19, నవంబర్ 2015, గురువారం

దేశభక్తే అసలైన మానవత్వం

ఇప్పుడు కూడలిలో ‘దేశభక్తి అంటే?’ అనే శీర్షికతో ఉన్న ఒక టపా చదివాను. కామెంట్ రాయాలనుకున్నాను. కానీ ఎందుకో టపా రాయాలనిపించింది.

ఆ టపాలో రాయబడిన ‘ఓషో’ గారి ఉవాచలకు సమాధానం:

దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు ఏర్పడింది మనిషి దుఃఖాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో కాదు… పరిపాలనా సౌలభ్యం కోసం.

దేశ జెండా యొక్క పరమ ప్రయోజనం పక్షుల చేత రెట్ట వేయించుకోవడం కాదు.

ఈ వ్యాఖ్య ఆయన చేసినది అమెరికన్ల దేశభక్తిని హేళన చేయడానికా?.. లేక తన దేశభక్తిని చాటడానికా?

చంద్రమండలం మీద ఎగురవేసినది అమెరికన్ల జండా అయినా, ఆ ఘనత సాధించినది అమెరికన్లయినా దానియెడల యావత్ మానవజాతే గర్వించినది. విశ్వమానవత్వాన్ని బోధించే కొందరికి మాత్రం ఆ చర్య మూర్ఖత్వం గా కనిపించినది.

ఇక JK గారి ఉవాచలను పరిశీలిద్దాం.

“The flag,is nothing but a piece of loin cloth,… ”ఏ అనుభూతులనూ,ఏ భావోద్వేగాలనూ అంగీకరించలేని వారికి జాతీయ జండా అయినా ఒకటే, గోచిగుడ్డ అయినా ఒకటే.

ఆలోచనలలో ‘స్వేచ్ఛ ’ ఉండాలని JK తరచూ ఇన్సిస్ట్ చేసేవారు.తరచూ ఏముంది లెండి!… ఆయన సారమదే. సిద్ధాంతాలు, నిర్థారణలు వగైరా ఆ స్వేచ్ఛకు ఆటంకమని ఆయన తలచేవారు.

దేశభక్తి లాంటి విషయం మీద ఓ అభిప్రాయానికి రావటానికి గ్రంథపఠనం ఆవశ్యకమనుకుంటే ఓషో,JKల రచనలేకాదు ఇంకా అనేక మంది రచనలు చదవాలి. అప్పుడే సరైన దృక్పథం అలవడుతుంది.

“సిద్ధాంతం గొప్పదా? మనిషి గొప్పవాడా?”… ఈ పోటీ ఎందుకు? మనిషికి దార్శనికత లభించేది సిద్ధాంతం వలనే కదా!

ఇక సాటి మనిషి అంటారా! సాటి మనుషులలో మనకు శత్రువులు ఉంటారు.. మిత్రులు ఉంటారు. మన ఎడల వారి స్పందనను బట్టే వారి ఎడల మన స్పందన ఉంటుంది.

“మనిషి ప్రస్థానం ఎటువైపు సాగుతోంది??”.. ఏది ఎలా జరిగినా మొత్తంమీద మనిషి ప్రస్థానం ఎల్లప్పుడూ సత్యం దిశగానే సాగుతుంది. ఈ విషయంలో సందేహం అనవసరం.

“Nationalism is a glorified form of tribalism”.. ఇది కూడా JK గారి ఉవాచే.

Nationalism ను వ్యతిరేకించి అంతర్జాతీయ తత్వాన్ని తలకెత్తుకున్న కమ్యూనిస్టు సోవియట్ రష్యానే రెండవ ప్రపంచ యుద్ధంలో దానికి తిలోదకాలిచ్చి దేశభక్తికి పట్టం కట్టింది.అలా చేయబట్టే ఆ దేశ సైనికులు సోవియట్ రష్యా కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రాణాలకు సైతం తెగించి పోరాడి విజయం సాధించగలిగారు. అటు ఫాసిజాన్ని కూల్చడంతో పాటు పనిలోపనిగా ఇటు సామ్రాజ్యవాదపు నడ్డి కూడా విరిచి నేటి స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని నిర్మించగలిగారు. కనుక దేశ భక్తి ఉపయోగకరమైనదే.

దేశభక్తి, మానవత్వం పరస్పర విరుద్ధమైన విలువలు. ఆ రెంటిలో ఒకటుంటే మరోటి ఉండదు’ అనే అభిప్రాయం సరికాదు.

తనకో భాషను, సంస్కృతిని,నాగరికతను,మతాన్ని అందించిన దేశాన్ని ఎవరైనా ప్రేమించకుండా ఉండగలరా?! తన జాతి మూలాలున్న ప్రాచీనతను, చరిత్రను కలిగి ఉన్న తన దేశం ఎడల ఎవరైనా భక్తి ప్రదర్శించకుండా ఉండగలరా?! తనకు ఉండటానికి నివాసాన్ని, తినడానికి తిండిని, తాగటానికి నీటిని, పీల్చటానికి గాలిని ఇస్తున్న దేశం యెడల ఎవరైనా కృతజ్ఞత చూఫకుండా ఉండగలరా?! శత్రువులనుండి తనకు,తనవారికి రక్షణ కల్పిస్తున్న దేశాన్ని అభిమానించకుండ ఎవరైనా ఉండగలరా?! సహజీవనం చేయడానికి తోటి మనుషులను.. ఇంకా తనకు విద్యను, విజ్ఞానాన్ని అందించిన దేశాన్ని మిగతా దేశాలతో సమానంగా, మామూలుగా ఎవరైనా చూడగలరా?! అలా ఉండగలిగితే… అలా చూడగలిగితే అది మానవత్వమా?!

ఒక్క దేశభక్తే కాదు… మనిషికి దీనితో పాటు ఇంకా అనేక రకాల భక్తులుంటాయి. వినాయక విగ్రహం పెట్టినపుడు ‘కాలనీభక్తి ’నో ‘వీధిభక్తి’నో వ్యక్తం చేస్తాడు. ఒలంపిక్స్ లో మన దేశమేమీ సాధించలేక పోయినా చైనా విజయాలను చూసి ‘ఖండభక్తి ’నో లేక ‘ప్రాచ్యభక్తి ’నో వ్యక్తం చేస్తాడు. అలానే మనిషి సందర్భాన్ని బట్టి ‘రాష్ట్రభక్తి ’ని, ‘జిల్లాభక్తి’ని, ‘స్వగ్రామభక్తి ’ని… ఇలా అన్నింటినీ చాటుతుంటాడు. ఒక్కోసారి విశ్వమానవ దృక్పథాన్నీ ప్రదర్శిస్తాడు.

అలానే ఒకోసారి తనకులం, తన మతం, తనుండే ప్రాంతం, తను చదివే విద్యాలయం.. ఇలా సందర్భాన్ని బట్టి తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఉంటాడు.

అయితే వీటన్నింటిలో కూడ దేశభక్తే సర్వశ్రేష్ఠమైనది.

ఇవేవీ కూడా మనిషిలో ఉండే మానవత్వానికి అడ్డుకావు. అయితే ఏదైనా సందర్భోచితంగానే ఉండాలి. ఏ భక్తైనా హద్దులు దాటి ఇతరుల ఎడల అన్యాయమైన అసహనాన్ని ప్రదర్శిస్తే మాత్రం వచ్చేది ముప్పే.

ఎవరైనా సరే ఎల్లవేళలా మానవత్వమే నా మతమంటూ, విశ్వమానవ దృష్టే నా దృక్పథమంటూ ఏ ఐడెంటిటీని ఇష్టపడక,ఏ విశిష్టతనూ అంగీకరించక పోతే అప్పుడు మనిషికి మిగిలేది ఏమిటి?అసలు చివరికి ఆ మానవత్వమైనా మిగులుతుందా? నిజం చెప్పాలంటే ఆ స్థితిలో మనిషైనా ఒకటే.. పశువైనా ఒకటే ? ఎందుకంటే పశువులకు కూడా కులాలు, మతాలు, దేశాలు, ప్రాంతాలు, జిల్లాలు ఉండవు. దేశ భక్తి అసలే ఉండదు.

కులమతాలు నేరమా?!

‘కులం’ అనేది ప్రాచీన సమాజంలో ‘పని విభజన ’ కొరకు ఏర్పడిందని అంటారు.

వాస్తవంగా కులం అనేది సమాజంలో ఒక ప్రత్యేక ప్రజాసమూహం తన స్వాభావికమైన విశిష్టతను నిలుపుకోవటం కొరకు, కాపాడుకోవటం కొరకు ఏర్పడింది. ఈ క్రమంలో ఒక్కొక సమూహం ఒక్కొక పనిని చేయడం ప్రారంభించింది.

కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ సమూహాలు ఒకేవిధమైన పనిని కూడా చేయవచ్చు.అప్పుడు కులానికి చేసేపనికి సంబంధం ఉన్నదని చెప్పలేము. ఉదాహరణకు కమ్మ-కాపు-రెడ్డి-వెలమ…ఇటువంటి కులాలు వేరు వేరైనా వీటి మధ్యన పని విభజనలేదు, ఉన్నది కేవలం సమూహ విభజన మాత్రమే.

అలాగే రాజ్యపాలనను క్షత్రియులేకాక అనేక శూద్రకులాల వారు, ఒక్కోసారి బ్రాహ్మణులు కూడా చేశారు.

అగ్రకులాలే కాదు, నిమ్న కులాలు కూడా తమ కులానికున్న విశిష్టతను కాపాడుకోవటానికే ప్రయత్నిస్తాయి. కనుక కులం అనేది దాదాపుగా అందరికీ అంగీకారమైన విషయమేగానీ అది అగ్రకులాలు మిగతా వారిమీద రుద్దిన విషయం కాదు.

ఇక మతమనేది మనిషి యొక్క జీవితకాలంలో జననం, విద్య, వివాహం, మరణం ఇత్యాది సందర్భాలలో జరగవలసిన కొన్ని శాశ్వతమైన ఆచారాలను నెలకొల్పడానికి, సంస్కారాలను రూపొందించడానికి ఏర్పడింది.

అలాగే మనిషి ఎటువంటి విలువలతో జీవించాలి? అతని జీవన లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనిషి ఎటువంటి విధానంలో, ఎటువంటి నడవడికతో జీవించాలి? మానవుని జీవితంలో భగవంతుని స్థానం ఏమిటి? ఆయన మనిషికి అతని జీవన గమనంలో ఏ విధంగా తోడ్పడతాడు?… ఇత్యాది వాటి గురించి మతం చర్చిస్తుంది.

ఈ మొత్తం విషయాలన్నిటి మీద ఏ మతానికి ఆమతం తన ప్రత్యేక అభిప్రాయాలను కలిగి ఉన్నది.

ఇక కులపరమైన, మతపరమైన విద్వేషాలంటారా…మనిషి మనసులో ‘ద్వేషం’ ఉన్నంతకాలం ఏదో ఒక ప్రాతిపదిక మీద ఇతరులను ద్వేషిస్తూనే ఉంటాడు. కులాలు, మతాలు రూపుమాసిపోతే మరో ప్రాతిపదికతో తోటి మనుషులను ద్వేషిస్తాడు. కనుక మనుషుల యొక్క మనసులు మారాలి! మనుషుల మనసులలో విద్వేషాన్ని రగిలించే పరిస్థితులు మారాలి!

ఈ వాస్తవాలను గ్రహించకుండా కేవలం చిలుక పలికినట్లుగా ‘మతాలు మాసిపోవాలి’, ‘కులాలు సమసిపోవాలి’ అనడం మూర్ఖత్వమే. మతాలకు, కులాలకు సర్వజనామోదయోగ్యమైన కొన్ని మౌలిక ఉద్దేశాలున్నాయి. కనుక సమస్యకు పరిష్కారం కనుగొనకుండా మూలకారణాన్ని అలానే ఉంచి మూర్ఖంగా ఇలా వాదించడం ఆదర్శవాదమనిపించుకుంటుందా? అసలు ఇది సమస్యను పక్కదారి పట్టించడం కాదా? ఇది సమస్యను మరింత తీవ్రం చేయటంకాదా?

‘కులాలు ఉండాలి…మతాలూ ఉండాలి.. కానీ అవి శాంతియుత సహజీవనం చేయాలి’. ఇదే అసలైన పరిష్కారం.

ఈ ఆదర్శవాదులలో కొందరి అసలు ఉద్దేశం మనుషుల యెడల ప్రేమ కాదు. వీరికేదో వ్యక్తిగత కారణాలతో కులమతాలు ఇబ్బందిగా పరిణమిస్తాయి.దానితో ‘తమ బాధ ప్రపంచం బాధ ’ అన్నట్లుగా ‘కులాలన్నీ కూలిపోవాలి, మతాలన్నీ మాసిపోవాలి’ అని పాడటం మొదలు పెడతారు. ఈ పాట విన్న కొందరు అమాయకులు ఇది ఆదర్శమేమో అని నమ్మి వీరిని అనుసరించి వారు కూడా ఆ పాటే పాడటం మొదలు పెడతారు.

అసలు మన సమాజంలో గాడ్సేలు పుట్టటానికి,చుండూరు, కారంచేడు లాంటి ఘటనలు జరగటానికి మరెవరో కారణం కాదు…వీరే! వీరి పక్కదారిపట్టిన ఆదర్శాలతో సమస్య యొక్క మూలం అలానే ఉండి అది పరిష్కారం కాకపోగా మరింతగా విద్వేషాగ్నిని రగులుతుంటుంది. వీరు సమస్యను వాస్తవ దృష్టితో చూడ నిరాకరించిన కొలదీ అది మరింత తీవ్రంగా తనను తాను అభివ్యక్తీకరించుకుంటూ ఉంటుంది.

ఒక వర్గం, మరో వర్గం మీద కులమో,మతమో ఏదో ఒక ప్రాతిపదిక మీద దాడికి పాల్పడితే బాధిత వర్గం అదే ప్రాతిపదికతో ఆ దాడిని కాచుకోవడానికి, తిప్పికొట్టటానికి ప్రయత్నిస్తే అది ఎన్నటికీ తప్పుకాదు. పైగా అది ఆవశ్యకం….మరియు అనివార్యం కూడా.

“నువ్వు అగ్రకులానికి చెందిన వాడివి! నీ తాత ముత్తాతలు, నా తాత ముత్తాతలను అవమానించారు.. చిన్నచూపు చూశారు. అందుకని ఈ రోజు నిన్ను నేను అవమానిస్తాను.. చిన్నచూపు చూస్తాను. నిన్ను రోడ్డు మీదే పట్టుకుని కొడతాను..! నీవు ఏమన్నా దానికి పెడార్థాలు తీసి కొడతాను! నన్నేమైనా అంటే SC/ST కేసు పెడతాను!” అంటూ ఉంటే ఆ దాడిని అదే అగ్రవర్ణపు ఐడెంటిటీతో ఎదుర్కోవడం తప్పా?? అది అగ్ర వర్ణపు దురహంకారమా??

“నీవు హిందువువి! నీవు కాఫిర్‌వి! నీవు చేసే విగ్రహారాధన నాకు నచ్చడంలేదు! అందుకని నీ తలను నేను తీస్తాను! నీ స్త్రీలను చెరబడతాను! నీ దేశాన్ని ఆక్రమిస్తాను! నీ దేవాలయాలను నేలమట్టం చేస్తాను! నీ దేశంలో జనావాసాల మధ్యన బాంబులు పెడతాను!” అంటూ పాశవిక దాడికి పాల్పడితే ఆ దాడిని అదే హిందూ ఐడెంటిటీ తో ఎదుర్కోవడం తప్పా??… అది మతవాదమా??

ఈ రెండు సందర్భాలలోనూ మనకేమి అవగతమైనది. ఆదర్శవాదులుగా ఉందామనుకుని మనం కులం, మతం వద్దనుకున్నా మన మీద దాడి చేసేవారు వద్దనుకోనివ్వరు. మన ఆత్మ రక్షణకైనా మనం ఆ ఐడెంటిటీని కలిగి ఉండాల్సిందే.

ఎందుకంటే… దాడి ఉన్నంతకాలం ప్రతిదాడి తప్పదు.