6, ఫిబ్రవరి 2008, బుధవారం

చలం-ఒక సమీక్ష (ఒకటవ భాగం)

చలం తన రచనలలో స్త్రీలు, పిల్లలు స్వేచ్చగా జీవించగలిగిన కుటుంబాన్ని కోరుకున్నాడు. ఐతే నిజజీవితంలో చలం తాను కోరిన కుటుంబాన్ని తానే నిర్మించలేకపోయాడు.

చలం ఈవిధంగా విఫలమవటం వలన ఆయన వేలెత్తి చూపిన దోషాలన్నీ దోషాలు కాకుండాపోవు. చలం ప్రధానంగా సమాజాన్ని, సామాజికజీవితాన్ని కాదు విమర్శించినది. వ్యక్తిని, వ్యక్తి యొక్క కుటుంబజీవితాన్ని, వ్యక్తి మనస్తత్వాన్ని విమర్శించాడు. చలం కుటుంబజీవితంలోని మూర్ఖత్వాన్ని, ద్వంద్వనీతిని, అమానుషత్వాన్ని స్వయంగా అనుభవించి, అసహ్యించుకొని దానిమీద తన రచనల ద్వారా తీవ్రమైన దాడి చేసాడు. చలం వీటన్నింటి మీద పెంచుకున్న కసి వలన ఈ దాడిలో తీవ్రతనే తన లక్షణంగా చేసుకున్నాడు. నిజానికి ఈ తీవ్రతవలనే మూర్ఖమైన కుటుంబజీవితాన్ని కొనసాగిస్తున్న వారికి అంతగా చురక వేయగలిగాడు.

ఐతే ఈ మూర్ఖత్వం ఒక రకమైన తీవ్రతైతే చలం అభిప్రాయాలు మరో రకమైన తీవ్రతగా పరిణమించి ఆ తీవ్రతకు చలం మరియు ఆయన కుటుంబం బలైపోయింది. చలం ఎంచుకున్న అంశం కుటుంబజీవితం, వ్యక్తిగత ప్రవర్తన అయ్యేసరికి అది తప్పనిసరిగా, సహజంగా ఆ అభిప్రాయాలను చలం ఆచరించటం జరిగింది. ఆ అభిప్రాయాల తీవ్రత యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో చలం కుటుంబమే, చలం జీవితమే ఒక ఉదాహరణగా నిరూపణ ఐనది. చలం నిజాయితీపరుడవటం వలన తన రచనలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను తన జీవితంలో కూడా ఆచరించటం జరిగినది. అందువలనే ఆ రచనలు, ఆ అభిప్రాయాలు అంత బలంగా ప్రజలను తాకాయి.

మనకు చలం హృదయం ముఖ్యం. చలం సారాంశం ముఖ్యం. చలం వ్యక్తి ప్రవర్తనలోని, కుటుంబ జీవితంలోని ఏఏ చెడుగులను వేలెత్తి చూపాడో అది ముఖ్యం. అంతేకానీ చలం రచనలలోని తీవ్రత అప్రధానమైనది. చలం తీవ్రతలోని అంతరార్ధం వేరు. ఆ తీవ్రత ఆచరణీయమని కాదు. ఆ తీవ్రత ఉద్దేశ్యం ప్రజలకు తమలోని దోషాన్ని బలంగా చెప్పటమే..... ఐతే చలం తాను ఏంచెప్పాడో అదే ఆచరించి ఆతీవ్రతలోని దోషానికి తనను, తన కుటుంబాన్ని బలిచేసాడు...(సశేషం)

1 కామెంట్‌: