3, జులై 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---11





సామ్యవాద సిద్ధాంతం


సొంత ఆస్తి-కుటుంబం-రాజ్యం

మార్క్స్ తన గ్రంథాలలో ప్రవచించిన కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం మొదట్లో ప్రజలు ‘కమ్యూన్’ అనే సామాజిక వ్యవస్థలో జీవించేవారు. ఈ వ్యవస్థలో ఉన్నపుడు మానవునికి సొంత ఆస్తి, కుటుంబం, రాజ్యం ఇవేవీ ఉండేవి కావు. ప్రజలంతా ఎవరిపని వారు చేసుకొని దొరికిన ఆహారంతో బ్రతికేవారు. ఉత్పత్తి వనరులను ఎవరూ తమ వ్యక్తిగత ఆస్తులుగా ఉంచుకునేవారు కారు. ఎవరూ ఎవరిమీద దాడి చేసేవారు కాదు. వర్గాలు ఉండేవి కావు. కనుక వర్గ పోరాటం ఉండేది కాదు. దానితో పాలక(పీడక)వర్గం, పాలిత(పీడిత)వర్గాన్ని అణచటానికి ఉపయోగించే ‘రాజ్యం’ యొక్క అవసరం ఉందేది కాదు (సామ్యవాదం రాజ్యాన్ని ఇలానే అభివర్ణించింది). ఏ స్త్రీ ఏ ఒక్కరికీ స్వంతంకాదు. ఎవరు ఎవరితోనైనా సంతానం కనవచ్చు. కనుక కుటుంబాలు ఉండేవికావు. ఇటువంటి వ్యవస్థలో పీడన, దోపిడి ఉండేవికావు. ప్రజలంతా దేనికీ లోటు లేకుండా హాయిగా జీవించేవారు.

కానీ కాలక్రమంలో వ్యక్తి స్వార్థంతో స్వంత ఆస్తి కూడబెట్టడం ప్రారంభించాడు. దానితో సమాజంలో ప్రాబల్యం కలిగిన వ్యక్తులు మిగతా వారిని అణచి సమాజంలోని ఉత్పత్తి వనరులను తమ ఆస్తిగా ఉంచుకునేవారు. ఇలా ‘సొంత ఆస్తి’ ఏర్పడింది. అలా అణచటానికి సాధనంగా ‘రాజ్యం’ ఏర్పడింది. ఇలా కూడబెట్టిన ఆస్తిని తనదైన సంతానానికి వారసత్వ సంపదగా ఈయటానికి తనకు మాత్రమే సంతానాన్ని కనటానికి తనకు మాత్రమే స్త్రీ పరిమితమయ్యేటట్లుగా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా సమాజంలో ‘సొంత ఆస్తి’, ‘కుటుంబం’, ‘రాజ్యం’ అనబడే వ్యవస్థలు ఏర్పడ్డాయి. మరో సమూహం దాడినుండి తన సమూహాన్ని రక్షించుకొనటానికి కూడా ‘రాజ్యం’ అనే ఆయుధం ఉపయోగపడింది.


వర్గ పోరాటం

సొంత ఆస్తి, కుటుంబం, రాజ్యం ఏర్పడటంతో సమాజంలో ఆర్థికంగా కొందరు బలవంతులుగా మరికొందరు బలహీనులుగా ఉన్న పరిస్థితి తలయెత్తి సమాజం రెండు వర్గాలుగా (Classes) విడిపోయింది. బలవంతులు తమ ప్రాబల్యం కోసం బలహీనులను రాజ్యం అనే సాధనంతో అణచి ఉంచటానికి ప్రయత్నించటంతో ఈ రెండు వర్గాల మధ్యన అనివార్యమైన సంఘర్షణ తలయెత్తి వర్గపోరాటం (Class Struggle) ప్రారంభమైనది.

ఈ వర్గపోరాటం వలన సమాజం అనేక మార్పులకు లోనై, అనేక పరిణామ దశలను దాటి నేటి రూపంలోకి వచ్చింది. ఇప్పుడు బూర్జువా వర్గానికి, కార్మిక వర్గానికి పోరాటం జరుగుతున్నది. ఈ వర్గపోరాటంలో కార్మిక వర్గం అంతిమంగా విజయం సాధించి సమాజంలో కార్మిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించి స్వంత ఆస్తిని రద్దు (ఆస్తిహర్తల ఆస్తిహరణం) చేస్తుంది. తద్వారా సమాజంలో వర్గాలను నిర్మూలిస్తుంది. దానితో పాలిత వర్గాన్ని అణచటానికి తప్ప మరిదేనికీ పనికిరాని రాజ్యం నిరుపయోగమై డుల్లిపోతుంది (Withering Out of the State). దానితో అది కూడా రద్దౌతుంది. ఈ విధంగా ‘ఆధునిక కమ్యూన్ వ్యవస్థ’ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలో ఆదిమ కమ్యూన్ వ్యవస్థలో వలెనే ఎవరికీ ఆస్తులుండవు. వర్గాలు ఉండవు.రాజ్యం ఉండదు. అంతా సమానంగా ఉంటారు. ఎవరూ ఎవరినీ పీడించరు. అందరికీ వారి అవసరాలు సమృద్ధిగా తీరతాయి. కమ్యూన్ వ్యవస్థను ఆదర్శంగా భావించినది కనుక ఈ సిద్ధాంతానికి ‘కమ్యూనిజం’ అనే పేరు ఏర్పడింది.

గతితార్కిక భౌతికవాదం-చారిత్రక భౌతిక వాదం

ఆదిమ కమ్యూన్ వ్యవస్థ నుండి ఆధునిక కమ్యూన్ వ్యవస్థకు జరిగే ఈ మొత్తం పరిణామాన్ని గతితార్కిక తాత్త్విక విధానంలో కార్ల్‌మార్క్స్ వివరించాడు. ‘కాలగతిలో సమాజంలో మార్పు జరుగుతూ ఉత్పత్తి సాధనాలు మారినపుడు అది ఉత్పత్తి సంబంధాలలో మార్పునకు దారితీస్తుంది. ఆ మార్పు కొత్త ఉత్పత్తి సంబంధాలకు అనుగుణమైన వ్యవస్థ సమాజంలో ఏర్పడటానికి దారితీస్తుంది’ అని నిర్ధారించిన మార్క్స్ దానిని ఈ క్రింది విధంగా విశదీకరించాడు.

సొంత ఆస్థి, కుటుంబం, రాజ్యం ఏర్పడటంతో ఆదిమ కమ్యూన్ వ్యవస్థలో వర్గాలు ఏర్పడి మొదటగా బానిస వ్యవస్థ ఏర్పడింది. అంటే పాలక వర్గం చేతిలో ఆస్తి ఉండేది. అపుడు ఆస్తి అంటే ప్రధానంగా భూమి. సేద్య బానిసలు పనిచేసి ఉత్పత్తి చేసేవారు. ఈ బానిసలకు కూలి రూపంలోగానీ మరేరూపంలోగానీ డబ్బు చెల్లించబడేది కాదు. కేవలం బ్రతకడానికింత తిండి పడేసేవారు. రెండవది ఈ బానిసలకు పని చేయటం అనివార్యం. స్వేచ్ఛ ఉండేది కాదు. తప్పనిసరిగా తమ యజమాని వ్యవసాయ క్షేత్రంలో బ్రతుకంతా పనిచేసి తీరవలసినదే. ఈ వ్యవస్థలో వర్గాలు ‘సేద్యబానిస’ మరియు ‘బానిస యజమాని’. బానిస తిరుగుబాట్ల వలన ఈ వ్యవస్థ అంతరించింది. ఈ వ్యవస్థ యొక్క అవశేషాలు వెట్టిచాకిరీ రూపంలో నేటి సమాజంలో కూడా కనిపిస్తుంటాయి.

తరువాత కాలక్రమంలో ఫ్యూడల్ (భూస్వామ్య) వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ బానిస వ్యవస్థ కన్నా కొంత పురోగామి స్వభావం కలిగినది. ఈ కాలంలో పీడిత వర్గ ప్రజలు వ్యవసాయం చేసేవారు కానీ వారు బానిసలు కారు; స్వతంత్రులే. అయితే సెంటు భూమికూడా లేని పేదవారు. అందువలన భూస్వామి వద్ద భూమి కౌలుకు తీసుకొని, చాకిరీ చేసి పండించి, కౌలుకింద ఆ పంటలో చాలా భాగం ఆ భూస్వామికే ఇచ్చేవారు.

ఈ విధంగా సమాజంలో ‘బానిస వ్యవస్థ’ నుండి ‘ఫ్యూడల్ వ్యవస్థ’ వరకూ పరిణామం జరిగింది. అప్పుడు ఫ్యూడల్ ప్రభువులే రాజులు. కానీ ఆ ఫ్యూడల్ సమాజంలో కాలక్రమంలో వచ్చిన మార్పుల వలన నూతన ఉత్పత్తి వనరులు ఏర్పడ్డాయి. అవే పరిశ్రమలు. ఫ్యూడల్ వ్యవస్థలో వస్తువులు కార్ఖానాలలో తయారవుతుండేవి. ఆ కార్ఖానాలు ఏమంత పెద్ద ఆస్తులుగా భావించబడేవి కావు. అపుడు ప్రధాన ఆస్తి భూమి మాత్రమే. కానీ ‘పారిశ్రామిక విప్లవం’ వచ్చిన తరువాత వస్తూత్పత్తి పెద్ద పెద్ద పరిశ్రమలలో జరగటం, వాటి వ్యాపారం ఖండాంతరంగా జరగటంతో అవి భూములను మించిన ఉత్పత్తి సాధనాలుగా పరిణమించాయి. అంటే సమాజంలో ఉత్పత్తిసాధనాలలో మార్పు వచ్చింది. మొదట్లో ఈ మార్పు ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో వృద్ధిచెందింది. ఫ్యూడల్ వ్యవస్థకు ఆధారభూతమైన ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాలు వేరు. ఈ ఆధునిక పరిశ్రమలతో కూడుకున్న ఉత్పత్తి సంబంధాలు వేరు. ఆ వర్గాలు వేరు, ఈ వర్గాలు వేరు. ఫ్యూడల్ వ్యవస్థలో వర్గాలు ‘భూస్వామి’ మరియు ‘పేదరైతు’. పారిశ్రామిక వ్యవస్థలో వర్గాలు ‘బూర్జువా పారిశ్రామిక యజమాని’ (పెట్టుబడిదారుడు) మరియు ‘కార్మికుడు’.

మొదట్లో ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో వృద్ధి పొందిన ఈ నూతన ఉత్పత్తి సంబంధాలకు ఆ వ్యవస్థ కాలక్రమంలో ఆటంకంగా పరిణమించింది. కనుక ఈ భూస్వామ్య వ్యవస్థను కూలదోసి తమ ఉత్పత్తి సంబంధాలకు అనుగుణమైన నూతన వ్యవస్థను ఏర్పరచటానికి బూర్జువా శక్తులు ప్రయత్నించి విజయాన్ని పొందాయి. అలా ఏర్పడిందే ‘పెట్టుబడిదారీ వ్యవస్థ’. దానికి అనుగుణంగా రాజకీయంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ కన్నా పురోగామిశీలి. ఈ విధంగా సమాజం మరికొంత వృద్ధి చెందింది.

కార్మిక వర్గ నియంతృత్వం

పరిశ్రమలు విస్తరించటం వలన తిరిగి ఇప్పుడు కార్మిక వర్గం సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది వారిలో చైతన్యం, ఐకమత్యం, రాజకీయ అవగాహన పెంపొందటం వలన కాలక్రమంలో ఈ కార్మిక వర్గం విప్లవాత్మకమైన క్రియాశీలతను సంతరించుకుంటుంది. కార్మిక వర్గం యొక్క శ్రమను దోపిడీ చేస్తున్న ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ క్రమంగా ఆ వర్గం యొక్క మనుగడకు ఆటంకంగా పరిణమిస్తుంది. అప్పుడు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కూల్చివేయబడి దోపిడీలేని వర్గరహితమైన నూతన వ్యవస్థ ఏర్పడుతుంది. కార్మిక వర్గం ఈ విప్లవానికి ఆధారభూతమై ముందుండి నడిపిస్తుంది. వర్గరహిత సమాజం ఏర్పడటానికి ముందు ‘కార్మిక వర్గ నియంతృత్వం’ స్థాపించబడి, సొంత ఆస్తి రద్దు చేయబడుతుంది.

ఈ విధంగా కార్ల్‌మార్క్స్ గతితార్కిక తత్త్వశాస్త్రం ప్రకారం ‘శాస్త్రీయ కమ్యూనిజం’ను వివరించాడు.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ఈ మొత్తం పోరాటంలో కార్మికులకు ప్రధానమైన బలం ఐకమత్యం, ఏకాభిప్రాయం, సంఘటితమవడం. వారి ప్రధాన ఆయుధం ‘సమ్మె’. మొదట కార్మికులు అసంఘటితంగా ఉన్నపుడు వారు బూర్జువా పారిశ్రామిక యజమానుల దోపిడీ భరించలేక యంత్రాలను విరగగొట్టడం, తగులబెట్టడం లాంటి నిస్సహాయ చర్యలకు పాల్పడేవారు. కానీ కాలక్రమంలో తమలాంటి వారే అంతటా ఉన్నారని గ్రహించి అంతా ఒక తాటి మీదకు వచ్చి సంఘటిత పోరాటం చేయటంద్వారా ప్రయోజనం ఉంటుందని గ్రహించి అలా ఒక్కటిగా సంఘటితమౌతారు. అలా ఏర్పడినదే ‘కార్మికోద్యమం’ లేక ‘ట్రేడ్‌యూనియన్ ఉద్యమం’. ఈ ట్రేడ్‌యూనియన్లు తమ హక్కుల కొరకు పోరాడతాయి. ఒక ఫాక్టరీలోని యూనియన్‌లో ఆ ఫాక్టరీలోని కార్మికులంతా సభ్యులుగా ఉంటారు. తుదకు ఈ ట్రేడ్‌యూనియన్లన్నీ ఏకమై మొత్తం కార్మికవర్గమంతా ఒక్కటై పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చివేస్తుంది. ఈ లక్ష్య సాధన కొరకే కమ్యూనిష్టు ఉద్యమం సుప్రసిద్ధమైన ఈ క్రింది నినాదాన్నిచ్చింది.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోరాడితే పోయేదేమీలేదు మీ సంకెళ్ళు తప్ప’ ......(సశేషం)


2, జులై 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---10





సామ్యవాద జననం


వ్యక్తి విలవిల-రాజ్యం వెలవెల

పెట్టుబడిదారీ వ్యవస్థలో ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే కాపాడబడ్డాయి. ‘వ్యక్తి’ మరియు ‘రాజ్యం’ ల యొక్క ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రధానంగా వ్యక్తి ప్రయోజనాల మీద ప్రత్యక్ష దాడి జరిగింది. దానితో వ్యక్తి ప్రమాదంలో పడినట్లుగా భావించబడింది. ధనవంతుడు పేదవాడిని దోచాడు. ధనిక దేశాలు బడుగు దేశాలను దోచాయి. సామాజిక పరమైన ఉత్పత్తివనరులన్నీ సమాజంలోని కొద్దిమంది ధనవంతుల చేతులలో స్వంత ఆస్తి రూపంలో కేంద్రీకృతమై మిగతా వారంతా ఆ ధనవంతుల ఉత్పత్తి వనరులలో అంటే ఫాక్టరీలలో కూలికి పనిచేసే కార్మికులుగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.ధనిక దేశాలు పేద దేశాలను ఆక్రమించి, తమ వలసలుగా చేసుకొని వాటిని తమ దేశ పరిశ్రమలకు ముడిసరకు సరఫరాదారులుగా, తమ ఉత్పత్తులకు మార్కెట్లుగా వాడుకున్నాయి.

ఫాక్టరీలలో పనిచేసే కార్మికులు పొద్దస్తమానం చాకిరీ చేయవలసి వచ్చేది. వారికి నిర్దిష్టమైన పనిగంటలు ఉండేవికావు. రోజుకి 18గం|| నుండి 20గం|| వరకు పనిచేయవలసి వచ్చేది. బ్రతకటానికి అదికూడా జీవచ్ఛవంలా బ్రతకడానికి సరిపడే కూలి మాత్రమే ఫాక్టరీ యజమాని చెల్లించేవాడు. కార్మికులకు ఏ విధమైన హక్కులూ ఉండేవి కావు. సమాజం ఎంతగా వికసించిందో వ్యక్తి అంతగా దోపిడీ చేయబడ్డాడు.

సామాజిక శక్తుల (బూర్జువా వర్గం) కార్యకలాపాలు మానవ జీవితాన్ని డామినేట్ చేసాయి. ఖండాంతర వాణిజ్యం, ఆధునిక యంత్ర సామాగ్రితో పెద్ద పెద్ద పరిశ్రమలు, నూతన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు, నూతన శాస్త్రాల అభివృద్ది, ఆధునిక జీవన విధానం ఇత్యాది అన్నింటి ముందు రాజ్య శక్తి, ఫ్యూడల్ జీవన శైలి వెలవెల బోయాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో రాజ్యం సామాజిక శక్తులకు అంటే కొల్లదారీ బూర్జువా వర్గానికి కావలసిన పనులు చేసి పెట్టే బంట్రోతుగా మారినది.సమాజం ముందు రాజ్యం తన ప్రాబల్యాన్ని కోల్పోయింది.తన కార్యకలాపాల విస్తృతి ద్వారా రాజ్యాన్ని ‘సమాజం’ సులభంగా డామినేట్ చేసేసింది.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దోపిడీ వ్యక్తి స్థాయిలోనే కాక జాతి స్థాయిలో కూడా జరిగింది. ధనవంతుడు పేదవాడిని దోస్తే, ధనిక దేశాలు అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలైన సాధనా సంపత్తిని కలిగిన దేశాలు వాటి సాయంతో అవిలేని బడుగు దేశాలను ఆక్రమించి దోపిడీ చేశాయి. ఐతే దీనివలన ఐరోపాలో జనించిన నూతన విజ్ఞాన శాస్త్రాలు, ఆధునిక నాగరికత, శాస్త్రీయ దృక్పథం మొదలైనవి ప్రపంచమంతటా వ్యాప్తిచెందాయి. ప్రపంచ ప్రజలందరూ తమతమ జాతి ఆలోచనా పరిధులనుండి బయటపడి ఈ నూతన భావాలను అందిపుచ్చుకున్నారు. ప్రపంచ ప్రజలందరి జీవన శైలిలో ఒక ఏకరూపత సాధించబడింది. ఈ వలస పాలన వలననే ప్రపంచమంతా ఒక్కసారిగా ఫ్యూడల్ దశనుండి అంతకన్నా పురోగామి అయిన ఆధునిక పెట్టుబడిదారీ దశలోనికి పరిణామం చెందింది.

అయితే నాణానికి మరోవైపుగా వ్యక్తి దారుణంగా దోపిడీ చేయాబడ్డాడు. సమాజం ఎంతగా వికసించిందో వ్యక్తి అంతగా అణగారిపోయాడు. వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. ‘సమాజం’ నుండి ‘వ్యక్తి’ని రక్షించటం తక్షణ కర్తవ్యం గా భావించబడింది. ఈ ఊపులో సమాజం లేక సామాజిక శక్తులవలన ప్రపంచానికి జరిగిన మేలు మరువబడింది. గతంలో రాజ్యం చేసిన మేలు మరచి అది చేసిన కీడును వ్యతిరేకిస్తూ సమాజం ఏవిధంగా విప్లవ పథంలో పయనించిందో ఈ సారీ అలానే సమాజం చేసిన మేలు మరువబడి అది చేసిన కీడుకు వ్యతిరేకంగా మానవుడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఈ ఆలోచనలే క్రమంగా ‘సామ్యవాదం’గా పరిణమించాయి.ఈ సామ్యవాదం హేతువాద ప్రధానమైనది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు శాస్త్రీయ దృక్పథం ఎలానో సామ్యవాదానికి హేతువాద దృక్పథం అలాంటిది.

ఊహా స్వర్గం

ఈ ఆలోచనలు ప్రారంభంలో రాబర్ట్ ఓవెన్, చార్లెస్ ఫొరియెర్, సెయింట్ సైమన్ మొదలైన వారి ద్వారా జరిగాయి. సమాజంలో వ్యక్తి ఎవరి దోపిడీకీ గురికాకుండా తన హక్కులను అనుభవిస్తూ, మిగతా వారితో సమానంగా, ఆనందంగా బ్రతకాలని వీరు కాంక్షించారు. ఫాక్టరీ యజమానులు స్వచ్ఛందంగా మారాలని వీరు కోరుకున్నారు. స్వయంగా వీరు ఫాక్టరీలను స్థాపించి కార్మికుల శ్రేయస్సుకు పాటుపడుతూ మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ప్రయత్నించారు.

ఇటువంటి ఆలోచనలన్నీ ‘ఊహాస్వర్గ వాదం’(Utopia) గా భావించబడ్డాయి. ఇవి ఎటువంటి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. ఊహాజనితంగా,’ఇలా ఉంటే బాగుండు’అన్న పద్ధతిలో జరిగాయి.

శాస్త్రీయ కమ్యూనిజం

అయితే కాలక్రమంలో ఇటువంటి ఆలోచనలన్నీ ఒక క్రమమైన రూపుదాల్చాయి.క్రీ||శ.1818వ సం||లో జర్మనీలో జన్మించిన కార్ల్‌మార్క్స్ అనే ఆర్థిక, రాజనీతి, తత్వశాస్త్ర వేత్త సామ్యవాద విచారధారకు ఒక శాస్త్రీయమైన రూపాన్ని ఇచ్చాడు. హెగెల్ అనే సుప్రసిద్ధ తాత్త్వికుని గతితార్కిక సిద్ధాంతం (Dialectic Theory) ప్రకారం ఈయన సామ్యవాదాన్ని శాస్త్రీయంగా వివరించాడు.’పెట్టుబడి’(Das Capital) అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో ఆయన తన సిద్ధాంతాన్ని వివరించాడు. సమాజం ఏ విధంగా వర్గాలుగా విభజింపబడిందీ, పాలకవర్గం రాజ్యశక్తిని ఉపయోగించి పాలిత వర్గాన్ని అణచివేస్తూ దాన్నెలా దోపిడీ చేస్తున్నదీ, సమాజంలో ఉత్పత్తి సాధనాలను స్వంత ఆస్తిగా కలిగి ఉన్నవారు అమ్ముకోవటానికి శారీరక శ్రమ తప్ప మరేమీ లేని కార్మికులను ఏ విధంగా పీల్చిపిప్పిచేస్తున్నదీ, సమాజంలో ఉత్పత్తి సంబంధాలు ఏవిధంగా మానవ జీవితాన్ని నిర్దేశిస్తాయి మొదలైన విషయాలన్నీ కూలంకషంగా ఆ గ్రంథంలో చర్చించాడు.

ఈ గ్రంథం మానవుని సామాజిక జీవితాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. మానవుని ఆలోచనా ధోరణిలో పెనుమార్పులు తీసుకువచ్చింది. మానవునికి తార్కిక దృక్పథాన్ని అంటే హేతువాద దృష్టిని అలవరచింది. ఈ గ్రంథం ప్రచురింపబడిన నాటినుండి నేటికాలం వరకు ఎవరు ఏవిధమైన ఆలోచన చేసినా దాని నేపథ్యంలో ఎంతోకొంత ఈ సామ్యవాద ఆలోచనాధోరణి ఛాయలు ఉండకపోవటం అరుదు. అంతగా ఈ గ్రంథంలోని విచారధార మానవుడిని ప్రభావితం చేసింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక

కార్ల్ మార్క్స్ తన సన్నిహితుడైన ఫ్రెడరిక్ ఎంగెల్స్ అనే తత్త్వవేత్తతో కలసి ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’(Communist Manifesto) అనే చిరు గ్రంథాన్ని కూడా 1848వ సం||లో రచించాడు. సామ్యవాద సాహిత్యంలో ఇది కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రంథం. దీనిలో చరిత్రలోజరిగిన వర్గపోరాటక్రమాన్ని సంగ్రహంగా వివరించి అది అంతిమంగా కార్మికవర్గ నియంతృత్వానికి ఎలా దారితీస్తుందో వివరించి కమ్యూనిస్టు పార్టీ కార్యాచరణను సంగ్రహంగా వివరించటం జరిగినది......(సశేషం)