార్యం. స్వేచ్ఛ ఉండేది కాదు. తప్పనిసరిగా తమ యజమాని వ్యవసాయ క్షేత్రంలో బ్రతుకంతా పనిచేసి తీరవలసినదే. ఈ వ్యవస్థలో వర్గాలు ‘సేద్యబానిస’ మరియు ‘బానిస యజమాని’. బానిస తిరుగుబాట్ల వలన ఈ వ్యవస్థ అంతరించింది. ఈ వ్యవస్థ యొక్క అవశేషాలు వెట్టిచాకిరీ రూపంలో నేటి సమాజంలో కూడా కనిపిస్తుంటాయి.

తరువాత కాలక్రమంలో ఫ్యూడల్ (భూస్వామ్య) వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ బానిస వ్యవస్థ కన్నా కొంత పురోగామి స్వభావం కలిగినది. ఈ కాలంలో పీడిత వర్గ ప్రజలు వ్యవసాయం చేసేవారు కానీ వారు బానిసలు కారు; స్వతంత్రులే. అయితే సెంటు భూమికూడా లేని పేదవారు. అందువలన భూస్వామి వద్ద భూమి కౌలుకు తీసుకొని, చాకిరీ చేసి పండించి, కౌలుకింద ఆ పంటలో చాలా భాగం ఆ భూస్వామికే ఇచ్చేవారు.

ఈ విధంగా సమాజంలో ‘బానిస వ్యవస్థ’ నుండి ‘ఫ్యూడల్ వ్యవస్థ’ వరకూ పరిణామం జరిగింది. అప్పుడు ఫ్యూడల్ ప్రభువులే రాజులు. కానీ ఆ ఫ్యూడల్ సమాజంలో కాలక్రమంలో వచ్చిన మార్పుల వలన నూతన ఉత్పత్తి వనరులు ఏర్పడ్డాయి. అవే పరిశ్రమలు. ఫ్యూడల్ వ్యవస్థలో వస్తువులు కార్ఖానాలలో తయారవుతుండేవి. ఆ కార్ఖానాలు ఏమంత పెద్ద ఆస్తులుగా భావించబడేవి కావు. అపుడు ప్రధాన ఆస్తి భూమి మాత్రమే. కానీ ‘పారిశ్రామిక విప్లవం’ వచ్చిన తరువాత వస్తూత్పత్తి పెద్ద పెద్ద పరిశ్రమలలో జరగటం, వాటి వ్యాపారం ఖండాంతరంగా జరగటంతో అవి భూములను మించిన ఉత్పత్తి సాధనాలుగా పరిణమించాయి. అంటే సమాజంలో ఉత్పత్తిసాధనాలలో మార్పు వచ్చింది. మొదట్లో ఈ మార్పు ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో వృద్ధిచెందింది. ఫ్యూడల్ వ్యవస్థకు ఆధారభూతమైన ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాలు వేరు. ఈ ఆధునిక పరిశ్రమలతో కూడుకున్న ఉత్పత్తి సంబంధాలు వేరు. ఆ వర్గాలు వేరు, ఈ వర్గాలు వేరు. ఫ్యూడల్ వ్యవస్థలో వర్గాలు ‘భూస్వామి’ మరియు ‘పేదరైతు’. పారిశ్రామిక వ్యవస్థలో వర్గాలు ‘బూర్జువా పారిశ్రామిక యజమాని’ (పెట్టుబడిదారుడు) మరియు ‘కార్మికుడు’.

మొదట్లో ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో వృద్ధి పొందిన ఈ నూతన ఉత్పత్తి సంబంధాలకు ఆ వ్యవస్థ కాలక్రమంలో ఆటంకంగా పరిణమించింది. కనుక ఈ భూస్వామ్య వ్యవస్థను కూలదోసి తమ ఉత్పత్తి సంబంధాలకు అనుగుణమైన నూతన వ్యవస్థను ఏర్పరచటానికి బూర్జువా శక్తులు ప్రయత్నించి విజయాన్ని పొందాయి. అలా ఏర్పడిందే ‘పెట్టుబడిదారీ వ్యవస్థ’. దానికి అనుగుణంగా రాజకీయంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ కన్నా పురోగామిశీలి. ఈ విధంగా సమాజం మరికొంత వృద్ధి చెందింది.

కార్మిక వర్గ నియంతృత్వం

పరిశ్రమలు విస్తరించటం వలన తిరిగి ఇప్పుడు కార్మిక వర్గం సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది వారిలో చైతన్యం, ఐకమత్యం, రాజకీయ అవగాహన పెంపొందటం వలన కాలక్రమంలో ఈ కార్మిక వర్గం విప్లవాత్మకమైన క్రియాశీలతను సంతరించుకుంటుంది. కార్మిక వర్గం యొక్క శ్రమను దోపిడీ చేస్తున్న ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ క్రమంగా ఆ వర్గం యొక్క మనుగడకు ఆటంకంగా పరిణమిస్తుంది. అప్పుడు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కూల్చివేయబడి దోపిడీలేని వర్గరహితమైన నూతన వ్యవస్థ ఏర్పడుతుంది. కార్మిక వర్గం ఈ విప్లవానికి ఆధారభూతమై ముందుండి నడిపిస్తుంది. వర్గరహిత సమాజం ఏర్పడటానికి ముందు ‘కార్మిక వర్గ నియంతృత్వం’ స్థాపించబడి, సొంత ఆస్తి రద్దు చేయబడుతుంది.

ఈ విధంగా కార్ల్‌మార్క్స్ గతితార్కిక తత్త్వశాస్త్రం ప్రకారం ‘శాస్త్రీయ కమ్యూనిజం’ను వివరించాడు.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ఈ మొత్తం పోరాటంలో కార్మికులకు ప్రధానమైన బలం ఐకమత్యం, ఏకాభిప్రాయం, సంఘటితమవడం. వారి ప్రధాన ఆయుధం ‘సమ్మె’. మొదట కార్మికులు అసంఘటితంగా ఉన్నపుడు వారు బూర్జువా పారిశ్రామిక యజమానుల దోపిడీ భరించలేక యంత్రాలను విరగగొట్టడం, తగులబెట్టడం లాంటి నిస్సహాయ చర్యలకు పాల్పడేవారు. కానీ కాలక్రమంలో తమలాంటి వారే అంతటా ఉన్నారని గ్రహించి అంతా ఒక తాటి మీదకు వచ్చి సంఘటిత పోరాటం చేయటంద్వారా ప్రయోజనం ఉంటుందని గ్రహించి అలా ఒక్కటిగా సంఘటితమౌతారు. అలా ఏర్పడినదే ‘కార్మికోద్యమం’ లేక ‘ట్రేడ్‌యూనియన్ ఉద్యమం’. ఈ ట్రేడ్‌యూనియన్లు తమ హక్కుల కొరకు పోరాడతాయి. ఒక ఫాక్టరీలోని యూనియన్‌లో ఆ ఫాక్టరీలోని కార్మికులంతా సభ్యులుగా ఉంటారు. తుదకు ఈ ట్రేడ్‌యూనియన్లన్నీ ఏకమై మొత్తం కార్మికవర్గమంతా ఒక్కటై పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చివేస్తుంది. ఈ లక్ష్య సాధన కొరకే కమ్యూనిష్టు ఉద్యమం సుప్రసిద్ధమైన ఈ క్రింది నినాదాన్నిచ్చింది.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోరాడితే పోయేదేమీలేదు మీ సంకెళ్ళు తప్ప’ ......(సశేషం)

బుధవారం 2 జూలై 2008

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---10

(గమనిక : 9వ భాగం యొక్క కామెంట్స్‌లో ఉపయుక్త గ్రంథాలు సూచించబడ్డాయి. గమనించగలరు.)

సామ్యవాద జననం


వ్యక్తి విలవిల-రాజ్యం వెలవెల

పెట్టుబడిదారీ వ్యవస్థలో ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే కాపాడబడ్డాయి. ‘వ్యక్తి’ మరియు ‘రాజ్యం’ ల యొక్క ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రధానంగా వ్యక్తి ప్రయోజనాల మీద ప్రత్యక్ష దాడి జరిగింది. దానితో వ్యక్తి ప్రమాదంలో పడినట్లుగా భావించబడింది. ధనవంతుడు పేదవాడిని దోచాడు. ధనిక దేశాలు బడుగు దేశాలను దోచాయి. సామాజిక పరమైన ఉత్పత్తివనరులన్నీ సమాజంలోని కొద్దిమంది ధనవంతుల చేతులలో స్వంత ఆస్తి రూపంలో కేంద్రీకృతమై మిగతా వారంతా ఆ ధనవంతుల ఉత్పత్తి వనరులలో అంటే ఫాక్టరీలలో కూలికి పనిచేసే కార్మికులుగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.ధనిక దేశాలు పేద దేశాలను ఆక్రమించి, తమ వలసలుగా చేసుకొని వాటిని తమ దేశ పరిశ్రమలకు ముడిసరకు సరఫరాదారులుగా, తమ ఉత్పత్తులకు మార్కెట్లుగా వాడుకున్నాయి.

ఫాక్టరీలలో పనిచేసే కార్మికులు పొద్దస్తమానం చాకిరీ చేయవలసి వచ్చేది. వారికి నిర్దిష్టమైన పనిగంటలు ఉండేవికావు. రోజుకి 18గం|| నుండి 20గం|| వరకు పనిచేయవలసి వచ్చేది. బ్రతకటానికి అదికూడా జీవచ్ఛవంలా బ్రతకడానికి సరిపడే కూలి మాత్రమే ఫాక్టరీ యజమాని చెల్లించేవాడు. కార్మికులకు ఏ విధమైన హక్కులూ ఉండేవి కావు. సమాజం ఎంతగా వికసించిందో వ్యక్తి అంతగా దోపిడీ చేయబడ్డాడు.

సామాజిక శక్తుల (బూర్జువా వర్గం) కార్యకలాపాలు మానవ జీవితాన్ని డామినేట్ చేసాయి. ఖండాంతర వాణిజ్యం, ఆధునిక యంత్ర సామాగ్రితో పెద్ద పెద్ద పరిశ్రమలు, నూతన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు, నూతన శాస్త్రాల అభివృద్ది, ఆధునిక జీవన విధానం ఇత్యాది అన్నింటి ముందు రాజ్య శక్తి, ఫ్యూడల్ జీవన శైలి వెలవెల బోయాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో రాజ్యం సామాజిక శక్తులకు అంటే కొల్లదారీ బూర్జువా వర్గానికి కావలసిన పనులు చేసి పెట్టే బంట్రోతుగా మారినది.సమాజం ముందు రాజ్యం తన ప్రాబల్యాన్ని కోల్పోయింది.తన కార్యకలాపాల విస్తృతి ద్వారా రాజ్యాన్ని ‘సమాజం’ సులభంగా డామినేట్ చేసేసింది.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దోపిడీ వ్యక్తి స్థాయిలోనే కాక జాతి స్థాయిలో కూడా జరిగింది. ధనవంతుడు పేదవాడిని దోస్తే, ధనిక దేశాలు అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలైన సాధనా సంపత్తిని కలిగిన దేశాలు వాటి సాయంతో అవిలేని బడుగు దేశాలను ఆక్రమించి దోపిడీ చేశాయి. ఐతే దీనివలన ఐరోపాలో జనించిన నూతన విజ్ఞాన శాస్త్రాలు, ఆధునిక నాగరికత, శాస్త్రీయ దృక్పథం మొదలైనవి ప్రపంచమంతటా వ్యాప్తిచెందాయి. ప్రపంచ ప్రజలందరూ తమతమ జాతి ఆలోచనా పరిధులనుండి బయటపడి ఈ నూతన భావాలను అందిపుచ్చుకున్నారు. ప్రపంచ ప్రజలందరి జీవన శైలిలో ఒక ఏకరూపత సాధించబడింది. ఈ వలస పాలన వలననే ప్రపంచమంతా ఒక్కసారిగా ఫ్యూడల్ దశనుండి అంతకన్నా పురోగామి అయిన ఆధునిక పెట్టుబడిదారీ దశలోనికి పరిణామం చెందింది.

అయితే నాణానికి మరోవైపుగా వ్యక్తి దారుణంగా దోపిడీ చేయాబడ్డాడు. సమాజం ఎంతగా వికసించిందో వ్యక్తి అంతగా అణగారిపోయాడు. వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. ‘సమాజం’ నుండి ‘వ్యక్తి’ని రక్షించటం తక్షణ కర్తవ్యం గా భావించబడింది. ఈ ఊపులో సమాజం లేక సామాజిక శక్తులవలన ప్రపంచానికి జరిగిన మేలు మరువబడింది. గతంలో రాజ్యం చేసిన మేలు మరచి అది చేసిన కీడును వ్యతిరేకిస్తూ సమాజం ఏవిధంగా విప్లవ పథంలో పయనించిందో ఈ సారీ అలానే సమాజం చేసిన మేలు మరువబడి అది చేసిన కీడుకు వ్యతిరేకంగా మానవుడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఈ ఆలోచనలే క్రమంగా ‘సామ్యవాదం’గా పరిణమించాయి.ఈ సామ్యవాదం హేతువాద ప్రధానమైనది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు శాస్త్రీయ దృక్పథం ఎలానో సామ్యవాదానికి హేతువాద దృక్పథం అలాంటిది.

ఊహా స్వర్గం

ఈ ఆలోచనలు ప్రారంభంలో రాబర్ట్ ఓవెన్, చార్లెస్ ఫొరియెర్, సెయింట్ సైమన్ మొదలైన వారి ద్వారా జరిగాయి. సమాజంలో వ్యక్తి ఎవరి దోపిడీకీ గురికాకుండా తన హక్కులను అనుభవిస్తూ, మిగతా వారితో సమానంగా, ఆనందంగా బ్రతకాలని వీరు కాంక్షించారు. ఫాక్టరీ యజమానులు స్వచ్ఛందంగా మారాలని వీరు కోరుకున్నారు. స్వయంగా వీరు ఫాక్టరీలను స్థాపించి కార్మికుల శ్రేయస్సుకు పాటుపడుతూ మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ప్రయత్నించారు.

ఇటువంటి ఆలోచనలన్నీ ‘ఊహాస్వర్గ వాదం’(Utopia) గా భావించబడ్డాయి. ఇవి ఎటువంటి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. ఊహాజనితంగా,’ఇలా ఉంటే బాగుండు’అన్న పద్ధతిలో జరిగాయి.

శాస్త్రీయ కమ్యూనిజం

అయితే కాలక్రమంలో ఇటువంటి ఆలోచనలన్నీ ఒక క్రమమైన రూపుదాల్చాయి.క్రీ||శ.1818వ సం||లో జర్మనీలో జన్మించిన కార్ల్‌మార్క్స్ అనే ఆర్థిక, రాజనీతి, తత్వశాస్త్ర వేత్త సామ్యవాద విచారధారకు ఒక శాస్త్రీయమైన రూపాన్ని ఇచ్చాడు. హెగెల్ అనే సుప్రసిద్ధ తాత్త్వికుని గతితార్కిక సిద్ధాంతం (Dialectic Theory) ప్రకారం ఈయన సామ్యవాదాన్ని శాస్త్రీయంగా వివరించాడు.’పెట్టుబడి’(Das Capital) అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో ఆయన తన సిద్ధాంతాన్ని వివరించాడు. సమాజం ఏ విధంగా వర్గాలుగా విభజింపబడిందీ, పాలకవర్గం రాజ్యశక్తిని ఉపయోగించి పాలిత వర్గాన్ని అణచివేస్తూ దాన్నెలా దోపిడీ చేస్తున్నదీ, సమాజంలో ఉత్పత్తి సాధనాలను స్వంత ఆస్తిగా కలిగి ఉన్నవారు అమ్ముకోవటానికి శారీరక శ్రమ తప్ప మరేమీ లేని కార్మికులను ఏ విధంగా పీల్చిపిప్పిచేస్తున్నదీ, సమాజంలో ఉత్పత్తి సంబంధాలు ఏవిధంగా మానవ జీవితాన్ని నిర్దేశిస్తాయి మొదలైన విషయాలన్నీ కూలంకషంగా ఆ గ్రంథంలో చర్చించాడు.

ఈ గ్రంథం మానవుని సామాజిక జీవితాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. మానవుని ఆలోచనా ధోరణిలో పెనుమార్పులు తీసుకువచ్చింది. మానవునికి తార్కిక దృక్పథాన్ని అంటే హేతువాద దృష్టిని అలవరచింది. ఈ గ్రంథం ప్రచురింపబడిన నాటినుండి నేటికాలం వరకు ఎవరు ఏవిధమైన ఆలోచన చేసినా దాని నేపథ్యంలో ఎంతోకొంత ఈ సామ్యవాద ఆలోచనాధోరణి ఛాయలు ఉండకపోవటం అరుదు. అంతగా ఈ గ్రంథంలోని విచారధార మానవుడిని ప్రభావితం చేసింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక

కార్ల్ మార్క్స్ తన సన్నిహితుడైన ఫ్రెడరిక్ ఎంగెల్స్ అనే తత్త్వవేత్తతో కలసి ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’(Communist Manifesto) అనే చిరు గ్రంథాన్ని కూడా 1848వ సం||లో రచించాడు. సామ్యవాద సాహిత్యంలో ఇది కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రంథం. దీనిలో చరిత్రలోజరిగిన వర్గపోరాటక్రమాన్ని సంగ్రహంగా వివరించి అది అంతిమంగా కార్మికవర్గ నియంతృత్వానికి ఎలా దారితీస్తుందో వివరించి కమ్యూనిస్టు పార్టీ కార్యాచరణను సంగ్రహంగా వివరించటం జరిగినది......(సశేషం)