2, మార్చి 2009, సోమవారం

రాజయోగం -II

రాజయోగం అంటే ‘శక్తి ఆవాహన’:

ప్రకృతిలో శక్తి ఎల్లెడలా వ్యాపించి ఉంటుంది. ఇది అనేక రూపాలలో ఉంటుంది. ఉష్ణశక్తి, విద్యుచ్ఛక్తి, స్థితిశక్తి, గతిశక్తి, కాంతిశక్తి, యాంత్రికశక్తి మొదలైనవి. ఐతే ఈ శక్తులన్నింటికీ మూలం ఒకటే. ఒకే శక్తి వివిధ రూపాలు పొందినది. ఒక రూపంలో ఉన్న శక్తి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఏ రూపంలో ఉన్న శక్తి ఎంత పరిమాణంలో ఉన్నా, మొత్తం శక్తి యొక్క పరిమాణం మాత్రం స్థిరం. అది పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు.

శక్తి నిత్యత్వ నియమం: శక్తిని కొత్తగా సృష్టించలేము. ఉన్న శక్తిని రూపుమాపలేము. మొత్తం శక్తి యొక్క పరిమాణం ఎల్లప్పుడూ స్థిరం. బహురూపాలలో ఉండే శక్తిని కేవలం ఒక రూపంలో నుండి మరో రూపంలోకి మాత్రమే మార్చగలం. ఇదే ‘శక్తి నిత్యత్వ నియమం’.

రాజయోగం కూడా ఈ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించే నిర్మించబడినది. మనసు ద్వారా జగత్తులో ఎల్లెడలా పరివ్యాప్తమై ఉన్న శక్తిని ఆవాహన చేసి ఆ శక్తిని మనకు కావలసిన మరో శక్తి రూపంలోకి మార్చుకుంటాం. ఈ విధంగా మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసే విధివిధానాలను వివరించేదే రాజయోగం.

యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం ఇత్యాది రాజయోగలక్ష్యాలు శక్తి యొక్క వివిధ రూపాలే. శక్తి ఆవాహనా సాధనమైన మనస్సుకూడా శక్తి యొక్క రూపమే. అలాగే విధి కూడా శక్తి స్వరూపమే. అంటే మనస్సు ద్వారా ఆవాహన చేయబడిన శక్తిని రాజయోగ లక్ష్యాలైదింటిలో మనకు కావలసిన రూపానికి లేక రూపాలకు మార్చుకుంటాం. శక్తి ఆవాహన చెందిన బలీయమైన మనస్సుతో చేసిన సంకల్పాలకు విధిరూపంలో ఉన్న శక్తి అనుకూలత చెంది, ఆ సంకల్పాలు విజయవంతం అవటంతో మనకు రాజయోగ లక్ష్యాల రూపంలో ఉన్న యశోసంపదాది శక్తి రూపాలు సమకూరతాయి.


రాజయోగం అంటే తపస్సు:

మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసి దానిని ఏ విధంగానూ రూపాంతరం చెందించని పక్షంలో అది తపశ్శక్తిగా మనలోనే ఉంటుంది. ప్రాచీన భారతంలోని ఋషులు ఈ విధంగానే తపశ్శక్తిని ఆర్జించేవారు. దానిని అనుభవింపదగిన భౌతికరూపాలలోకి మార్చుకోకుండా నిరాడంబరజీవన విధానంతో కాపాడుకుని అవసరాన్ని బట్టి తగిన సమయంలో లోకకళ్యాణార్ధమే వినియోగించేవారు. అసురులు అలాకాక తాము ఆర్జించిన తపశ్శక్తిని మితిమీరిన భోగాలకు, దుష్ట కార్యాలకు, పరపీడనకు వినియోగించి చివరకు శక్తి అంతా క్షీణించి, తిరిగి ఆ శక్తి స్వరూపమే అయిన విధి చేతిలోనే వంచితులై పతనమయ్యేవారు.

(ఆర్జించిన శక్తిని ఏ విధంగా ఉపయోగించాలనేది రాజయోగ పరిధిలోకి రాదు. అది కర్మయోగ పరిధిలోని విషయం. శక్తిని ఏ విధంగా ఆర్జించాలనే విషయాన్ని మాత్రమే రాజయోగం చర్చిస్తుంది. అందుకొరకు చేయవలసిన సాధనను మాత్రమే, అనుసరించవలసిన విధివిధానాలను మాత్రమే రాజయోగం చర్చిస్తుంది.)


రాజయోగం అంటే విధిని అనుకూలింపచేసుకోవడం:

విధిని గురించి నాస్తికుల వద్ద ప్రస్తావిస్తే ఇంతవరకూ దైవంతోనే వేగలేకపోతున్నాం మళ్ళీ ఈ విధి ఒకటా అని పరిహసిస్తారు.

పాజిటివ్ గా అయితే కొందరు ఈ విధిని ‘అదృష్టం’ అంటారు. కొందరు ‘కలసిరావడం’ అంటారు. అదే నెగెటివ్ గా అయితే కొందరు దీనిని ‘దురదృష్టం’ అంటారు. కొందరు ‘ఖర్మ’ అంటారు. మరికొందరు ‘తలరాత’ అంటారు. ఎవరు ఏమన్నా మానవాతీతంగా దైవం తరువాత ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దైవంకన్నా కూడా ఎక్కువగా మానవజీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్న అంశంగా మనం ఈ విధిని గుర్తించవచ్చు.

ఈ విధి శక్తి స్వరూపం. మానవుడు ఐహికంగా ఔన్నత్యాన్ని సాధించాలన్నా లేక ఇహలోక జీవితంలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించాలన్నా కూడా ఈ విధి అనుకూలించినపుడు మాత్రమే చేయగలడు. విధి సహకారంలేనపుడు మానవుడు చిన్న విషయంలో కూడా విజయాన్ని సాధించలేడు. ఈ విధి మానవుడిని అందలాలు ఎక్కిస్తుంది; అదఃపాతాళానికి అణగద్రొక్కుతుంది. యశోవంతుణ్ణీ చేస్తుంది; అనామకుణ్ణి చేస్తుంది. అంతులేని భోగాలలో ముంచిలేపుతుంది; చిత్రవధ చేసి చంపుతుంది. అనేక మహత్తర విజయాలనందిస్తుంది; ఇసుమంత సామర్ధ్యం లేని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. కుబేరుణ్ణి చేస్తుంది; కుచేలుణ్ణీ చేస్తుంది. పండితుణ్ణి చేశ్తుంది; పరమశుంఠనూ చేస్తుంది.

ఐతే ఇవేవీ కూడ యాదృచ్ఛికంగా జరగవు. మన యెడల విధియొక్క ఆగ్రహానుగ్రహాల ననుసరించి మాత్రమే జరుగుతాయి. దీనివలననే మనం ఈ విధిని కాళి, చండి, దుర్గ మొదలైన శక్తి రూపాలలో పూజిస్తుంటాము. అంటే ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది ఒక రకంగా శక్తి ఉపాసన. దైవారాధనకు, శక్తి ఉపాసనకు ఉన్న తేడాను మనం ఈ విధంగానే గుర్తించాలి. మన యెడల ప్రసన్నమైన విధి మనకెన్నో వరాలను ఇస్తుంది. ప్రధానంగా మన సంకల్పాలు విజయవంతమయ్యే రూపంలోనే అదంతా ఉంటుంది.

ఈ విధంగా కొన్ని సాధనల ద్వారా విధిని ప్రసన్నం చేసుకోవచ్చు. శాక్తేయులు చేసే శక్తి ఆరాధన మరియు తాంత్రికులు చేసే క్షుద్ర సాధనలవంటివి కావు ఇవి. సామాన్యజనులందరూ ఆచరించదగిన అతి సాధారణమైన ఆచరణలు. ఈ సాధనలను వివరించేదే రాజయోగం.

...(మిగతా విషయం తరువాతి టపాలలో)

10 కామెంట్‌లు:

  1. Excellent. I admire your command on the subject.

    రిప్లయితొలగించండి
  2. నేను మళ్ళా మళ్ళా చదువుతూనే ఉన్నాను.నేను మీ ఇంటర్ ప్రెటేషన్ ని ఓ విషయానికై అనువర్తించుకునే పనిలో ఉన్నాను.తొందరలోనే ఏమన్నా తేల్చుకుంటనేమోననే అనిపిస్తోంది.ముగింపు టపాలు ఇంకా రావల్సింది ఉందని వేచి చూస్తున్నాను.

    మీరు "భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి? అన్న మెయిన్ థ్రెడ్ కి ఇక వెళ్ళిపోవటమే మంచిది.తిరిగి తాత్విక చర్చకు మళ్ళా రావచ్చును - నా లాంటివారికి ఓ పట్టాన సంశయ నివృత్తి కాకపోవచ్చు లెండి.

    సత్యం యొక్క డెఫెనిషన్, అది జగత్తులో ఆవిష్కరించుకునేదన్న ఇంటర్ ప్రెటేషన్ నాకు చాల నచ్చాయి.మీరు ఇలా చెబుతున్నందుకు థాంక్యూ వెరీ మచ్;ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. రేరాజ్ గారూ! నేను కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులలో నిమగ్నమై ఉన్నాను. బహుశా కొద్ది రోజుల పాటు నేనేమీ రాయలేక పోవచ్చు. మీ అభిమానానికీ, అభినందనలకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  4. ఏదో అనువర్తనం అంటున్నారు. మానవుడు మూడు రకాల కర్మలను ఆచరించి 'యజ్ఞం' చేయగలిగే వీలు లేనపుడు తాత్కాలికంగా(ఆపద్ధర్మంగా) కేవల సాత్విక కర్మకు పరిమితవటంలో దోషం ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి.

    రిప్లయితొలగించండి
  5. :) అలాగే ఙ్జాపకం ఉంచుకుంటాను.

    రిప్లయితొలగించండి
  6. రెండునెల్ల పైనైపోయింది.ఎప్పుడొస్తున్నారు? ఎలా ఉన్నారు?

    రిప్లయితొలగించండి
  7. Saraswathi Kumar గారూ
    రాజయోగం పైన మీ వ్యాసాలలో "రాజయోగం అంటే తపస్సు,తపస్సు ద్వారా విధిని అనుకూలింపచేసుకోవడం,దైవారాధనకు, శక్తి ఉపాసనకు తేడా ఉంది" అని మీరు అన్నారు.మరి కొందరు పండితులు "భగవంతుడి అనుగ్రహం పొందటానికి ఒక్కో యుగంలో ఒక్కో పద్ధతి ఉంటుంది.భగవంతుని అనుగ్రహం పొందటానికి కృతయుగంలో తపస్సు ,త్రేతాయుగంలో ధ్యానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలియుగంలో భగవన్నామ సంకీర్తనతో పాటు దానం తగినవి.కృతయుగంలో పది సంవత్సరాలపాటు తపస్సు చేస్తే కలిగే పుణ్యఫలం త్రేతాయుగంలో ఒక సంవత్సరంపాటు ధ్యానం చేస్తే పొందవచ్చు. అదే ద్వాపర యుగంలో అయితే ఒక మాసం పాటు యజ్ఞాన్ని నిర్వహిస్తే అంతటి పుణ్యఫలం లభిస్తుంది. కలియుగంలో అంతటి పుణ్యాన్ని ఒక్క రోజులోనే దానం చేసి, భగవన్నామ సంకీర్తన చేసి పొందవచ్చు"అంటున్నారు. దీనికి లేఖనాధారం ఏమైనా ఉందా?
    http://nrahamthulla.blogspot.com/చూడండి.

    రిప్లయితొలగించండి
  8. పెద్దలు రెహంతుల్లా గారికి నమస్కారాలు! నా బ్లాగు చూసి అందులోని విషయం చదివి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు! వైదిక ధర్మానికి సంబంధించిన తత్వశాస్త్రం చాలావరకూ మార్మికమైనది. అంటే చెప్పబడే ఏవిషయం కూడా సూటిగా ఉండక కొంత పరోక్షంగా ఉంటుంది. అందుకనే ఆయా విషయాలను వివరిస్తూ అన్ని భాష్యాలు, అన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఎవరికి తోచినట్లు వారు చెప్పారు. ఎవరికి అర్థమైనట్లు వారు చెప్పారు. ఆయా విషయాలలో ఇప్పటికీ వీడని చాలా గందరగోళం నెలకొని ఉంది. ఎవరైనా తాను చెప్పే విషయానికి ప్రామాణికమైన లేఖనాధారం చూపించదలచుకుంటే ఆ ఆధారాలన్నీ కూడా ఈ మార్మిక లక్షణాన్నే కలిగి ఉంటాయి తప్ప మరోలా ఉండవు. నేను ప్రధానంగా భగవద్గీతనే ఎక్కువగా చదివాను. దాని మీద ఆధారపడే నా అభిప్రాయాలన్నింటినీ ఏర్పరచుకున్నాను.నాలుగు యోగాల గురించి ఆవిధంగా నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలనే నా భ్లాగులో రాసాను.

    రిప్లయితొలగించండి
  9. సరస్వతీకుమార్ గారూ
    మీలాగానే నా మిత్రులు బొడ్డు రామయ్య గారు భగవద్గీత పరిశోధనలో చాలా శ్రమ పడ్డారు.ఫోన్(9393283099) లో ఒకసారి ఆయన్ని కాంటాక్ట్ చేయండి.ప్రస్తుతం ఆయన పుట్టపర్తి ఆశ్రమంలో శేష జీవితం గడుపుతున్నారు."మతాలలోని మార్మికమైన విషయాలు సూటిగా ఉండక పరోక్షంగా ఉంటాయి కాబట్టే రకరకాల భాష్యాలు,వ్యాఖ్యానాలు వచ్చాయి" అనేది నిజమే.కానీ మతలేఖనం లోని మూల శ్లోకం/సూత్రం ఎప్పటికీ మారదు.మీరు భగవద్గీతలోని శ్లోకం/సూత్రంనే ఆయా విషయాలకు ఆధారంగా పేర్కొంటే మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలకు బలం చేకూరుతుంది.

    రిప్లయితొలగించండి