27, డిసెంబర్ 2008, శనివారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--III

IV. సత్యావిష్కరణ

మనం II భాగంలో ‘జగత్‌స్వరూపం’ గురించీ, ‘సత్యస్వరూపం’ గురించీ తెలుసుకున్నాం. ఇప్పుడు జగత్తు ద్వారా సత్యాన్ని ఎలా ఆవిష్కరించాలో తెలుసుకుందాం.

మనిషికి సిద్ధసత్యం (ready made TRUTH) ఎక్కడా లభించదు. మనకు అందుబాటులో ఉండేది కర్మలు మౌలిక రూపంలో ఉండే జగత్తు మాత్రమే. ఈ జగత్తు ద్వారానే మనం సత్యనిర్మాణం చేయాలి. (జగత్తు సత్యం కాకపోవచ్చు అసత్యమే కావచ్చు. అంతమాత్రాన ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా మిథ్య మాత్రం కాదు. జగత్తు సత్యానికి ముడి పదార్థం)

మానవునకు జగత్తులోని కర్మలను అవి ఏ రూపంలో ఉన్ననూ ఆచరింపక తప్పదు. ఐతే ఆ కర్మాచరణలో సత్యనిర్మాణం చేయాలా లేక తిరిగి జగత్తునే (అసత్యాన్నే) పొందాలా అనేది మన మానసిక స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది.

ఈ కర్మలను ఒకానొక మానసిక స్థితి ద్వారా ఆచరించడానికి ఉపక్రమిస్తే ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. అదే ‘నిష్కామ మానసికస్థితి’. అలా కాకుండా కామపూరితమైన మనస్సుతో కనుక కర్మలాచరిస్తే మనకు తిరిగి ఈ సంఘర్షణాత్మకమైన జగత్తే లభిస్తుంది కానీ సత్యం లభించదు.

ఇప్పుడు ‘కామం’ అంటే ఏమిటో, ‘నిష్కామం’ అంటే ఏమిటో చూద్దాం.


V. కామం

మనం ఇంతకు ముందు ‘కర్మ స్వరూపం’ లో చెప్పుకున్నాం ‘ఒక కర్మత్రయంలోని ప్రతికర్మకు మనిషి మనసును ఆకట్టుకునే ఆకర్షణ శక్తి ఉంటుంది’ అని. అలా ఒక కర్మ యొక్క ఆకర్షణకు లోబడి పోయే మనిషి బలహీనతను ‘కామం’ అంటారు.

ఈ కామం ద్వారా కర్మలాచరించే మానవుడు ఒక కర్మత్రయంలోని ఏదో ఒక కర్మ యొక్క ఆకర్షణకు లోబడి (ఏ కర్మ అనేది అతని స్వభావాన్ని బట్టి ఉంటుంది) దానినే ఇష్టపడుతూ దానినే ఎక్కువగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న మిగిలిన రెండు కర్మలను ద్వేషిస్తూ వాటిని ఆచరించకుండా సాధ్యమైనంత దూరంగా ఉంటాడు. మనిషి ఇటువంటి కర్మ విధానాన్ని కనుక ఆచరిస్తే ఒక కర్మ యొక్క ఆధిక్యత పెరిగిపోయి ‘సత్యం’ ఆవిష్కరింపబడదు. (మూడు కర్మలకూ సమాన ప్రాతినిథ్యం ఉన్నపుడే దానిని సత్యం అంటారు) దీనినే రాగద్వేషాలతో కూడుకున్న కర్మ విధానం అంటారు.

ఇక్కడ ‘రాగం’ అంటే కర్మత్రయంలోని ఏదో ఒక కర్మను ఇష్టపడటం, ‘ద్వేషం’ అంటే దానికి విరుద్ధంగా ఉన్న మిగిలిన రెండు కర్మలను ద్వేషించడం.


VI. నిష్కామం

నిష్కామం అంటే కామం లేకుండా అని అర్థం. నిష్కామంగా కర్మకు ఉపక్రమిస్తే కర్మత్రయంలోని ఏ ఒక్క కర్మ యొక్క ఆకర్షణ కూడా పనిచేయదు. ఎప్పుడు మనిషిలో కామం, రాగం ఇత్యాదివి ఉంటాయో అప్పుడే మనిషి ఏదో ఒక కర్మ వైపు అధిక మొగ్గు చూపడం జరుగుతుంది. అలాంటి కామమేదీ లేనపుడు మనిషి సందర్భౌచిత్యాన్ననుసరించి కర్మత్రయంలోని మూడు కర్మలనూ సమానంగా ఆచరిస్తాడు. అప్పుడు అతని జీవితంలో మూడు కర్మలకూ సమాన ప్రాతినిథ్యం లభించి ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది.


VII. అనువర్తనం (application)

పైన వివరించిన విధానాన్ని అనుసరించి మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఏ విషయంలోనైనా మనం సత్యాన్ని ఆవిష్కరించవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనవచ్చు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థకు సంబంధించి చిరకాలంగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యను ఎలా పరిష్కరించవచ్చో చూద్దాం.

“భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షికతో రాసిన వ్యాసావళిలోని మొదటి అధ్యాయంలో మనం ప్రపంచ రాజకీయ, సామాజిక చారిత్రక క్రమాన్ని సంగ్రహంగా పరిశీలించాం. అందులో రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయంగా ‘రాజ్యం-సమాజం-వ్యక్తి’ పేర్కొనబడింది. అంటే వ్యవస్థలో రాజ్యం, సమాజం, వ్యక్తి అనే మూడు అంగాలుంటాయి. వాటినే ఇక్కడ త్రయంగా పేర్కొనడం జరిగింది.

(‘సమాజం’ అంటే సామాజికమైన ఉత్పత్తివనరులను అభివృద్ధిచేసి వాటిని స్వంత ఆస్థి రూపంలో తన అధీనంలో ఉంచుకున్న బూర్జువా వర్గం. ‘వ్యక్తి’ అంటే సాధారణమైన జనబాహుళ్యం)

వ్యవస్థలోని ‘రాజ్యం’ అనే అంగం యొక్క ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన ఇస్లాం సమాజాన్ని, వ్యక్తిని అణచి వేసింది. ఈ విధంగా ‘రాజ్యం’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘ఇస్లాం’ సత్యాన్ని నిర్మించలేకపోయింది.

‘సమాజం’ యొక్క ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చిన కాపిటలిజం రాజ్యం మరియు వ్యక్తి అనే అంగాలను అణచివేసింది. ఈ విధంగా ‘సమాజం’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘కాపిటలిజం’ కూడా సత్యాన్ని నిర్మించలేకపోయింది.

అలానే ‘వ్యక్తి’ ప్రయోజనాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత నిచ్చిన కమ్యూనిజం మిగిలినవైన రాజ్యం మరియు సమాజం అనే అంగాలను అణచి వేసింది. ఈ విధంగా ‘వ్యక్తి’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘సామ్యవాదం’ కూడా సత్యాన్ని నిర్మించలేక పోయింది.

‘వాదం’, ‘ప్రతివాదం’ మరియు ‘విశ్లేషణల’ ఆంశిక సమన్వయమే సత్యమని మనం ‘సత్యస్వరూపం’ లో తెలుసుకున్నాం. TRUTH is the Synthesis of Thesis, Anti-Thesis and Analysis.

దీనిని బట్టి మనం వ్యవస్థలోని ఏ ఒక్క అంగపు ప్రయోజనాలో కాకుండా మూడు అంగాల యొక్క అంటే రాజ్యం-సమాజం-వ్యక్తి ల యొక్క ప్రయోజనాలనూ సమానంగా నెరవేర్చగలిగేటట్లుగా మన రాజకీయ, సామాజిక వ్యవస్థను నిర్మించుకోగలిగితే కర్మత్రయంలోని మూడు కర్మలూ సమనంగా ఆచరింపబడినటై ఆ వ్యవస్థ సత్యానికి ప్రాతినిథ్యం వహిస్తుంది.

ఇదే విధంగా ఒక్క రాజకీయ వ్యవస్థకు సంబంధించిన సమస్యే కాక ఏ సమస్యైనా పరిష్కారమౌతుంది. …(అయిపోయింది)

20, డిసెంబర్ 2008, శనివారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--II

II. జగత్ స్వరూపం

1. ఇంతకు ముందే ‘కర్మ స్వరూపం’ లో మనం చెప్పుకున్నాం కర్మలన్నీ త్రయాలుగా ఉంటాయని. ఏ విషయానికి సంబంధించైనా ఒక 'త్రయం' ఉంటుంది. అలాంటి అనంతమైన త్రయాల సమూహమే ‘జగత్తు’.

2. జగత్తులో కర్మలు వాటి ‘మౌలిక’ (fundamental or primary) రూపంలో ఉంటాయి. అంటే ఒక త్రయంలోని కర్మలు మూడునూ విడివిడి ప్రమాణాలు (1+1+1=3) గా ఉంటాయి గానీ అన్నీకలసి ఒకే ప్రమాణం (1/3+1/3+1/3=1) గా ఉండవు.

3. మౌలిక రూపంలో ఉన్న ప్రతి కర్మ కూడా 1/3 వంతు దోషరహితంగానూ, 2/3 వంతు దోషభూయిష్టంగానూ ఉంటుంది.

4. మౌలిక రూపంలో ఉండే ఏ త్రయంలోని మూడు కర్మలైనా అవి పరస్పర విరుద్ధమైనవి కనుక దానికి తగినట్లుగానే పరస్పరం సంఘర్షించుకుంటూ ఉంటాయి. ప్రతి కర్మా మిగతా రెండు కర్మలను డామినేట్ చేయడానికి మరియు ఆ రెంటినీ అణచి తానొక్కటే పెంపొందటానికి ప్రయత్నిస్తుంది. ఫలితం...అంతులేని సంఘర్షణ.

ఉదాహరణకు సంప్రదాయవాదం -అభ్యుదయవాదం- సంస్కరణ వాదం అనే కర్మత్రయాన్ని పరిశీలిద్దాం. సమాజంలో ఈ మూడు వాదాలకూ దేని అనుచరవర్గం దానికి ఉంటుంది. ఈ ముగ్గురూ సంఘంలో విడి విడి సమూహాలుగా ఉండి నిరంతరం అభిప్రాయభేదాలతో పోట్లాడుకుంటుంటారు.

సంప్రదాయవాదులు ఏ విషయంలోనైనా గతకాలంలో ఉన్నదానినే కొనసాగించాలని కోరుకుంటారు. అభ్యుదయవాదులు గతకాలంలో ఉన్నదానిని అభివృద్ధిపరచి, మరింత మెరుగుపరచి ఆచరించాలని కోరుకుంటారు. సంస్కరణవాదులు గతకాలంలో ఉన్నదానిని అది ఎటువంటిదైనప్పటికీ దానిని పూర్తిగా తొలగించి సరికొత్త ఆచరణలను నెలకొల్పాలని కోరుకుంటారు.

ఎవ్వరూ ఎదుటివారి వాదన లోని ఔచిత్యాన్ని గమనించరు. తమవాదనలోని లోటుపాట్లను గ్రహించరు. తాము చెప్పేదే సరియైనదని గుడ్డిగా వాదిస్తుంటారు. తమ ఆలోచనా విధానంమాత్రమే సమాజంలో చలామణీ అవ్వాలని కోరుకుంటారు. మిగతా వారి ఆలోచనా విధానాన్ని సమూలంగా నాశనం చేసి ప్రజలెవ్వరూ దానిని ఆచరించకుండా చేయాలని వీరు ప్రయత్నిస్తారు. అంటే ప్రతిఒక్కరూ ‘1’ గా ఉండటానికే గానీ ‘1/3’ గా ఉండాటానికి ఎవరూ ఇష్టపడరు.


ఈ విధంగా జగత్తులో ఏ కర్మత్రయంలోని మూడు కర్మలైనా వాటి మౌలిక రూపంలో విడివిడి ప్రమాణాలుగా ఉండి నిరంతరం సంఘర్షించుకుంటూ ఉంటాయి.

అంటే జగత్తులోని ఏ కర్మత్రయంలోనైనా ‘వాదం’, ‘ప్రతివాదం’ మరియు ‘విశ్లేషణల’ మధ్యన నిరంతర సంఘర్షణ తప్పదు.

III. సత్య స్వరూపం

1.'వాదం', 'ప్రతివాదం' మరియు 'విశ్లేషణ ' ల సమన్వయమే 'సత్యం'. ఒకానొక కర్మత్రయంలోని మూడు కర్మలే ఆ విషయానికి సంబంధించిన సత్యనిర్మాణంలో కూడా పాలు పంచుకుంటాయి.

2. అయితే ఈ మూడు కర్మలూ 'సత్యం'లో మౌలిక (1) రూపంలో ఉండవు. ‘ఆంశిక’ (componental) (1/3) రూపంలో ఉంటాయి. ఈ కారణంగా అవి విడివిడి ప్రమాణాలుగా కాక మూడూ కలసి 'ఒకే ప్రమాణం'(single unit)గా మారతాయి. అంటే 1/3+1/3+1/3=1 గా ఉంటాయి.

3. మౌలికరూపంలో ఉన్న మూడు కర్మలలోని దోషరహితమైన మూడు భాగాలూ కలవడంవలన (1/3+1/3+1/3) రూపుదిద్దుకున్న సత్యం కూడా దోషరహితంగా ఉంటుంది.

4. ఆంశిక (1/3) రూపంలోని కర్మల మధ్యన (అవి పరస్పరవిరుద్ధమైనవి అయినప్పటికీ) సంఘర్షణ కాకుండా సమన్వయం ఉంటుంది. అందుకే అవి అన్నీ కలసి పోయి 'ఒకే ప్రమాణం'గా ఏర్పడతాయి.

అంటే జగత్తులో మౌలిక రూపంలో త్రయం గా ఉండి పరస్పరం సంఘర్షించుకునే కర్మలే సత్యంలో ఆంశికరూపంలోకి మారి ఒకదానితో ఒకటి కలసి పోయి పరస్పర సమన్వయంతో ఒకే ప్రమాణం గా ఏర్పడతాయి.

పైన జగత్‌స్వరూపాన్ని వివరించేటపుడు పేర్కొన్న సంప్రదాయవాదం-అభ్యుదయవాదం-సంస్కరణవాదం ఉదాహరణలో ఒక వ్యక్తి గానీ, ఒక ప్రజాసమూహం గానీ ఏ ఒక్క వాదానికో కట్టుబడి మిగతా రెంటినీ ద్వేషించక సందర్భౌచిత్యాన్ని బట్టి సంప్రదాయవాదాన్ని, అభ్యుదయవాదాన్ని, సంస్కరణ వాదాన్నీ మూడింటినీ ఆచరిస్తుంటే అది సత్యాచరణగా చెప్పవచ్చు.

వాతావరణానికి సంబంధించిన ఎండ-వర్షం-చలి లాగానే మానవ సంకల్పానికి అతీతమైన మరో కర్మత్రయాన్ని కూడా ఈ సందర్భంలో మనం పరిశీలిద్దాం. అది మానవ శరీరలక్షణాలకు సంబంధించిన నీగ్రోయిడ్ –యూరోపియన్ (కాకసాయిడ్)- మంగోలాయిడ్ అనే కర్మత్రయం.

మానవశరీరంలో ‘వాదం’ డామినేట్ అయితే అది నీగ్రోయిడ్ శరీరం. ‘ప్రతివాదం’ డామినేట్ అయితే అది యూరోపియన్ శరీరం. ‘విశ్లేషణ’ డామినేట్ అయితే అది మంగోలాయిడ్ శరీరం. (ఇవి మూడునూ జగత్తుకు ప్రాతినిథ్యం వహించే మౌలిక స్థాయి శరీరాలు) ఏ ఒక్కటీ డామినేట్ కాకుండా మూడురకాల లక్షణాలకూ సమాన ప్రాతినిథ్యం లభిస్తే అది సత్యానికి ప్రాతినిథ్యం వహించే శరీరం.. అదే భారతీయ శరీరం.

ఈ టపాలో వివరించిన విషయాన్ని సంగ్రహంగా చెప్పాలంటే ‘వాదం’, ‘ప్రతివాదం’, ‘విశ్లేషణ’ అనే వైరుధ్యాలు మౌలిక స్థాయిలో సంఘర్షించుకుంటాయి… అదే ‘జగత్తు'. ఆంశిక స్థాయిలో సమన్వయం చెందుతాయి… అదే ‘సత్యం’. ...(మిగతా విషయం మూడవ భాగంలో)

12, డిసెంబర్ 2008, శుక్రవారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--I

‘మనసులో మాట’ సుజాత గారు కొన్నాళ్ళ క్రితం చేసిన కామెంట్‌లో నేను రాసిన తాత్త్విక విషయాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని అన్నారు. తాత్త్విక విషయాలు అలానే ఉంటాయని అప్పుడు నేను సమాధానం చెప్పాను. ఇటీవలి కాలంలో ఆ వ్యాసాలను శ్రద్ధతో చదువుతున్న సీతారాం రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే విధంగా అన్నారు. మొదట ఈయనకు కూడా అదే సమాధానం చెప్పాను. ప్రతీ అంశాన్ని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా చదవడమే మార్గమని చెప్పాను. కానీ ఆయన ఆ విషయాన్ని అంటే నా రచనలోని సంక్లిష్టతను బాగా ఇన్సిస్ట్ చేశారు. దానితో నేను పునరాలోచనలో పడక తప్పలేదు. అందుకే ఆ తాత్త్విక విషయాలన్నింటినీ సాధ్యమైనంత సులువైన భాషలో శ్లోకాల ఉటంకింపు లేకుండా, సంస్కృత పరిభాష లేకుండా కొంచెం బ్రీఫ్‌గా మరలా రాస్తున్నాను.

అయితే ఈ సారి ఉదాహరణలను ఎక్కువగా వివరించను. ఎందుకంటే ఉదాహరణలను ఆల్రెడీ అసలు రచనలో వివరణాత్మకంగా పేర్కొని ఉన్నాను కదా! ఇవి కేవలం ఆ రచనలోని సంక్లిష్టతను విడగొట్టటానికి మాత్రమే ఉద్దేశించిన టపాలు.


I. కర్మ స్వరూపం


1.కర్మలు ఎల్లప్పుడూ ‘త్రయం’ (Triad) గానే ఉంటాయి. అంటే మూడేసి కర్మలు కలసి ఒక త్రయంగా ఏర్పడతాయి. ఈ విధమైన త్రయం ఏదో ఒక పరిస్థితిని లేక ఏదో ఒక విషయాన్ని సూచిస్తుంది. ఇటువంటి త్రయాలు అనేకం (అనంతం) ఉంటాయి.

ఉదాహరణకు ఈ క్రింద కొన్ని కర్మత్రయాలను పరిశీలించండి.


వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం:

ఎండ-వర్షం-చలి


మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం:

అదుపు-స్వేచ్ఛ-ఉపేక్ష


మనం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం

నిజం-అబద్దం-రహస్యం


రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం

రాజ్యం-సమాజం-వ్యక్తి


ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం

విశ్వాసం-శాస్త్రీయత-హేతుబద్ధత

ఈ విధంగా ఏ విషయానికి సంబంధించైనా కర్మత్రయం తప్పనిసరిగా ఉంటుంది.


2.ఒక కర్మత్రయంలోని కర్మలు మూడూ పరస్పరం విరుద్ధంగా (mutual opponents) ఉంటాయి. అంటే మూడింటిలో ప్రతి ఒకటి మిగతా రెంటికీ విరుద్ధంగా ఉంటుంది. పై ఉదాహరణలనొకసారి పరిశీలించండి.

‘ఎండ’ కు ‘వర్షం’ విరుద్ధం. ఈ రెంటికీ ‘చలి’ విరుద్ధం.

అలానే ‘నిజాని’కి ‘అబద్ధం’ వ్యతిరేకం. ఈ రెంటికీ ‘రహస్యం’ వ్యతిరేకం.

అలానే ఏ కర్మత్రయంలోని మూడు కర్మలైనా అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి.


3.ఈ విధంగా పరస్పరం విరుద్ధంగా ఉండే మూడు కర్మలలో ఒకదానిని ‘వాదం’ (Thesis) అంటారు. రెండవదానిని ‘ప్రతివాదం’ (AnTi Thesis) అంటారు. మూడవ దానిని ‘విశ్లేషణ’ (Analysis) అంటారు.

పైన వాతావరణానికి సంబంధించి తెలిపిన మొదటి ఉదాహరణలో ఎండ ‘వాదం’, వర్షం ‘ప్రతివాదం’, చలి ‘విశ్లేషణ’.

అలానే మరో ఉదాహరణలో అదుపు ‘వాదం’, స్వేచ్ఛ ‘ప్రతివాదం’, ఉపేక్ష ‘విశ్లేషణ’.


4.ఏ కర్మత్రయమైనా తీసుకోండి ఆ త్రయంలోని ప్రతికర్మా తనదైన ఆకర్షణ కలిగి ఉంటుంది. ఈ ఆకర్షణతోనే ఆ కర్మ మానవుడి మనసును ఆకట్టుకోగలుగుతుంది.

అయితే ఒక కర్మత్రయంలోని ఒకానొక కర్మ ఆకర్షణలో పడిన మానవుడు ఆ కర్మత్రయంలోని మిగతా రెండు కర్మల యొక్క ఆకర్షణలకు మాత్రం లోబడడు. పైగా వాటిని ద్వేషించనారంభిస్తాడు. ఎందుకంటే అవి తను ఇష్టపడుతున్న కర్మకు విరుద్ధంగా ఉన్నాయి కనుక.

ఈ విధంగా కర్మలు తమ ఆకర్షణ శక్తితో మానవునిలో రాగద్వేషాలకు కారణమవుతున్నాయి…(కర్మ స్వరూపం అయిపోయింది)

9, డిసెంబర్ 2008, మంగళవారం

వ్యాఖ్యలకు జవాబులు…II

‘సత్యాన్ని ఏదో బ్రహ్మపదార్ధం చేయకూడదు. అది చట్రాల్లో ఒదగదు.. సూత్రీకరణలకు లొంగదు.’ అని అన్నారు.

సత్యం బ్రహ్మపదార్ధం కాదనేదే నా అభిప్రాయం కూడా. ‘అది చట్రాల్లో ఒదగదు, సూత్రీకరణలకు లొంగదు’ అని మీరే దానిని బ్రహ్మ పదార్ధం చేస్తున్నారు. ‘గతితార్కిక పద్దతి ద్వారా సత్యాన్ని చేరవచ్చు’ అని పాశ్చాత్యులు నిర్ధారిస్తే, ‘గుణాతీత స్థితి ద్వారా సత్యాన్ని ఆవిష్కరించవచ్చు’ అని భారతీయులు పేర్కొన్నారు. సత్యం చట్రాల్లో ఒదగదు, సూత్రీకరణలకు లొంగదు అని మీరు ఏ ప్రాతిపదికతో పేర్కొనగలిగారో తెలియడంలేదు. అసలు తత్త్వశాస్త్రం యొక్క ఉద్దేశ్యమే సత్యాన్ని సూత్రీకరించడం, దాన్నెలా చేరాలో చెప్పడం.


ఏమిటిదంతా?’ అని అన్నారు

ఇదంతా ‘తాత్త్విక చర్చ’.. చాలా అవసరమైనది. ఈ విషయాన్ని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.


‘మీమాంసలో కొట్టుకుపోతే జీవితాన్ని దర్శించలేము’ అని అన్నారు.

‘మీమాంస’ అంటే సందేహాస్పద స్థితి..డోలాయమానం..డైలమా. నేను ఏదైతే చెప్పానో అదంతా రూఢిగానే చెప్పాను. ఎక్కడా సందేహాలను గానీ, ఊగిసలాట ధోరణిని గానీ వెలిబుచ్చలేదు. మరి ఇదంతా మీకు మీమాంసగా ఎలా అనిపించింది?


‘రచనలో సరళతలేదు.. హెచ్చు స్థాయిలో ఉన్నది.’ అన్నారు.

ఈ మాట మాత్రం నిజం. అయితే ఇందులో నా పాండిత్య ప్రదర్శన ఏమీలేదు. తత్త్వశాస్త్రంలో సంక్లిష్టత, పైస్థాయి అనేవి అనివార్యం. తత్త్వశాస్త్రం అనేదే తలపగిలే సబ్జెక్ట్. జనబాహుళ్యాన్ని ఆకట్టుకోలేనిది. చాలాకొద్దిమందికి మాత్రమే ఆసక్తి ఉండే విషయం. అప్పటికీ నేను సబ్జెక్టును సాధ్యమైనంతవరకూ సరళం చేయడానికే ప్రయత్నించాను.

(తత్త్వశాస్త్రంలో నాకున్న కొద్దిపాటి ప్రవేశం, కొద్దిపాటి అభిరుచి మేరకు నేను రాసిన ఈ వ్యాసాలే మీకు సరళంగాలేవని అనిపించాయంటే ఇక ప్రసిద్ధ తత్త్వవేత్తల రచనలు ఎలా ఉంటాయో ఆలోచించండి!)

ఈ రచనలో నా ప్రధాన ఉద్దేశం జనబాహుళ్యానికి అర్ధంకావాలనేదానికన్నా..

..ముందుగా ఇప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు పునాదిగా ఉన్న తాత్త్విక భావాలకు మారుగా భారతీయ తాత్త్విక భావాలను పరిచయం చేయడం, వాటిని మన సమస్యల పరిష్కారానికి అనుగుణమైన రూపంలో, ఒక క్రమపద్ధతిలో, సాధ్యమైనంత సంగ్రహంగా క్రోడీకరించడం..

..అలా క్రోడీకరించిన తాత్త్విక భావనలే పునాదిగా నూతన రాజకీయ, సామాజిక వ్యవస్థను ప్రతిపాదించే ఒక నూతన సిద్ధాంతాన్ని రూపొందించడం. అందుకనుగుణమైన నూతన భావజాలాన్ని నిర్మించడం.

ముందుగా భారతీయ తత్త్వశాస్త్రంలోని కొన్ని మౌలికభావనలను ప్రాధమిక స్థాయిలో సంగ్రహంగా ఒక నూతన దృక్కోణంలో (new interpretation) పరిచయంచేసే ఈ తాత్త్విక రచన విజయవంతంగా పూర్తయితే దానిని ఆధారంగా చేసుకుని ప్రజలందరికీ అర్ధమయ్యేటట్లుగా, వారిని ఆకట్టుకునేటట్లుగా విపులమైన , వివరణాత్మకమైన, విస్తారమైన రచనలు చేయవచ్చు.


‘ఇదంతా స్పెక్యులేషన్ లాగా అనిపిస్తున్నది’

ఈ మాట మీద నేను స్పందించదలచుకోలేదు.


నేరుగా విషయాన్ని చెప్పండి.. వింటాను.

మొదటి అధ్యాయంతో మీకేమీ సమస్య లేదని అనుకుంటున్నాను. రెండవ అధ్యాయం లోని విషయం మాత్రం కొంచెం కన్‌ఫ్యూజన్ కు దారితీసే అవకాశం ఉంది. చెప్పుకున్నాం కదా!..సబ్జెక్ట్ అటువంటిది. పైగా కొత్త భావాలు.

(భారతీయ తాత్త్విక విషయాలకు కొన్ని వందల సంవత్సరాలుగా అనేకమంది పండితులు అనేక రకాలుగా భాష్యాలు చెప్పారు. అయితే నేను ఈ రచనలో ఎంపిక చేసుకున్నది కొద్ది భావాలే అయినప్పటికీ ఆయా పండితుల భాష్యాలన్నింటికీ భిన్నంగా, సరికొత్తగా, నేటి మన అవసరాలకు అనుగుణంగా భాష్యం (interpretation) రాశాను.)

ఆ తాత్త్విక వ్యాసాల (గీతా వ్యాసాలు)లో ‘కర్మ స్వరూపం’ అనే శీర్షిక క్రింద రాసిన విషయాన్నంతా వీలైతే మరోసారి చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ విషయం అర్థమైతే వ్యాసావళిలోని మిగతా విషయాలన్నీ చాలా సులువుగా అర్థమౌతాయి. అప్పుడు నేను చెప్పినదంతా మీకు నేరుగానే అనిపిస్తుంది.


ఇక చివరిగా.. నేను రాసిన ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసం బావుందన్నారు. ధన్యవాదాలు! నేను రాస్తున్న వ్యాసావళినంతా ఓ చిన్న పేజీలోకి ఓ చిరు వ్యాసంగా సంగ్రహిస్తే అది ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసమౌతుంది. అంతే తప్ప ఈ రెంటికీ ఏమీ తేడా లేదు. ఆ వ్యాసం నచ్చితే ఈ వ్యాసావళంతా నచ్చినట్లే. నా ఆలోచనా సారాన్నంతటినీ ఒక్క ముక్కలో చెప్పమంటే నేను లిటరల్‌గా ఒక్కముక్కలో చెప్పలేనుగానీ ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసాన్ని మాత్రం సూచిస్తాను.

సీతారాం గారూ! మీరు ఈ రచన యెడల వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటికీ సమాధానాలు ఇవ్వగలిగాననుకుంటున్నాను.

ఈ రచనకు లక్షిత పాఠకులైన అతికొద్దిమందిలో ఒకరైన మీకు మరోసారి కృతజ్ఞతలు! ఈ రోజు భగవద్గీత ఆవిర్భవించిన రోజు. మీకూ మరియు మిగతా బ్లాగ్మితృలందరికీ 'గీతా జయంతి ' శుభాకాంక్షలు!

8, డిసెంబర్ 2008, సోమవారం

వ్యాఖ్యలకు జవాబులు…I

బ్లాగ్మితృలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతకాలంగా వేరేపనులలో పడిపోయి అప్పుడప్పుడూ కూడలిలో బ్లాగులు చూడటమేతప్ప వాటిలో కామెంట్లు గానీ, నా బ్లాగులో టపాలుగానీ రాయడంలేదు. అయితే చదువరిగారి ‘మన భద్రతే మనకు ముఖ్యం’ చదివిన తరువాత కామెంట్ చేయకుండా ఉండలేకపోయాను. ఈ విధంగా నేను తిరిగి బ్లాగ్లోకంలోకి వచ్చిన సమయంలోనే సీతారాం రెడ్డి గారు నా బ్లాగులో ముచ్చటగా మూడు బాణాలవలే మూడు విమర్శనాత్మకమైన వ్యాఖ్యలను సంధించడం జరిగినది.

బోర్‌కొట్టే నా సీరియస్ సబ్జెక్ట్‌కు వ్యాఖ్యలులేక కొన్నాళ్ళుగా నేను -తరచూ కొత్త వ్యాఖ్యలేమైనా వచ్చాయా లేదా అని చూసుకోవటం, ఒకవేళ వస్తే వాటిలో కొన్నింటికైనా సమాధానాలివ్వటం, వివాదాలు మొదలవ్వటం.. తిరిగి వ్యాఖ్యలకూ, ప్రతివ్యాఖ్యలకూ పాల్పడటం, డిస్ట్రబ్ అవటం- ఇలాంటి బాధలేవీలేకుండా హాయిగా ఉన్నాను. :). అయితే సీతారాంగారి పదునైన వ్యాఖ్యలతో ఇప్పుడు వాటికి ప్రతిస్పందించక తప్పడంలేదు. వాటికి సమాధానం చాలా పెద్దది గనుక కామెంట్‌గా కన్నా టపా రూపంలో అందిస్తే బావుంటుంది అనుకున్నాను. అందుకే ఈ టపా రాస్తున్నాను.. అది కూడా రెండు భాగాలుగా.


సీతారాం రెడ్డిగారూ,

ముందుగా మీ అమూల్యమైన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు! అభినందనలకు ధన్యవాదాలు!

నేను ‘భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!’ అనే టైటిల్‌తో రాస్తున్న వ్యాసావళిలో ఇప్పటివరకూ 28 భాగాలను రాశాను. ఇది మొత్తం మూడు అధ్యాయాల చిరుగ్రంథం. ఇంకొక టపాతో (అంటే 29వ భాగంతో) రెండవ అధ్యాయం పూర్తవుతుంది. ఆ తరువాత 3వ అధ్యాయం రాయవలసి ఉన్నది. వాటిని కూడా వీలును బట్టి త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను.

ఇక మీరు చేసిన విమర్శల సంగతి చూద్దాం.


‘మానవ జీవితాన్ని నేరుగా తాకి స్పందిస్తున్నట్లుగా లేదు’ అన్నారు.

ఈ వ్యాసావళిలోని ఇప్పటివరకూ రాసిన భాగాలను మొదటి నుండి అన్నింటినీ మరి మీరు చదివారో?!..లేదో!! నేను ఈ వ్యాసాలలోని మొదటి అధ్యాయమంతా అంటే 16వ భాగం వరకూ ప్రపంచ ప్రజల రాజకీయ, సామాజిక చారిత్రక క్రమాన్ని విశ్లేషించడానికే కేటాయించాను. (ఆ క్రమం వెనుక ఉన్న తాత్త్విక నేపథ్యాన్ని వివరించడానికి రెండవ అధ్యాయాన్ని కేటాయించాను. ఆ తాత్త్వికతననుసరించి చరిత్ర క్రమాన్ని ఏ విధంగా భవిష్యత్తులోకి పురోగమింపచేయాలో మూడవ అధ్యాయంలో చర్చిద్దామనుకుంటున్నాను) మరి అదంతా మానవ జీవితాన్ని తాకుతున్నట్లుగా మీకు అనిపించలేదా?!


‘తాజాదనం కానరావడంలేదు’ అని అన్నారు.

తాజాదనం అంటే సమకాలీన సంఘటనలను పేర్కొనలేదనా మీ ఉద్దేశ్యం. ఈ రచన చాలా విస్తారమైన విషయాన్ని బాగా కుదించి అతిసంగ్రహంగా చెబుతున్న స్థూలమైన రచన. కేవలం మౌలిక భావనలకే పరిమితమైన రచన. ఇటువంటి సంగ్రహ మరియు మౌలిక రచనలో సమకాలీన సంఘటనలనుపేర్కొనడంగానీ, వాటిని సవివరంగా రాయడంగానీ కుదిరే పనికాదు.


‘ఈ శ్లోకాలు వగైరాలు అంతా చాదస్తంలాగా కనపడుతున్నది.’ అని అన్నారు.

ఆ శ్లోకాలన్నీ భగవద్గీతలోనివని మీరు గమనించే ఉంటారు. చాదస్తపు ముసలమ్మలు, మూఢ భక్తులు మొదలైనవారి చేతిలో పారాయణ గ్రంథంగా కనబడే ఆ భగవద్గీతే ప్రపంచ ప్రసిద్ధ తత్త్వవేత్తల చేత (ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తతోసహా) మహా తాత్త్విక గ్రంథంగా, భారతీయ తత్త్వశాస్త్ర సారంగా కొనియాడబడింది. కాకలు తీరిన కమ్యూనిస్టులు, మహా మహా హేతువాదులు, కరుడు గట్టిన నాస్తికులు సైతం గీతను సర్వోన్నత తాత్త్విక గ్రంథంగా అంగీకరించారు. గీతను మరి మీరు ఏ దృష్టితో చూస్తారో మీరే నిర్ణయించుకోండి.


యజ్ఞం’, ‘కర్మ’ ఇవన్నీ అవసరమా?! అని అన్నారు.

బహుశా మీకు తత్త్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యత అంతగా తెలిసినట్లులేదు. అన్ని శాస్త్రాలకు, మనిషి సాధించిన సమస్త విజ్ఞానానికి, సమస్త మానవ ఆలోచనలకు, మానవుడు రూపొందించే అన్ని సిద్ధాంతాలకు పునాది తత్త్వశాస్త్రమే. ఇవి అన్నీ కూడా తమ మూలాలను తత్త్వశాస్త్రంలోనే కలిగి ఉంటాయి. అటువంటి తత్త్వశాస్త్రంలో ‘భారతీయ తత్త్వశాస్త్రం’ అత్యంత విశిష్టమైనది. దానిలో ‘యజ్ఞం’, ‘కర్మ’ అనేవి చాలా కీలకమైన భావనలు. అవి చర్చించబడకుండా భారతీయ తత్త్వశాస్త్రమే లేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న రాజకీయ, సామాజిక వ్యవస్థలకు పాశ్చాత్య తత్త్వశాస్త్రం పునాదిగా ఉన్నది. లాక్, హ్యూం, రూసో లాంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రాతిపదికన ప్రజాస్వామ్య, కాపిటలిస్టు వ్యవస్థలు పెంపొందాయి. హెగెల్, మార్క్స్ వంటి తత్త్వవేత్తల సిద్ధాంతాల ప్రాతిపదికన కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యవస్థలు నిర్మింపబడ్డాయి. ఇప్పుడివన్నీ స్పష్టంగా విఫలంచెందాయి. ఈ వ్యవస్థలన్నీ మానవుడిని అనేక రకాల బాధలకు గురిచేశాయి. పైన పేర్కొన్న తత్త్వవేత్తలంతా చతికిలబడ్డారు. మరి అటువంటి దోషభూయిష్టమైన తాత్త్విక మూలాలను మార్చకుండా మనం మన రాజకీయ వ్యవస్థలో, మన సామాజిక పరిస్థితులలో ఏ విధంగా మార్పును కోరగలం.. ఏ విధంగా దానిని సాధించగలం.

నిజమైన మార్పు కావాలంటే ఇప్పుడున్న పరిస్థితులకు తాత్త్విక మూలాలు ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టుకుని, వాటిని తొలగించి, అక్కడ సరియైన, సరికొత్త తాత్త్విక బీజాలను నాటాలి. అప్పుడు మాత్రమే వస్తుంది అసలైన మార్పు..కావలసిన మార్పు. అంతేకానీ ఆ తాత్త్విక సిద్ధాంతాలను అసలు గుర్తించనైనా గుర్తించకుండా, వాటిని అధ్యయనం చేయకుండా, వాటిలోని దోషాన్ని గ్రహించి దానిని మార్చకుండా అలానే వదిలేసి పైపై పరిస్థితులలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తే ఆ మార్పులు ఏ మాత్రం ప్రభావం చూపజాలవు.

ఎప్పుడు తత్త్వం మారుతుందో అప్పుడు సమస్తం మారుతుంది. మరి ఇప్పుడు భారతీయ తాత్త్విక చింతన తప్ప ఈ ప్రపంచానికి వెలుగు చూపగలిగే తత్త్వశాస్త్రం మరోటిలేదు…(మిగతా జవాబులు రెండవ భాగంలో)

13, సెప్టెంబర్ 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---28 (గీతా వ్యాసాలు)





V: జ్ఞానం

ఈ విధంగా మనం 'కర్మస్వరూపం' గురించి, 'జగత్ స్వరూపం' గురించి, 'సత్యస్వరూపం' గురించి మరియు జగత్తు నుండి సత్యాన్ని ఆవిష్కరించే 'నిష్కామకర్మ' లేక 'యజ్ఞం' గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యజ్ఞం (నిష్కామ కర్మ) యొక్క ఆచరణకు అత్యంతావశ్యకమైన ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అదే ‘జ్ఞానం’. జ్ఞానం లేనిదే మానవుడు యజ్ఞం చేయలేడు. జ్ఞానం వలన మానవుడికి నిత్యానిత్యవస్తువివేకం కలిగి అనిత్యమైన వస్తువుల యెడల వైముఖ్యాన్ని, నిత్యమైన వస్తువుల యెడల ఆసక్తిని పెంపొందించుకుంటాడు. అంటే మానవుడు జ్ఞానం వలన తనకు దేని వలన మేలు జరుగుతుందో దేని వలన కీడు జరుగుతుందో తెలుసుకుని అప్రమత్తుడై మెలగుతాడు.గుణకర్మల ఆకర్షణకు లోబడకుండా, ఆ ఆకర్షణకు కారణమైన కామాన్ని జయించి, సత్యాచరణే తన జీవన లక్ష్యంగా తెలుసుకుంటాడు. అందువలనే జ్ఞానం వలన జరిగినంత మేలు మానవునకు మరొక దానివలన జరగదు.


అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |

స్వరం జ్ఞానప్లవేనైన పృజినం సంతరిష్యసి || (అ.4-శ్లో.36)

పాపాత్ములందరిలో మహాపాపివైనాసరే, జ్ఞానమనే తెప్పతోనే పాపసాగరాన్ని దాటివేస్తావు.


న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే|

తత్స్వయం యోగసంసిద్ధః కాలే నాత్మని విందతి || (అ.4-శ్లో.38)

ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. కర్మ యొగ సిద్ధి పొందినవాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది.


సత్యాచరణ యెడల శ్రద్ధ ఉన్నపుడు మానవుడికి జ్ఞానం సిద్ధిస్తుంది.


శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః |

జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి అచిరేణాధిగచ్ఛతి || (అ.4-శ్లో.39)

శ్రద్ధాసక్తులూ, ఇంద్రియనిగ్రహమూ కలిగినవాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమ శాంతి లభిస్తుంది.


ఆ జ్ఞానమనే ఖడ్గంతో మాత్రమే మానవుడు కామాన్ని సంహరించి నిష్కాముడు అంటే గుణాతీతుడు కాగలడు. అప్పుడే యజ్ఞం చేయగలడు.


తస్మా దజ్ఞానసంభూతం హృత్‌స్థం జ్ఞానాసినాత్మనః|

చిత్‌వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిఛి భారత || (అ.4-శ్లో.42)

అర్జునా! అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని జ్ఞానమనే కత్తితో నరికివేసి, నిష్కామ కర్మయోగం ఆచరించు. లేచి యుద్ధం చేయి.


పుట్టుకతోనే ఎవరూ జ్ఞానులు కారు. జిజ్ఞాసతో అంటే జ్ఞానం యెడల ఆసక్తితో సద్గురువును సేవించినపుడు ఆయన బోధనవలన, దైవానుగ్రహం వలన క్రమంగా మనకు జ్ఞానోదయమౌతుంది.


తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః || (అ.4-శ్లో.34)

తత్త్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు.వారి వద్దకు వెళ్ళినపుడు వినయవిధేయతలతో నమస్కరించి, సమయం సందర్భం చూసి ప్రశ్నించి, సేవలు చేసి తెలుసుకో.


నిజమైన గురువు, నిజమైన శిష్యుడు అంటే సదాచరణ, పవిత్రమైన మనస్సు గల గురువు మరియు శ్రద్ధ కలిగిన శిష్యుల కలయికలో జ్ఞానం ఉద్భవిస్తుంది.

ఐతే మానవుడు జ్ఞానాన్ని పొందేంతవరకూ నిష్కామ కర్మాచరణ చేయలేడు కదా! మరి అంతవరకు ఎటువంటి కర్మాచరణ చేయాలి? అనే సమస్య ఉత్పన్నమౌతుంది. ఇక్కడే మానవుడు ఒక చిన్న వ్యూహాన్ని అవలంబించాలి. జ్ఞానసిద్ధి జరిగే వరకు మానవుడు సాత్విక కర్మలే తప్ప రాజస, తామస కర్మల జోలికి వెళ్ళకూడదు.

మానవుడు త్రిగుణాలనూ సమదృష్టితో చూస్తూ మూడురకాల గుణకర్మలనూ ఆచరించటమే నిష్కామకర్మ. కానీ మానవుడు ఆ అర్హత సాధించేంతవరకు కేవలం సాత్విక కర్మలే చేయాలనేది కూడా శాస్త్రసమ్మతమే. సాత్విక కర్మలే ఎందుకంటే జ్ఞానం లేకుండా కర్మకుపక్రమించినపుడు కామప్రకోపం వలన ఏదోఒక గుణకర్మ వైపు వ్యామోహితులవటం జరుగుతుంది. ఇలా చేసిన మూడురకాల కర్మలూ కర్మబంధాలకు దారితీసినా ప్రత్యేకించి రాజస,తామస కర్మలు రెండూ ప్రవృత్తి నివృత్తి చక్రంలో పడవేస్తాయి. అందువలనే ఈ రాజస, తామస కర్మలు రెండింటినీ ‘ద్వంద్వాలు’అని విడిగా పేర్కొంటారు. సాత్విక కర్మలు ఈ ప్రవృత్తి నివృత్తి చక్రానికి దారితీయవు. (ఈ ప్రవృత్తి నివృత్తి చక్రం అనేది జ్ఞనయోగానికి సంబంధించిన అంశం.)

ఈ విషయం గురించి గీతలో ఈ విధంగా చెప్పబడింది.


త్రైగుణ్యవిషయా వేదాః నిస్‌త్రైగుణ్యో భవార్జున!|

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || (అ.2-శ్లో.45)

అర్జునా! వేదాలు మూడుగుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలనూ విడిచి పెట్టి, ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధసత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి.


‘నిస్‌త్రైగుణ్యో- నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో’ అంటే గుణాతీత స్థితికి చేరాలంటే ముందుగా ద్వంద్వాలను అంటే రాజస, తామస కర్మలను విసర్జించి, కేవలం సాత్విక కర్మలనే చేయాలి. దీనివలన మానవుడు త్వరలోనే జ్ఞానాన్ని సాధించి తద్వారా కామాన్ని జయించి గుణాతీతుడు కాగలడని గీతాకారుని ఉద్దేశ్యం.

జ్ఞానం యొక్క తక్షణ పర్యవసానం నిష్కామకర్మ.అంటే ఒక మానవుడికి జ్ఞానం సిద్ధించినదీ అంటే ఇక అతను నిష్కామకర్మ యోగాన్ని అవలంబిస్తున్నట్లుగానే మనం భావించవచ్చు. అసలు జ్ఞానాన్ని సముపార్జించేదే నిష్కామకర్మ యోగాన్ని అవలంబించుటకొరకు. అందుకే భగవానుడు గీతలో జ్ఞానాన్ని, నిష్కామకర్మ యోగాన్ని ఒకటిగానే పేర్కొన్నాడు.


సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రపదంతి న పండితాః |

ఏకమప్యాస్థిత స్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం || (అ.5-శ్లో.4)

జ్ఞానం వేరు, కర్మయోగం వేరు అని అవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ ఒక్కదాన్ని ఆచరించినా రెండింటి ఫలమూ దక్కుతుంది.


యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి || (అ.5-శ్లో.5)

జ్ఞానయోగులు పొందే ఫలమే కర్మయోగులూ పొందుతారు.జ్ఞానయోగం, కర్మయోగం ఒకటే అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని… (సశేషం)


భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---27 (గీతా వ్యాసాలు)



అన్ని కర్మలలోని దోషాలను యజ్ఞం పరిహరిస్తుంది. సర్వ కర్మలకు భోక్త ఆ భగవంతుడే.


భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం |

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || (అ.5-శ్లో.29)

యజ్ఞాలకూ,తపస్సులకూ భోక్తననీ, సర్వలోకాలకూ ప్రభువుననీ, సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు.


అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ | (అ.9-శ్లో.24)

సర్వ యజ్ఞాలలో భోక్త, ప్రభువు నేనే.


భగవంతుడు యజ్ఞంలో స్థితమై ఉంటాడు.


కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మా క్షర సముద్భవం |

తస్మా త్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం || (అ.3-శ్లో.15)

కర్మ వేదం నుండి పుట్టినది. పరమాత్మ వల్ల వేదం వెలసినది. అంతటా వ్యాపించిన పరమాత్మ అందువలనే యజ్ఞంలో ఎప్పుడూ ఉంటాడు.


‘యజ్ఞం’ యొక్క ప్రేరేపణతో చేసే కర్మను ‘యజ్ఞం’ హవిస్సుగా స్వీకరిస్తుంది. ఈ విధంగా యజ్ఞార్ధం చేసే కర్మ యజ్ఞంలోని భగవంతుడికి సమర్పింపబడి దానిలోని దోషాలు దగ్ధమై దోషరహితమైన ‘అంశీభూత గుణకర్మ’గా మారుతుంది. అదే కర్మఫలంగా (యజ్ఞ శేషంగా) ఆ మానవుడికి దక్కుతుంది. అది సత్య నిర్మాణంలో పాలుపంచుకుంటుంది. యజ్ఞం మూడు గుణకర్మలనూ హవిస్సులుగా కోరుతుంది కనుక త్రివిధమైన అంశీభూత గుణాలూ ఏర్పడి అవి మూడునూ పరస్పరం సమన్వయం చెంది ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. ఆ విధంగా ఆ మానవుడి జీవనం సత్యమయమౌతుంది.

రాగద్వేషాలతో చేసే కర్మలను భగవంతుడు స్వీకరించడు. ఎందుకంటే అవి (యజ్ఞార్ధం చేయబడలేదు కనుక) ఆయనకు సమర్పింపబడటంలేదు. అందువలన వాటిలోని దోషం దగ్ధం కాదు. దోషభూయిష్టమైన కర్మ ఫలమే ఆ మానవునికి అందుతుంది. అది కర్మ బంధానికి దారితీస్తుంది.


యజ్ఞశిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |

భుంజతే తే త్వఘం పాపాః యే పచంత్యాత్మ కారణాత్ || (అ.3-శ్లో.13)

యజ్ఞశేషమును భుజించు సజ్జనులు సర్వ పాపముల నుండీ విముక్తులగుచున్నారు. కర్మలను యజ్ఞార్ధం కాక తమ ఇష్టయిష్టాలమేరకు చేసేవారు పాపమునే వండుకుని ఆ పాపమునే భుజిస్తున్నారు.


యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం |

నాయం లోకో స్త్య యజ్ఞస్య కుతో న్యః కురుసత్తమ ! || (అ.4-శ్లో.31)

కురుకుల భూషణా! యజ్ఞశేషము అమృతము.దీనిని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మపదం పొందుతారు. యజ్ఞం ఒకటీ చేయని వాడికి ఇహలోక సుఖంలేదు; పరలోక సుఖం అసలే లేదు.


ఇంతకు ముందు (‘యజ్ఞం’ అనే అంశం యొక్క ప్రారంభంలో) చెప్పుకున్న ఉదాహరణలలో ‘యజ్ఞం’ ద్వారా ‘సత్యం’ ఏ విధంగా ఆవిష్కరించబడుతుందో చూద్దాం.

‘వ్యవస్థ’ అనే విషయంలో పాలకులు ఏ ఒక్క గుణకార్యానికి లోబడకుండా అటు తమో గుణకార్యమైన ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలు, ఇటు రజో గుణ కార్యమైన ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు, అలాగే సత్వ గుణకార్యమైన ‘వ్యక్తి’ యొక్క ప్రయోజనాలు ఇలా మూడింటినీ సమన్వయపరచి, మూడింటి యొక్క ప్రయోజనాలనూ నెరవేర్చినచో ‘వ్యవస్థ’ విషయంలో ‘యజ్ఞం’ జరిగి ‘సత్యం’ ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.

అలానే ‘భాష’ విషయంలో సందర్భౌచిత్యాన్ననుసరించి ఒక్కొకసారి వాడుక భాష, ఒక్కోకసారి ఇంగ్లీషు భాష (శిష్ట భాష), ఒక్కొకసారి సంస్కృతం (పురాతన భాష) ఇలా మూడు భాషలనూ అంగీకరించినట్లైతే భాష విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరించబడినట్లుగా భావించవచ్చు.

అలానే ‘జీవన విధానం’ విషయంలో సందర్భౌచిత్యాన్ననుసరించి సంప్రదాయాలనూ పాటించాలి. ఆధునికంగానూ జీవించాలి. ఒక్కొక సందర్భంలో కాలానుగుణమైన మార్పులనూ అంగీకరించాలి. ఇలాగనుక ప్రవర్తిస్తే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.

అలాగే ‘పిల్లల పెంపకం’లో ఒక్కొక సందర్భంలో వారిని క్రమశిక్షణతో కట్టడి చేయాలి. ఒక్కొక సందర్భంలో వారికి స్వేచ్ఛ నిచ్చి వారు అడిగినది సమకూర్చాలి. ఒక్కొక సందర్భంలో మన ప్రమేయంలేకుండా విషయాన్ని వారి స్వయం నిర్ణయానికి వదలి వేయాలి. ఇలా గనుక ప్రవర్తిస్తే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.

అలాగే సమాజంలో మనుగడ సాగించే మానవుడు సత్వ గుణ సంబంధమైన విజ్ఞానాన్నీ ఆర్జించాలి. రజోగుణ సందర్భమైన లౌక్యాన్నీ, వ్యవహార దక్షతనూ పెంపొందించుకోవాలి. అలానే తమోగుణసంబంధమైన మంచి నడవడికనూ కలిగి ఉండాలి. ఇలా గనుక జరిగినట్లైతే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.

ఇలా సనాతనమైన, సార్వత్రికమైన, సార్వజనీనమైన ‘యజ్ఞం’ ద్వారా ఏ విషయంలోనైనా సత్యావిష్కరణ చేయవచ్చు. సర్వేసర్వత్రా ఎక్కడైనా, ఎప్పుడైనా మానవాళి జీవనంలోని ఏ కోణానికైనా, ఏ శాస్త్రానికైనా, ఏ రంగానికైనా యజ్ఞాన్ని అన్వయించుకోవచ్చు; ఆయా విషయాలకు సంబంధించి సత్యాన్ని సాధించవచ్చు.

(విషయం అవగాహన అవటం కొరకు ఎక్కువగా తేలిక పాటి విషయాలను తీసుకొని వివరించడం జరిగింది. దీనిని బట్టి ‘సత్యనిర్మాణం’ ఇంత తేలికా అని అనుకోకూడదు. మనకు వాస్తవ జీవితంలో అది వ్యక్తిగతమైనా కానివ్వండి సామాజికమైనా కానివ్వండి చాలా సంక్లిష్టమైన సమస్యలు ఎదురుపడుతుంటాయి. ముందు సులువైన విషయాల ద్వారా యజ్ఞప్రక్రియను అర్ధం చేసుకుంటే ఆ తరువాత ఎంతటి క్లిష్టమైన వ్యవహారంలోనైనా మనం సరిగా వ్యవహరించగలుగుతాము.)… (సశేషం)


12, సెప్టెంబర్ 2008, శుక్రవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---26 (గీతా వ్యాసాలు)



అటువంటి జీవేచ్ఛ నెరవేర్చుకొనుటకొరకు మానవునికి మార్గదర్శియై నిలచేదే యజ్ఞం.ప్రతి మానవుడిని అతని జన్మాదిగా యజ్ఞం వెన్నంటే ఉంటుంది.ఇది అతని సత్య కర్మాచరణకు,సత్య నిర్మాణానికి మార్గదర్శిగా ఉంటుంది.


సహ యజ్ఞాః ప్రజా స్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |

స్నేన ప్రసవిష్యధ్వం ఏష వో స్త్విష్ట కామధుక్ || (అ.3-శ్లో.10)

బ్రహ్మ ఆదియందు ప్రజలను సృష్టించినపుడే యజ్ఞమును కూడా సృష్టించి వారితో నిట్లనియె. “ఈ యజ్ఞమే కామధేనువు వలే మీ సమస్త వాంఛితములను పూర్ణమొనర్చును. దీనినాశ్రయించి మీరు పురోభివృద్ధి నొందుదురు గాక !”


యజ్ఞం యొక్క మార్గదర్శకత్వం ప్రతి మానవునికి అతని హృదయానుభూతి ద్వారా వ్యక్తమవుతూనే ఉంటుంది. రాగ ద్వేష పూరిత మనస్కుడు ఈ హృదయానుభూతి తెలుసుకోలేడు. అతడు తన మనసులో చెలరేగిన కోరిక మేరకు తానిష్టపడిన, తననాకర్షించిన గుణకర్మనే చేస్తూ సత్యానికి దూరమై, ఆ గుణకర్మ బంధంలో చిక్కుకుపోతాడు. కానీ రాగ ద్వేషాలు లేని గుణాతీతుడు హృదయానుభూతి ద్వారా యజ్ఞం యొక్క మార్గదర్శకత్వంలో కర్మలాచరిస్తాడు. రాగద్వేషాల తో కల్లోలితం కాకుండా మనస్సు ఉన్నపుడే మానవుడు హృదయానుభూతిని తెలుసుకోగలడు. యజ్ఞార్థం కర్మలు చేయగలడు. ఈ విధంగా యజ్ఞం ఒక మానవుడికి ఏది సత్యమో అదే ఆచరించేటట్లుగా ప్రేరేపిస్తుంది; ఒక మనిషి జీవేచ్ఛ నెరవేరటానికి సహకరిస్తుంది. (“ఈ యజ్ఞమే కామధేనువువలే మీ సమస్త వాంఛితములను పూర్ణమొనర్చును” అన్న మాటలో వాంఛితములంటే జీవేచ్ఛ పరిధిలోకి వచ్చే కోరికలని అర్థం)

హృదయానుభూతి అనే భావనను అర్థం చేసుకోవటానికి సొదాహరణంగా ప్రయత్నిద్దాం. ఏదైనా గట్టి దారానికి కొద్దిగా బరువున్న వస్తువు నేదైనా వ్రేలాడదీసిన దానిని మనం భౌతిక శాస్త్ర పరిభాషలో ‘లఘులోలకం’ (Simple Pendulam) అంటాం. ఈ లఘులోలకం దానిమీద బాహ్యబలం (External Force) పని చేస్తున్నంత కాలం అది అటునిటు ఊగుతూ డోలనాలు (Simple Harmonic Motion) చేస్తూనే ఉంటుంది. ఈ External Force ఉన్నా, లేకున్నా కూడా ఈ లఘులోలకం మీద నిరంతరం పనిచేస్తూ మరొకబలం ఉంటుంది. అదే Gravitational Pull. ఈ Gravitational pull లఘులోలకాన్ని చలనరహితంగా, స్థిరంగా ఉంచటానికి ప్రయత్నిస్తుంది. ఐతే బాహ్యబలం పని చేస్తున్నంత కాలం ఈ ఉద్దేశ్యం నెరవేరదు. ఎందుకంటే బాహ్యబలం Gravitational Pull కన్నా ప్రబలమైనది. ఐతే బాహ్యబలం తాత్కాలికమైనది. ఇది తొలగి పోగానే ఎల్లప్పుడూ ఉండే Gravitational Pull వలన లఘులోలకం డోలనాలు లేకుండా స్థిరంగా ఉంటుంది.

Simple Pendulam యొక్క చలనాలే మనసు యొక్క చాంచల్యం. Gravitational Pull హృదయానుభూతి. మనశ్చాంచల్యం అణగగానే హృదయానుభూతి దానంతటదే అనుభూతిలోకి వస్తుంది. దానికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన పనిలేదు. అది ప్రతి మానవుడిలోనూ ఎల్లప్పుడూ ఉండేదే. అది నిరంతరం ఉండి ప్రతిమానవుడిని సత్యమార్గంలో నడపడానికి ప్రయత్నిస్తుంది. ఐతే మనశ్చాంచల్యం భగదనుభూతికన్నా భౌతికంగా ప్రబలమైనది. అందువలన అది ఉన్నంతకాలం ఈ అనుభూతి అనుభవంలోకి రాదు. ఐతే ఈ అశాశ్వతమైన మనశ్చాంచల్యాన్ని సత్సంకల్పంతో, అభ్యాసంతో అణచివేయవచ్చు. అది అణగి పోగానే శాశ్వతమైన హృదయానుభూతి దానంతటదే అనుభవంలోకి వస్తుంది.

అలాగే తాత్కాలికమైన మేఘాలు తొలగగానే శాశ్వతమైన నిర్మలాకాశం దృగ్గోచరమైనట్లు మనోమాలిన్యం తొలగగానే నిరంతర వాహిని అయిన భగవదనుభూతి దానంతటదే అనుభవంలోకి వస్తుంది.

మనశ్చాంచల్యం ఉన్నంతకాలం మానవుడు దాని ప్రకారమే కర్మాచరణ చేస్తాడు. అసత్య మార్గంలో పయనిస్తాడు. ఆ హోరుగాలిలో అతనికి మంద్రమైన హృదయనాదం వినిపించదు. ఎప్పుడైతే ఈ మనశ్చాంచల్యం అణగిందో అప్పుడు మానవుడు ఆ Devine Pull కి లోబడతాడు. అపుడు దాని ప్రకారం కర్మాచరణ చేస్తాడు.

అంటే మానవునికి కర్మాచరణ ఎప్పుడూ తప్పదు. ఐతే ఆ కర్మాచరణ మనోచలనాలకు లోబడి చేయాలా లేక హృదయానుభూతికి లోబడి చేయాలా అన్నదే సమస్య.

ప్రతి మనిషీ సత్యాన్నే పొందాలి.. సత్యాన్నే ఆచరించాలి. సత్యం ‘యజ్ఞం’ ద్వారా మాత్రమే నిర్మింపబడుతుంది. యజ్ఞం హృదయానుభూతి ద్వారా అభివ్యక్తం అవుతుంది. అంటే యజ్ఞం యొక్క మార్గదర్శకత్వం ప్రతిమానవునికి అతని హృదయానుభూతిద్వారా వ్యక్తమౌతుంది. కనుక సత్యాన్ని కోరేవారు మనసు యొక్క ఇష్టానిష్టాలననుసరించి కాక హృదయానుభూతికి లోబడి మాత్రమే కర్మ చేయాలి. అదే గీతలో యజ్ఞార్థం కర్మ చేయడంగా చెప్పబడింది.


యజ్ఞార్ధాత్ కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధనః |

తదర్ధం కర్మ కౌంతేయ ! ముక్తసంగః స్సమాచర || (అ.3-శ్లో.9)

కుంతీ పుత్రా ! యాగసంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసార బంధం కలుగ చేస్తాయి.కనుక ఫలాపేక్ష లేకుండా యజ్ఞార్ధమే కర్మలాచరించు.


ఏ విషయమైనా త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే పరస్పర విరుద్ధమైన మూడు అనురూప గుణకర్మలు గా ఉంటుందని మనకు తెలుసు. కామి కర్మాచరణకు పూనుకున్నపుడు తనకిష్టమైన గుణకర్మను ఎంచుకుని దాన్నే ఆచరిస్తాడు. నిష్కామి అలా కాక యజ్ఞం సూచించే గుణకర్మ నెంచుకుంటాడు. అంటే నిష్కామికి తన ఇష్టానిష్టాలు ఉండవు. యజ్ఞమేది చెబితే అదే ఆచరిస్తాడు. ఆనుగా ఏ ఒక్క కర్మనూ సంకల్పించడు (సర్వారంభ పరిత్యాగీ) యజ్ఞం సందర్భౌచిత్య్యాన్ననుసరించి ఒక్కొకసారి సత్వగుణ కర్మను, ఒక్కొకసారి రజోగుణకర్మను, ఒక్కొకసారి తమోగుణకర్మను; ఈ విధంగా ఒక్కొకసారి ఒక్కొక గుణకర్మను సూచిస్తుంది. నిష్కామి వాటిని ఆచరిస్తుంటాడు. ఈ విధంగా మూడు గుణాలకూ సమాన ప్రాధాన్యం ఏర్పడి సత్యనిర్మాణం జరుగుతుంది. మానవుని జీవేచ్ఛ నెరవేరుతుంది. ఈ విధమైన కర్మాచరణవలన ఏ విధమైన కర్మబంధాలలోనూ మానవుడు చిక్కుకోడు… (సశేషం)


10, సెప్టెంబర్ 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---25 (గీతా వ్యాసాలు)





IV B: గుణాతీత స్థితి

రాగమున్న చోట ద్వేషముంటుంది. కామమున్నచోట క్రోధముంటుంది. రాగద్వేషాలు, కామక్రోధాలు బింబప్రతిబింబాలు. ఒక విషయాన్ని మనం ఇష్టపడితే తద్వ్యతిరిక్తమైనదాన్ని వ్యతిరేకించటం సహజమే.కనుక ఇష్టాన్ని తొలగిస్తే అనిష్టతకూడా తొలగిపోతుంది. అలా ఇష్టానిష్టాలు (లేక రాగద్వేషాలు) లేకుండా చేసే కర్మే.. అంటే కామం లేకుండా చేసే కర్మే నిష్కామకర్మ.

ఇష్టానిష్టాలు లేని ఇటువంటి నిష్కామ మానసిక స్థితినే ‘గుణాతీత స్థితి’ అంటారు. గుణాతీతం అంటే అతనికి ప్రత్యేకించి ఏ ఒక్క గుణం మీద కోరిక, ఆసక్తి లేదు. ఏ ఒక్క గుణం యొక్క ఆకర్షణకూ అతను లొంగిపోవటం లేదు. ఏ ఒక్క గుణాన్ని అతను ద్వేషించటంలేదు. అన్ని గుణాలను గుణాతీతుడు సమదృష్టితో చూస్తున్నాడు.

గీతలో ఈ గుణాతీత స్థితి గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా బదులిచ్చాడు.

అర్జున ఉవాచ:

కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ! |

కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే || (అ.14-శ్లో.21)

అర్జునుడు : ప్రభూ! ఈ త్రిగుణములను అతిక్రమించిన వాని (గుణాతీతుని) లక్షణములేవి? వాని ప్రవర్తన ఎట్లుండును? ఈ గుణములను అతిక్రమించుటెట్లు?


శ్రీ భగవానువాచ:

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ! |

న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి || (అ.14-శ్లో.22)

భగవానుడు: అర్జునా! గుణాతీతుడు తనకు సంప్రాప్తించిన సత్వ గుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ, రజో గుణ ధర్మమైన కర్మ ప్రవృత్తినిగానీ, తమోగుణలక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు; అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు.


ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |

గుణా వర్తంత ఇత్యేవ యో పతిష్ఠతి నేఙ్గతే || (అ.14-శ్లో.23)

ఏమీ సంబంధంలేని వాడిలాగా తటస్తుడిగా ఉండి గుణాలవల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు.


సమదుఃఖసుఖస్స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః |

తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః || (అ.14-శ్లో.24)

సుఖదుఃఖాలయందు సమదృష్టి కలిగి ఉంటాడు. మట్టి, రాయి, బంగారం మొదలైన వస్తువులను సమభావంతో చూస్తాడు. ఇష్టమైన దానియందును, అనిష్టమైన దానియందును సమభావననే కలిగి ఉంటాడు. మరియు దూషణలయందు, భూషణలయందు కూడా సమభావననే కలిగి ఉంటాడు.


మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః |

సర్వారంభపరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే || (అ.14-శ్లో.25)

మానావమానములయందు సమదృష్టి కలిగి ఉండి; శత్రువులయందును, మిత్రులయందును కూడా సమదృష్టినే కలిగి ఉండి తనకు తానుగా ఏ పనినీ ప్రారంభించని వాడు గుణాతీతుడనబడును.


అంటే సత్వగుణకర్మ ఎడల, రజోగుణకర్మ ఎడల, తమోగుణకర్మ ఎడల గుణాతీతుడు సమదృష్టినే కలిగిఉన్నాడు. వాటిలో ఏ ఒక్కదాని మీద ప్రత్యేకించి ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు. వాటి ఆకర్షణకు లోబడకుండా వాటిని కేవలం జగత్సంబంధమైన గుణకార్యాలుగానే చూస్తున్నాడు. మట్టిని, రాయిని, బంగారాన్ని ఒకే దృష్టితో చూస్తున్నాడు. అంటే వస్తువుల భౌతిక విలువను పరిగణనలోకి తీసుకోవటంలేదు. యజ్ఞానికి అవసరమైతే ఎంత అల్ప వస్తువునైనా అతను స్వీకరిస్తాడు. యజ్ఞానికి అవసరంలేకపోతే ఎంత విలువైన వస్తువైనా, ఎంత ఆకర్షణీయమైన విషయమైనా స్వీకరించడు. అంటే అతని దృష్టి యజ్ఞం మీద, సత్యం మీదే తప్ప ఆకర్షణీయమైన గుణకార్యాల మీద లేదు. శత్రుమిత్రులను, మానావమానములను, సుఖదుఃఖాలను, దూషణభూషణలను ఒకే దృష్టితో చూస్తున్నాడు.. అంటే వైరుధ్యాలను సమదృష్టితో చూస్తున్నాడు అని అర్థం. అంటే తద్విషయం మరియు తద్‌వ్యతిరిక్త విషయం అతని దృష్టిలో ఒకటే. అంటే పరస్పర విరుద్ధమైన గుణాలు మూడునూ అతని దృష్టిలో ఒకటే. తనకు తానుగా ఏ పనినీ ప్రారంభించడు అంటే యజ్ఞం యొక్క ప్రేరేపణతో తప్ప తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ఏ పనినీ ప్రారంభించడు అని అర్థం.

మరి ఇటువంటి మానవుడు దేనికొరకు కర్మ చేస్తాడు. రాగద్వేషాలతో కర్మలాచరించే మానవుడంటే కర్మలను తానిష్టపడే గుణాన్ని మరియు దానికి ప్రాతినిథ్యం వహించే వస్తువును లేక విషయాన్ని పొందటం కొరకు కర్మాచరణకు పూనుకుంటాడు. మరి గుణాతీతుడు ఏ ఒక్క గుణాన్నీ ప్రత్యేకించి ఇష్టపడటం లేదు కనుక మరి దేని కొరకు కర్మలాచరిస్తాడు?.. దేనికొరకంటే సత్యం కొరకు.. ఆ సత్యాన్ని మాత్రమే కోరే ‘జీవేచ్ఛ’ నెరవేర్చుకొనుట కొరకు. ‘జీవేచ్ఛ అంటే మానవుడు అసలు వాస్తవంగా ఏ కార్యనిర్వహణకొరకు ఈ భూమిమీద జన్మించాడో అదే అతని జీవేచ్ఛ’. అది మాత్రమే అతనికి సత్యం. అది మాత్రమే అతని జీవన లక్ష్యం. జీవేచ్ఛ దోషరహితం; జీవేచ్ఛ సత్య స్వరూపం.

ఏ మానవుడైనా జీవేచ్ఛ నెరవేర్చుకోవాలనే కోరుకుంటాడు. కానీ కామం వలన దీనికి మారుగా గుణకర్మల యెడల సమ్మోహితుడై వాటిని చేయాలనుకుంటాడు. ‘తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వలన పాపాలు చేస్తున్నాడు?’ అని అర్జునుడు శ్రీ కృష్ణుణ్ణి ప్రశ్నించటంలోని ఆంతర్యం ఇదే. (ఈ జీవేచ్ఛ అనేది జ్ఞానయోగానికి సంబంధించిన విషయం. కర్మయోగంలో ఇంతకు మించిన వివరణ అప్రస్తుతం.)… (సశేషం)


9, సెప్టెంబర్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---24 (గీతా వ్యాసాలు)



అలాగే మరో ఉదాహరణ చూద్దాం. జీవన విధానానికి సంబంధించి తమోగుణ కర్మను ఇష్టపడేవారు మానవుడు సాంప్రదాయకంగా, ఆచారపరాయణత్వంతో జీవించాలని కోరుకుంటారు. అలాగే రజోగుణకర్మను ఇష్టపడే వారు మానవుడు అభ్యుదయ భావాలతో, ఆధునికంగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సత్వగుణకర్మను ఇష్టపడేవారు మానవుడు సంప్రదాయాలను, ఆచారాలను కాలరాచి, కాలానుగుణమైన మార్పుతో జీవించాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ఏ ఒక్కరూ మిగతా వారి జీవన విధానం యొక్క ఆవశ్యకతను ఏ మాత్రం గుర్తించకపోగా వారిని తీవ్రంగా ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు.తమ జీవన విధానం మాత్రమే మానవునికి మేలు చేస్తుంది అని ఈ మూడు వర్గాలలో ప్రతి ఒకరు గాఢంగా నమ్ముతారు.

బ్రిటిష్ వారి పరిపాలనా సమయంలో ఈ విషయానికి సంబంధించి మనకు స్పష్టమైన ఉదాహరణలు దొరుకుతాయి. పూర్వాచార పరాయణులైన వారు సతీసహగమనం, బాల్యవివాహాలు చేయటం, సముద్రయానాన్ని అంగీకరించకపోవడం ఇత్యాది మూఢనమ్మకాలతో జీవించేవారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు ఆంగ్ల విద్య నభ్యసించి, ఇంగ్లీష్ వారి కట్టూబొట్టూ నేర్చి భారతీయతను హేళన చేసేవారు; చులకనగా చూసేవారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు సంఘసంస్కరణ పేరుతో వారివాదనలను సమర్ధించుకొనడానికి అపౌరుషేయాలైన వేదముల యొక్క ప్రామాణ్యాన్నే ధిక్కరించి తూలనాడేవారు. అంటే వీరు సత్వ గుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

భాషకు సంబంధించి ఒక ఉదాహరణ. సత్వ గుణకర్మను ఇష్టపడేవారు సాధారణ జనులకు సైతం అర్ధమయ్యే వాడుక భాషనే ప్రతి సందర్భంలోనూ వాడాలని కోరుకుంటారు. రజోగుణకర్మను ఇష్టపడేవారు విద్యావంతులైన కొందరికి మాత్రమే అర్ధమయ్యే ఇంగ్లీషు లాంటి భాషనే ప్రతి సందర్భంలోనూ వాడాలని కోరుకుంటారు. తమోగుణ కర్మను ఇష్టపడేవారు పురోహిత వర్గానికి తప్ప మరెవరికీ అర్ధం కాని వాడుకలో లేని సంస్కృతం లాంటి భాషనే వాడాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ప్రతి ఒక్కరూ మిగతా వారు ప్రతిపాదించే భాషలమీద తీవ్రస్థాయిలో దాడి చేస్తారు.

హేతువాదులు వివాహసందర్భంలో కూడా సంస్కృత మంత్రాలను వ్యతిరేకించి, అప్పుడు కూడా వాడుక భాషే వాడాలని పట్టుబడతారు. వారు జరిపించే వివాహాలు ఇలానే జరుగుతాయి. అంటే వీరు సత్వగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. ఛాందస పండితులు సామాన్య జనులందరికీ ఉపయోగపడవలసిన గ్రంథాలను సైతం కఠినమైన సంస్కృతంలోనో, గ్రాంథికంలోనో రాస్తారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు ఉన్నత స్థాయి విద్యావంతులు ప్రతి సందర్భంలోనూ ఇంగ్లీషు భాషే వాడతారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

పిల్లల పెంపకమే తీసుకోండి.. కొందరు క్రమశిక్షణ పేరుతో పిల్లలను తీవ్రనిర్భంధానికి గురిచేస్తారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు అతి గారాబం చేసి వారు కోరిందల్లా సమకూర్చుతారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు పిల్లలను వారిమానాన వారిని గాలికి వదిలేస్తారు. అంటే వీరు సత్వగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

సమాజంలో మనుగడ సాగించే మానవుడు అలవరచుకోవలసిన లక్షణాల విషయమే తీసుకోండి. కొందరు విజ్ఞానాన్ని సముపార్జిస్తే చాలనుకుంటారు. అంటే వీరు సత్వగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరు లౌక్యాన్ని, వ్యవహారదక్షతను అలవరచుకుంటే చాలనుకుంటారు. అంటే వీరు రజోగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరికొందరు మంచి నడవడిక (శీలం) కలిగి ఉంటే చాలనుకుంటారు. అంటే వీరు తమోగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణలన్నింటిలో కూడా మనకు కనిపిస్తున్నది ఒకటే. వీరంతా గుణాలకు మౌలిక స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎందుకంటే గుణాలు మూడింటిలో ప్రతి ఒకటి కూడా మౌలిక స్థాయిలో మిగతా గుణాలకు చోటు పెట్టకుండా దేనికదే పూర్తిస్థాయి ప్రమాణంగా (Unit) కొనసాగతుంది. ఈ కారణం చేత మౌలిక స్థాయిలో గుణాలు మూడూ పరస్పరం సంఘర్షించుకుంటూ ఉంటాయి. దీనికనుగుణంగా ఈ మూడు వర్గాలూ కూడా తమదే సరైన మార్గమంటే తమదే సరైన మార్గమంటూ పరస్పరం ద్వేషించుకుంటూ, కలహించుకుంటూ ఉంటాయి.

మౌలిక స్థాయి కనుక ముగ్గురిలోనూ మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. కానీ ప్రతి ఒకరు తమలోని మంచిని, ఎదుటివారిలోని చెడుని మాత్రమే చూస్తారు. దీనికి కారణం రాగద్వేషపూరితమైన మనస్సే. అంటే తమకిష్టమైన గుణకర్మల ఎడల రాగం, తద్వ్యతిరిక్తమైన మిగతా రెండు గుణకర్మల ఎడల ద్వేషం. రాగం తమలోని చెడుని చూడనివ్వదు; ద్వేషం ఎదుటివారిలోని మంచిని చూడనివ్వదు. వీరి కలహానికి అంతే ఉండదు. వీరినిలాగే వదిలేస్తే యుగాంతం వరకూ ద్వేషించుకుంటూనే ఉంటారు.

ఈ విధంగా వీరంతా సత్యానికి దూరమయ్యారు. దీనికంతటికీ కారణం వీరు మూడు గుణాలలో ఒకానొక గుణం యొక్క ఆకర్షణకు లోబడి దాని మీద కోరికను పెంచుకోవడం. దాని ప్రలోభానికి లొంగిపోవటం. తద్వ్యతిరిక్త గుణాలమీద అనిష్టత పెంచుకోవటం. దీనినే ‘కామం’ అంటారు.


V: కామం

‘కామం’ గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది.

అర్జున ఉవాచ:

అథ కేన ప్రయు క్తోయం పాపం చరతి పూరుషః |

అనిచ్ఛ న్నపి వార్ష్ణేయ బలా దివ నియోజితః || (అ.3-శ్లో.36)

అర్జునుడు: కృష్ణా! తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు?(తనకు ఇష్టం లేకపోయినా అంటే తన ‘జీవేచ్ఛ’కు వ్యతిరేకంగా అని; ఈ ‘జీవేచ్ఛ’ అంటే ఏమిటో ముందు ముందు వివరించబడుతుంది.)


శ్రీ భగవానువాచ:

కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః |

మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణం || (అ.3-శ్లో.37)

భగవానుడు: రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకు మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కామమూ, మహా పాతకాలకు దారితీసే క్రోధమూ ఈ లోకంలో మానవుడికి మహా శత్రువులు.



ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ |

యథోల్బేనావృతో గర్భః తథా తేనేద మావృతం || (అ.3-శ్లో.38)

పొగ అగ్నినీ, మురికి అద్దాన్నీ, మావి గర్భంలోని శిశువునూ కప్పివేసినట్లు కామం ఆత్మ జ్ఞానాన్ని ఆవరించింది.



ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా |

కామరూపేణ కౌంతేయ ! దుష్పూ రేణానలేన చ || (అ.3-శ్లో.39)

అర్జునా! ఎంతకీ తృప్తి ఎరుగని అగ్నిలాంటి కామం జ్ఞానులకు నిత్య శత్రువు. ఆత్మ జ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది.



ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్టానముచ్యతే |

ఏతై ర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినం || (అ.3-శ్లో.40)

ఈ కామానికి ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహధారులకు మోహం కలగజేస్తున్నది.



తస్మాత్త్వ మింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ! |

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశినం || (అ.3-శ్లో.41)

అర్జునా ! అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని, జ్ఞాన విజ్ఞానాలను నాశనంచేసే కామమనే పాపిని పారద్రోలు.



ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః |

మనస్తసు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || (అ.3-శ్లో.42)

దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటే మనస్సు శ్రేష్టం. మనస్సు కంటే బుద్ధి అధికం. అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ.



ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మన మాత్మనా |

జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం || (అ.3-శ్లో.43)

అర్జునా ! ఇలా బుద్ధికంటే ఆత్మ గొప్పదని గుర్తించి, బుద్ధితోనే మనస్సు నిలకడచేసుకుని, కామరూపంలో ఉన్న జయించరాని శత్రువును రూపుమాపు… (సశేషం)


భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---23 (గీతా వ్యాసాలు)



పాశ్చాత్య (గ్రీకు) తత్త్వశాస్త్రంలోని Synthesis భారతీయ తత్త్వశాస్త్రంలోని యజ్ఞం; ఈ రెండు భావాలూ ఒకటే. ఐతే పాశ్చాత్యులు ఈ ప్రక్రియలో రెండు వైరుధ్యాలు (Thesis మరియు Anti Thesis) మాత్రమే పాలు పంచుకుంటాయని భావించారు. కానీ భారతీయులు మూడు వైరుధ్యాలు (త్రిగుణాలు) పాలుపంచుకుంటాయని ఖచ్చితంగా చెప్పారు.

త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే గుణకర్మలే ఈ యజ్ఞంలో హవిస్సులు. ‘మౌలిక స్థాయి గుణకర్మలు ’ ఆ విధంగా యజ్ఞంలో హవిస్సులుగా దగ్ధమై ‘అంశీభూత గుణకర్మలు ’గా ఆవిర్భవిస్తాయి. ఇలా ఆవిర్భవించిన మూడు అంశలూ పరస్పరం సమన్వయం చెంది ఆ విషయంలో (ఏ విషయంలోనైనా సరే) ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది.

సత్యాన్ని అందరూ అంగీకరించినా వాస్తవమైన సత్యస్వరూపాన్నెరిగి తదాచరణకు అందరూ పూనుకోరు. గుణకర్మలు చేస్తూ అదే సత్యమని వ్యాఖ్యానిస్తారు. ‘యజ్ఞం’ వలన మాత్రమే ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. గుణకర్మల వలన సత్యం లభించకపోగా మానవుడు కర్మ బంధాలలో చిక్కుకుంటాడు.

జగత్తులోని మూడు గుణాలూ వేటికవే ఆకర్షణీయమైనవి. దేని భౌతిక ఔన్నత్యం దానిదే. దేని సమ్మోహనత్వం దానిదే. ఇవి సాధారణ మానవుడి మనస్సును సులభంగా ప్రలోభపెడతాయి. ఆ గుణాన్ని లేక ఆ గుణానికి ప్రాతినిథ్యం వహించే వస్తువును పొందాలనే కాంక్షను మానవుడిలో ప్రేరేపిస్తాయి. అలానే ఇవి మూడు గుణాలూ కూడా పరస్పర విరుద్ధమైనవి కావడం వలన ఏదో ఒక గుణం యొక్క ఆకర్షణలో పడిన మానవుడు మిగతా రెండు గుణాల యెడల అనిష్టత చూపటం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అవి తానిష్టపడే గుణానికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక.

మానవుడు మూడు గుణాలలో ఏ ఒక్క గుణాన్నైనా ఇష్టపడటం జరగవచ్చు. అది అతని స్వభావాన్ననుసరించి ఉంటుంది. కానీ దేన్ని ఇష్టపడినా మిగతా రెండింటి ఎడలా అయిష్టత చూపటం అనివార్యం. ఇష్టానిష్టాలనే ‘రాగద్వేషాలు’ అంటారు. ఈ విధంగా రాగద్వేషపూరితమైన మనస్సుతో కర్మాచరణకు పూనుకున్నపుడు మానవుడు తానిష్టపడే గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మనే అధికంగా చేస్తాడు. తాను అయిష్టత చూపే తద్వ్యతిరిక్త గుణాలకు ప్రాతినిధ్యం వహించే కర్మలను ద్వేషభావం వలన సాధ్యమైనంతవరకూ ఆచరించడు. ఇలా అతని కర్మాచరణలో ఒక గుణకర్మ అధికమై సత్యనిర్మాణం జరగదు. ఎందుకంటే సత్యంలో మూడుగుణ కర్మలకూ సమాన ప్రాతినిధ్యం ఉండవలసినదే కనుక.

కానీ గుణాల ఆకర్షణకు లోబడకుండా, రాగద్వేషాలు లేకుండా కర్మనాచరించినపుడు మానవుడు ప్రత్యేకించి ఏ గుణకర్మనూ ఇష్టపడడు మరియు ఏ గుణకర్మనూ ద్వేషించడు. సందర్భౌచిత్యాన్ననుసరించి మూడు గుణకర్మలనూ ఆచరిస్తాడు. ఈ విధంగా అతని జీవితంలో మూడు గుణాలకూ సమాన ప్రాతినిధ్యం ఏర్పడుతుంది. ఏ ఒక్క గుణం కూడా మిగతా గుణాలకన్నా ఆధిక్యత నొందదు.. అంటే మౌలిక స్థాయికి ఎదగదు. ప్రతి గుణం కూడా మిగతా రెండు గుణాలకు చోటు పెట్టేంత పరిమిత స్థాయిలోనే అంటే ఆంశిక స్థాయిలోనే ఉండి అవి మూడునూ సమన్వయం చెందటం వలన సత్యావిష్కరణ జరుగుతుంది. ఈ విధంగా రాగద్వేషాలు లేకుండా కర్మాచరణ చేయటాన్నే ‘యజ్ఞం’ అంటారు.

సోదాహరణంగా మనం ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ‘వ్యవస్థ’ అనే విషయాన్నే తీసుకుంటే తమోగుణ కర్మను ఇష్టపడే వారు ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. అలాగే రజోగుణ కర్మను ఇష్టపడే వారు ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. అలాగే సత్వగుణ కర్మను ఇష్టపడే వారు ‘వ్యక్తి’ ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ఏ ఒక్కరూ మిగతావారు ప్రతిపాదించే ప్రయోజనాల ఆవశ్యకతను ఏమాత్రం గుర్తించకపోగా వాటిని తీవ్రంగా ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు. తాము కోరుకునే ప్రయోజనాలతోటే వ్యవస్థ పరిపూర్ణమౌతుందని వీరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఫ్యూడల్ భావాలు కలిగిన పరిపాలకులు (తాలిబన్లు లాంటి ఇస్లామిక్ ఛాందసవాదులు) అనేక నిర్బంధాలతో తమ పరిపాలనను కొనసాగిస్తారు. స్త్రీజాతి మీద మరియు సాధారణ ప్రజానీకం యొక్క జీవనవిధానం మీద వీరు అనేక కట్టుబాట్లు, నిర్బంధాలు విధిస్తారు. అంటే వీరు ప్రజల మీద అధికారం ప్రదర్శిస్తూ ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. అంటే వీరు ‘తమోగుణ కర్మ’ యెడల వ్యామోహితులయ్యారు.

పెట్టుబడిదారీ పరిపాలకులు సమాజాన్ని, సమాజంలోని ఉత్పత్తి వనరులను, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ఐతే వీరు అలా అభివృద్ధి చెందిన సమాజంలోని ఉత్పత్తి వనరులను సమాజంలో కొద్ది సంఖ్యలో ఉండే బూర్జువా వర్గపు స్వంత ఆస్థిగా మార్చి, సామాన్య ప్రజానీకాన్ని అమ్ముకోవటానికి తమ శరీర శ్రమ తప్ప మరేమీ లేని పేదవారిగా మార్చివేస్తారు. అంటే వీరు సమాజాన్ని అభివృద్ధి చేసి దాని యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. అంటే వీరు ‘రజోగుణకర్మ’ యెడల వ్యామోహితులయ్యారు.

సామ్యవాద పరిపాలకులు సమానత్వం పేరుతో, సామాన్య జనుల ప్రయోజనాల పేరుతో తమవైన ప్రతిభాపాటవాలు కలిగిన వ్యక్తులకు వాటిని నిరూపించుకునే అవకాశం (స్వేచ్ఛ) ఈయరు. అంటే వీరు ‘వ్యక్తి’ యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. ఎందుకంటే వీరు ‘సత్వగుణకర్మ’ యెడల వ్యామోహితులయ్యారు… (సశేషం)


8, సెప్టెంబర్ 2008, సోమవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---22 (గీతా వ్యాసాలు)





IV: యజ్ఞం (నిష్కామ కర్మ)

‘సత్యం’ సిద్ధ వస్తువు కాదు. అంటే సత్యం సహజ సిద్ధం (ready made) గా ఎక్కడా దొరకదు. మనకు అందుబాటులో ఉండేది త్రిగుణాత్మకమైన ఈ ‘జగత్తు’ మాత్రమే. ఈ జగత్తు నుండే సత్యాన్ని ‘నిష్కామకర్మ’ ద్వారా ఆవిష్కరించాలి. ఈ నిష్కామకర్మే గీతా శాస్త్రం (3వ అధ్యాయం) లో ‘యజ్ఞం’గా చెప్పబడింది.

దీనికొరకు మనం త్రిగుణాలకు సంబంధించి అతి ముఖ్యమైన ధర్మం ఒక దాని గురించి తెలుసుకోవాలి. అదేమంటే ‘త్రిగుణాలు మౌలిక స్థాయిలో పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఆంశిక స్థాయిలో పరస్పరం సమన్వయం చెందుతాయి’. ఈ సమన్వయం ఫలితంగానే సత్యావిష్కరణ జరుగుతుంది.

త్రిగుణాలు మౌలిక స్థాయిలో వేటికవే ఒక ప్రమాణం (Single Unit) గా కొనసాగుతాయి. దీనివలన అవి తమకు విరుద్ధంగా ఉన్న ఏ ఇతర ప్రమాణాన్ని అంగీకరించవు; దేనినైనా ద్వేషిస్తాయి. ఈ కారణం చేతనే పరస్పర విరుద్ధమైన త్రిగుణాలు మౌలిక స్థాయిలో పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఈ పరస్పర సంఘర్షణ వలనే మౌలిక స్థాయిలో అవి సత్యావిష్కరణ చేయలేవు. అందుకే జగత్తు సత్యం కాదు. (జగత్తు త్రిగుణాల మౌలిక మిశ్రమం; సత్యం త్రిగుణాల ఆంశిక సమ్మేళనం)

ఆంశిక స్థాయిలో గుణాలు వేటికవే ఒక ప్రమాణంగా కొనసాగలేవు. అందువలన ప్రతి గుణం కూడా తనకు విరుద్ధంగా ఉన్న మిగతా రెండు గుణాలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. వాటితో సమన్వయం చెంది ఒకే ప్రమాణాన్ని ఏర్పరచాలని ఉవ్విళ్ళూరుతుంది. అంటే వైరుధ్యం అనే ఒకే లక్షణం మౌలిక స్థాయిలో సంఘర్షణకు, ఆంశిక స్థాయిలో సమన్వయానికీ కారణమగుచున్నది. అందువలనే పరస్పర విరుద్ధమైన త్రిగుణాలు ఆంశిక స్థాయిలో పరస్పరం సమన్వయం చెందుతాయి. ఆ సమన్వయం ఫలితంగా ఏర్పడేదే ‘సత్యం’.

అంటే ‘వైరుధ్యాల మధ్యన సమన్వయమే సత్యం’. విద్యుత్ శాస్త్రం (Electricity) లో ధన, ఋణ ఆవేశాల మధ్యన ఆకర్షణ; అయంస్కాంతత్వానికి (Magnetism) సంబంధించి సజాతి, విజాతి ధృవాల మధ్యన ఆకర్షణ; రసాయన బంధం (Chemical Bond)లో ఎలక్ట్రాన్, ప్రొటాన్‌ల మధ్యన ఆకర్షణ.. ఇవన్నీ కూడా వైరుధ్యాల మధ్యన సమన్వయానికి నిదర్శనాలే.

భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం వైరుధ్యాలు మూడు.. అవి త్రిగుణాలు. కానీ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ప్రకారం వైరుధ్యాలు రెండే.. అవి ‘వాదం’ (Thesis) మరియు ‘ప్రతి వాదం’ (Anti Thesis). ఈ రెంటి ‘సంశ్లేషణ’ (Synthesis) తో సత్యాన్ని సాధించడానికి పాశ్చాత్య తత్త్వశాస్త్రం (గతితార్కిక సిద్ధాంతం లేక Dialectic Theory) ప్రయత్నిస్తుంది. అంటే ‘వైరుధ్యాల మధ్యన సమన్వయమే సత్యం’ అనే విషయాన్ని అది కూడా అంగీకరిస్తుంది. కానీ వైరుధ్యాలు మూడు కాక రెండు అని అనుకోవడమే పాశ్చాత్య తత్త్వశాస్త్రం సత్యశోధనలో వైఫల్యం చెందటానికి కారణం.

భారతీయ తత్త్వశాస్త్రాన్నే పాశ్చాత్య పరిభాషలో చెబితే వైరుధ్యాలలో మూడవ దాని పేరు ‘విశ్లేషణ’ ( Analysis). అపుడు మూడు వైరుధ్యాల మధ్యన అంటే Thesis, Anti Thesis మరియు Analysis మధ్యన Synthesis జరిగి సత్యం ఆవిష్కరింపబడుతుంది. (సత్వ రజస్తమో గుణాలు మూడునూ యజ్ఞంలో పాల్గొని సత్యాన్ని ఆవిష్కరిస్తాయి అనే విషయాన్నే పాశ్చాత్య పరిభాషలో చెప్పామన్న మాట.)

సత్యాన్ని విశదీకరించే మూడు సూత్రాలలో చివరిసూత్రం ప్రకారం ‘జగత్తు నుండి సత్యాన్ని ఆవిష్కరించే సాధనం యజ్ఞం’. అంటే గుణాలు మౌలిక రూపంలో మిశ్రమంగా ఉండే జగత్తు నుండి అంశీభూత రూపంలో సమ్మేళనంగా ఉండే సత్యాన్ని ఆవిష్కరించడమే ‘యజ్ఞం’. సాధారణంగా యజ్ఞం అంటే మనకు తెలిసినది మండే యజ్ఞగుండం నలువైపులా ఋషులు పద్మాసన స్థితులై మంత్ర పఠనం చేస్తూ హవిస్సులు సమర్పిస్తారు. గీతలో చెప్పబడిన యజ్ఞం ఇది కాదు.అది సత్యావిష్కరణ కొరకు ఉద్దేశించిన నిష్కామ కర్మ. నిష్కామ కర్మే గీతా శాస్త్రంలో యజ్ఞం గా చెప్పబడింది.

యజ్ఞః కర్మసముద్భవః (అ.3-శ్లో.14)

యజ్ఞం సత్కర్మల వల్ల సంభవిస్తున్నది.

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|

కర్మజాన్విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే|| (అ.4-శ్లో.32)

ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరించబడ్డాయి. అవన్నీ కర్మలనుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధం నుండి విముక్తి పొందుతావు… (సశేషం)


7, సెప్టెంబర్ 2008, ఆదివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---21(గీతా వ్యాసాలు)





II: జగత్ స్వరూపం

జగత్ స్వరూపాన్ని తెలుసుకొనటానికి ముందు మనం సత్యం గురించి చెప్పిన మూడు సూత్రాలలో మొదటి సూత్రాన్ని మరలా ఒకసారి చూద్దాం.

సత్వము, రజస్సు, తమస్సు అను పరస్పర విరుద్ధమైన మూడు గుణాల ‘మౌలిక మిశ్రమం’ ఈ జగత్తు.

ఈ సూత్రం ద్వారా మనం కర్మస్వరూపాన్ని మరియు జగత్ స్వరూపాన్ని రెంటినీ తెలుసుకోవచ్చని మొదటనే చెప్పుకున్నాం. ఇంతవరకూ కర్మస్వరూపం గురించి విపులంగా తెలుసుకున్నాం. ఇప్పుడు జగత్తు యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం.

జగత్తు త్రిగుణాత్మకమైనది. జగత్తులో గుణాలు మూడునూ వాటి మూల (Raw or Fundamental) రూపంలో మిశ్రమంగా ఉంటాయి. ఈ విషయమే పై సూత్రంలో ‘మౌలిక మిశ్రమం’అనే మాటద్వారా తెలియచేయబడింది. సత్యంలో ఈ గుణాలు ‘ఆంశిక’ (Componental) రూపంలొకి మారతాయి. ఇక ‘మిశ్రమం’ అంటే ఒకే ప్రకృతిలో అంతర్భాగాలుగా కొనసాగుతున్నా ఈ గుణాల మధ్యన ఏ విధమైన బంధమూ (Bond) ఉండదు. ఇవన్నీ విడివిడిగా ఉండి, అన్నీ కలసి ఒక రాశిగా ఉంటాయి. అందుకే దీన్ని ‘మిశ్రమం’ అన్నాము. సత్యంలో ఈ గుణాలు విడివిడిగా ఉండక అంశలుగా మారి ఒకటిగా బంధింపబడి ఒకే ‘ప్రమాణం’ (Single Unit) గా కొనసాగుతాయి. సత్యస్వరూపం గురించి చర్చించేటపుడు ఈ విషయాన్ని విపులంగా పరిశీలిద్దాం.

జగత్తులోని మూడు గుణాలలో ప్రతి ఒక గుణానికి కూడా ప్రాతినిథ్యం వహిస్తూ లెక్కకు మిక్కిలిగా గుణకర్మలు ఉంటాయి. ఈ విధంగా సత్వ రజస్తమో గుణాలు మూడింటికీ ప్రాతినిథ్యం వహిస్తూ అనంతమైన సంఖ్యలో గుణకర్మలుంటాయి (కొన్ని రకాల గుణకర్మలను ‘కర్మ స్వరూపం’ గురించి వివరించేటపుడు పేర్కొనడం జరిగినది). ఇవన్నీ కూడా అవి ప్రాతినిథ్యం వహించే త్రిగుణాల వలెనే ‘మౌలిక మిశ్రమం’గా జగత్తులో ఉంటాయి. ఒక గుణానికి ప్రాతినిథ్యం వహించే గుణకర్మలన్నీ కలసి ఒక గుణం. అటువంటి గుణాలు మూడు కలసి జగత్తు. ఈ విధంగా 'అనంతమైన గుణకర్మల సమూహమే జగత్తు’. ఇదే జగత్ స్వరూపం.

III: సత్య స్వరూపం

సత్యం మరియు భగవంతుడు ఒక్కటే అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే సత్యం అందరూ అంగీకరించిన విషయం. కానీ భగవంతుడిని నాస్తికులు అంగీకరించరు. సత్యం సర్వజనామోదమైనది. ‘మానవుడు సత్యాన్ని మాత్రమే ఆచరించాలి’ అనే విషయంలో సర్వమానవులూ సర్వకాలాలలోనూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ భగవంతుడి అస్తిత్వానికి సంబంధించిన విషయంలో ఇటువంటి ఏకాభిప్రాయం లేదు. దేవుడు ఉన్నాడు, లేడు అనే ఇరువర్గాలూ కూడా సర్వకాలాలోనూ ఉన్నాయి. దీనిని బట్టి మనం సత్యాన్ని భగవంతుడికన్నా వేరైనదిగా చర్చించవలసి ఉంటుంది. సత్యం ‘దైవ స్వరూపం’ అని మనం వ్యాఖ్యానిస్తే ఆస్తికులు మాత్రమే అంగీకరిస్తారు కానీ నాస్తికులు అంగీకరించరు. ఆఖరికి సత్యం ‘భగవంతుని చేరే మార్గం’అని కూడా మనం ఆస్తికులతోనే అనగలం కానీ నాస్తికులతో అనలేము.

మనకు ఆచరించటానికి కావలసినది సత్యమే. సర్వజనులకూ కావలసినది కూడా సత్యమే. కనుక ఆ సత్యాన్ని గురించే చర్చిద్దాం. సత్యాన్ని విశదీకరిస్తూ ఈ రెండవ అధ్యాయం యొక్క ప్రారంభంలో చెప్పిన మూడు సూత్రాలలో రెండవది ‘సత్య స్వరూపం’ గురించి చర్చిస్తుంది. దాని ప్రకారం ‘త్రిగుణాల అంశీభూత సమ్మేళనమే సత్యం’.

జగత్తును గుణాల ‘మౌలిక మిశ్రమం’ అన్నాం. సత్యాన్ని గుణాల ‘ఆంశిక సమ్మేళనం’ అన్నాం. మిశ్రమం (Mixture), సమ్మేళనం (Compound) అనే పదాలు రసాయన శాస్త్రం (Chemistry) నుండి తీసుకోబడ్డాయి.

‘మౌలిక’ అంటే జగత్తులో గుణాలు వాటి మూల రూపంలో ఉంటాయి. అంటే ముడిపదార్థాలుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి మూలపదార్థాలైన గుణాల మధ్యన ఏ విధమైన సంబంధమూ (Bond) ఉండదు. దేనికదే విడివిడిగా ఉండి అన్నీ కలసి ఒక రాశిగా ఉంటాయి.అందుకే దీన్ని ‘మిశ్రమం’ అన్నాం. మిశ్రమంలో ఉండేవన్నీ భౌతికంగా కలగాపులగంగా కలసి ఉంటాయేగానీ వాటి మధ్యన ఏ విధమైన సంబంధం ఉండదు. వాటిని సులభంగా విడదీయవచ్చు. ఉదాహరణకు బియ్యం, రాళ్ళ మిశ్రమం.

‘ఆంశిక’ అంటే సత్యంలో గుణాలు వాటి ‘అంశ’(Component) ల రూపంలో ఉంటాయి.’అంశ’ అనేది తనలాంటి మరికొన్ని అంశలతో కలసి ఒక ‘ప్రమాణం’ (Single Unit)గా ఏర్పడుతుందే గానీ స్వయంగా తానే ఒక ప్రమాణంగా ఉండలేదు.అంశ అనేది ఒక పూర్ణత్వంలో ఒకానొక భాగస్వామి మాత్రమే గానీ తానొక్కటే స్వయంగా పూర్ణత్వం కాలేదు. ఈ విధమైన అంశల కలయిక వలన ఏర్పడిన ప్రమాణాన్నే ‘సమ్మేళనం’ అంటాం. సమ్మేళనంలో ఉండే మూలకాలన్నీ రసాయనచర్య ద్వారా బంధింపబడి ఉంటాయి. వాటిని సాధారణ పరిశ్రమతో విడదీయలేము. మిశ్రమంలో మూలకాలు వేటికవి విడిగానే ఒక ‘ప్రమాణం’గా చెప్పబడతాయి. సమ్మేళనంలోని వాటిని వేటికవి విడిగా చూడలేము. సమ్మేళనంలో మూలకాలన్నీ కలసి ఒకే పదార్థంగా చెప్పబడతాయి. ఉదాహరణకు ‘ఉదజని’ (Hydrozen), ‘ఆమ్లజని’ (Oxyzen) సమ్మేళనంగా కలిస్తే ‘నీరు’ (Water) ఏర్పడుతుంది. నీటిలో ఉదజని ఒక అంశ, ఆక్సిజన్ మరో అంశ. నీటిలో ఇవి రెండూ విడివిడిగా ఉండవు. అవి రసాయన బంధం ద్వారా బంధింపబడి ఉంటాయి. దాన్ని మనం నీరు అనే ఒకే పదార్ధంగా చూస్తాము.

అలాగే సత్యంలో గుణాలు ఆంశిక రూపంలో ఉండి సమ్మేళనంగా బంధింపబడి ఉంటాయి. జగత్తులో మూలరూపంలో మిశ్రమంగా ఉన్న మూడుగుణాలూ అంశలు (Components) గా మారి అవి మూడునూ సమానంగా కలసి ఒక సమ్మేళనంగా మారితే అంటే సత్వగుణం యొక్క అంశ, రజోగుణం యొక్క అంశ, మరియు తమోగుణం యొక్క అంశ.. ఇలా సమాన స్థాయి కలిగిన మూడు అంశలూ కలసిపోయి ఒక ప్రమాణం (Single Unit) గా, ఒక పూర్ణత్వంగా మారితే అదే ‘సత్యం’.

ఏ విషయానికైనా ఈ నిర్థారణను అనువర్తనం (application) చేయవచ్చు. ఏ విషయానికి చెందిన మూడు గుణకర్మలైనా పై విధంగానే అంశలుగా మారి సమాన స్థాయిలో కలిస్తే ఆ విషయంలో సత్యం ఆవిష్కరింపబడినట్లే. ఉదాహరణకు ‘మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరి’ అనే విషయాన్నే తీసుకుంటే తామస గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘అదుపు’, రాజస గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘స్వేచ్ఛ’, సాత్విక గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘ఉపేక్ష’.. ఇవి మూడునూ సమాన స్థాయి కలిగిన అంశలుగా మారి ఒకే ప్రమాణంగా కలిసిపోతే ఆ ప్రమాణమే ‘సత్యం’. సాధారణమైన మాటలలో చెప్పాలంటే ఆ వైఖరిలో అదుపు-స్వేచ్ఛ-ఉపేక్ష.. ఈ మూడు ధోరణులునూ సమానంగా వ్యక్తమైతే అదే సత్యం. గుణాలు అవి మిశ్రమంగా ఉండే మౌలిక స్థాయినుండి సమ్మేళనంగా ఉండే ఆంశిక స్థాయికి ఎలా మారతాయనేది ‘యజ్ఞ స్వరూపం’ లేక ‘నిష్కామ కర్మ’ను గురించి చర్చింటేటపుడు మనకు తేటతెల్లమవుతుంది…(సశేషం)


6, సెప్టెంబర్ 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---20 (గీతా వ్యాసాలు)





I.C: వైరుధ్యం

కర్మ యొక్క ధర్మాలను నిర్దేశించే మరో ముఖ్యమైన విషయమేమంటే జగత్తులోని సత్త్వ రజ స్తమో గుణాలు మూడునూ పరస్పర విరుద్ధమైనవి (Mutual Opponents).

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|

రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా|| (అ.14-శ్లో.10)

అర్జునా! రజోగుణాన్నీ, తమోగుణాన్నీ అణచివేసి సత్వ గుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్త్వ తమోగుణాలను అణచివేసి రజోగుణమూ, సత్వరజో గుణాలను అణగ ద్రొక్కి తమోగుణమూ వర్ధిల్లుతాయి.

అంటే ఈ మూడు ప్రకృతి గుణాలలో ప్రతి ఒక్కటి మిగతా రెండింటికీ విరుద్ధంగా ఉంటుంది. ఇవి మూడునూ ఒకే ప్రకృతిలో భాగస్వాములైననూ పరస్పరం విరుద్ధమైనవిగా ఉంటాయి. అలానే ఈ గుణాల వలన జరిగే కర్మలు అనగా ఈ గుణాలకు ప్రాతినిథ్యం వహించే కర్మలు మూడునూ కూడా ప్రతిఒక్కటి మిగతా రెండింటికీ విరుద్ధంగా ఉంటాయి. ఐనా కూడా ఇవి మూడునూ కలసి ఒకే విషయాన్ని లేక ఒకే పరిస్థితిని సూచిస్తాయి.

ఉదాహరణకు మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరినే తీసుకుంటే తమోగుణం అదుపు చేయమంటే రజోగుణం అందుకు విరుద్ధంగా స్వేచ్ఛనీయమంటుంది. సత్త్వగుణం ఈ రెంటికీ కూడా విరుద్ధంగా ఉపేక్ష చూపమంటుంది. అలానే జీవన విధానానికి సంబంధించి తమోగుణం గతంలో ఉన్నదానినే ఆచరిస్తూ సంప్రదాయబద్ధంగా జీవించమంటే రజోగుణం దీనికి విరుద్ధంగా గతంలో ఉన్నదానిని అభివృద్ధిపరచి అభ్యుదయంతో ఆధునికంగా జీవించమంటుంది. సత్వగుణం ఈ రెండు విధానాలకూ కూడా విరుద్ధంగా గతంలో ఉన్నదానిని సమూలంగా మార్చి (Radical Change), సంస్కరించి మార్పుతో జీవించమంటుంది. ఈ విధంగా ఏ గుణకర్మ ఐనకూడా తన అనురూపాలైన మిగతా రెండు గుణకర్మలకు విరుద్ధంగా ఉంటుంది.

I.D: రాగద్వేషాలు

ఇప్పుడు ఈ గుణకర్మల మరో ధర్మమైన ‘సమ్మోహనత్వం’ గురించి చర్చించుకుందాం. అంటే ఈ గుణకర్మలు మూడింటికి కూడా మానవుడి మనసును ఆకర్షించగల, సమ్మోహన పరచగల లక్షణం ఉంది. ప్రతి గుణకర్మ కూడా తనదైన ఆకర్షణను కలిగి ఉంటుంది. దేని ఆకర్షణ దానిదే.

ప్రకృతే ర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు |

తా నకృత్స్నవిదో మందాన్ కృత్సవిన్న విచాలయేత్|| (అ.3-శ్లో.29)

ప్రకృతి గుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులూ, మందబుద్ధులూ అయిన వాళ్ళ మనస్సులను జ్ఞానులు చలింపచేయకూడదు.

త్రిభిర్గుణమయై ర్భావై ఏభిస్సర్వమిదం జగత్|

మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయం|| (అ.7-శ్లో.13)

ఈ మూడుగుణాల ప్రభావం వల్ల ప్రపంచమంతా భ్రమ చెంది, వాటి కంటే విలక్షణుడిగా, వినాశం లేని వాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది.

స్వాధీన మనస్కులు కాని వారెవరైనా కూడా తన స్వభావానుసారంగా ఏదో ఒక గుణం యొక్క వ్యామోహంలో చిక్కుకొని ఆ గుణానికి చెందిన కర్మలనే అధికంగా చేస్తారు. ఐతే ఒక గుణ కర్మ యొక్క వ్యామోహంలో చిక్కుకున్న మానవుడు దాని అనురూపాలైన మిగతా రెండు గుణకర్మల ఆకర్షణకు లోబడడు; పైగా తను ఇష్టపడుతున్న కర్మకు విరుద్ధంగా ఉన్నందువలన వాటిని ద్వేషిస్తాడు.

ఉదాహరణకు జీవన విధానానికి సంబంధించి తమోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే సంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న సత్వ, రజో గుణాలను, వాటికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ జీవన విధానాన్ని మరియు సంస్కరణయుత జీవన విధానాన్ని ద్వేషిస్తాడు.

అదే రజోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ మరియు ఆధునిక జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న సత్వ, తమో గుణాలను మరియు వాటికి ప్రాతినిథ్యం వహించే సంస్కరణయుత జీవన విధానాన్ని మరియు సంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని ద్వేషిస్తాడు.

అలాగే సత్వగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే సంస్కరణయుత జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న రజస్తమో గుణాలను మరియు వాటికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ మరియు సాంప్రదాయక జీవన విధానాలను ద్వేషిస్తాడు.

అలాగే ఆలోచనా విధానానికి సంబంధించి తమోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు విశ్వాసాలను, నమ్మకాలను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన శాస్త్రీయతను, హేతుబద్దతనూ ద్వేషిస్తాడు. రజోగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు శాస్త్రీయతను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన విశ్వాసం, హేతుబద్దతలను ద్వేషిస్తాడు. సత్వగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు హేతుబద్దతను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన విశ్వాసం, శాస్త్రీయతలను ద్వేషిస్తాడు.

ఏ గుణకర్మ విషయమైనా ఇదే విధంగా ఉంటుంది. మానవుడు తనను సమ్మోహన పరచిన లేక తాను వ్యామోహానికి లోనైన గుణకర్మను ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ తాను ద్వేషించే దాని యొక్క మిగతా రెండు అనురూపాలను సాధ్యమైనంతవరకు ఆచరించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు.

ఈవిధంగా మూడు గుణకర్మలూ పరస్పర విరుద్ధంగా ఉండి, ప్రతి గుణకర్మ కూడా తనదైన సమ్మోహనత్వాన్ని కలిగి మానవులలో రాగద్వేషాలకు కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని ‘నిష్కామకర్మ’ గురించి చర్చించుకునేటపుడు మరింత విపులంగా తెలుసుకుందాము.

ఇంతటితో ‘కర్మస్వరూపం’ గురించిన చర్చ ముగిసినట్లే. సంక్లిష్టమైన కర్మస్వరూపం గురించి తెలుసుకున్న తరువాత జగత్ స్వరూపం, సత్యస్వరూపం మరియు నిష్కామకర్మ స్వరూపం మొదలైన వాటి గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు సుదీర్ఘమైన ఈ చర్చలోని ప్రధానాంశాలను ఒకసారి పరికిద్దాం.

1.’గుణం వలన జరిగే కర్మ’ అంటే ‘గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మ’ అని అర్థం. సర్వకర్మలూ త్రిగుణాల వలనే జరుగుతున్నాయని అంటే సర్వకర్మలూ త్రిగుణాలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాయని అర్థం.

2.ఏ కర్మైనా త్రిగుణాలలో ఏదో ఒక గుణానికి తప్పనిసరిగా ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ మూడింటిలో దేనికీ చెందని కర్మ మూడులోకాలలో ఎక్కడా ఉండదు.

3.ఏదేనీ ఒక గుణానికి చెందిన కర్మ మిగతా రెండు గుణాలలోనూ తన అనురూపాలను కలిగి ఉంటుంది.

4.సత్వ రజస్తమో గుణాలు మూడునూ పరస్పర విరుద్ధమైనవి (Mutual Opponents). అదే విధంగా ఏ గుణకర్మ ఐనా కూడా తన అనురూపాలైన మిగతా రెండు గుణకర్మలకు విరుద్ధంగా ఉంటుంది.

5.ఈ గుణకర్మలు మూడింటికి కూడా మానవుడి మనసును ఆకర్షించగల, సమ్మోహనపరచగల లక్షణం ఉంది. ప్రతి గుణకర్మ కూడా తనదైన ఆకర్షణను కలిగి ఉంటుంది. ఈ లక్షణమే మానవులలో రాగద్వేషాలకు కారణమగుచున్నది… (సశేషం)


4, సెప్టెంబర్ 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---19 (గీతా వ్యాసాలు)



పరమాణు నిర్మాణంలో సాత్విక కర్మ ‘న్యూట్రాన్’, రాజస కర్మ ‘ప్రోటాన్’, తామస కర్మ ‘ఎలక్ట్రాన్’.

శరీర పోషకాలలో సాత్విక కర్మ ‘లిపిడ్లు’, రాజస కర్మ ‘ప్రొటీన్లు’, తామస కర్మ ‘కార్బోహైడ్రేట్లు’.

శరీర సౌష్టవం విషయంలో సాత్విక కర్మ ‘కొవ్వుపట్టి ఉండుట’ (సుమో యోధుడు) ,రాజస కర్మ ‘కండపట్టి ఉండుట’ (కుస్తీ పహిల్వాన్, బాడీ బిల్డర్ మొదలగు వారు), తామస కర్మ ‘సన్నగా ఉండుట’(మారథాన్ క్రీడాకారుడు).

మానవుడి తలలో పై దవడతో పోల్చినపుడు క్రింది దవడ చిన్నగా ఉంటే (మంగోలాయిడ్) అది సాత్విక కర్మ, సమానంగా ఉంటే(యూరోపియన్) అది రాజస కర్మ, పెద్దగా ఉంటే (నీగ్రోయిడ్) అది తామస కర్మ.

మానవుడి జీవితంలో జననం, శైశవం, బాల్యం సాత్విక కర్మలు, కౌమారం, యవ్వనం రాజస కర్మలు, వార్ధక్యం, మరణం తామస కర్మలు.

పెద్దవారు చిన్నవారిని గారాబం చేస్తే అది సాత్విక కర్మ, స్నేహభావంతో చూస్తే అది రాజస కర్మ, దండిస్తే అది తామస కర్మ.

చిన్నవారు పెద్దవారిని ఎదిరిస్తే అది సాత్విక కర్మ, తమతో సములన్నట్లుగా ప్రవర్తిస్తే అది రాజస కర్మ, భయభక్తులతో, వినయ విధేయతలతో గౌరవిస్తే అది తామస కర్మ.

ద్విచక్ర వాహనాలలో మోపెడ్ సాత్విక కర్మ, స్కూటర్ రాజస కర్మ, బైక్ తామస కర్మ.

మార్దవం, లాలిత్యం కలిగిన కుందేలు, జింక, లేడి లాంటి జంతువులు సాత్విక కర్మకు, దర్జా, దర్పం,ఠీవి కలిగిన గుఱ్ఱం, ఏనుగు లాంటి జంతువులు రాజస కర్మకు, క్రౌర్యం, శౌర్యం లాంటి లక్షణాలు కలిగిన తోడేలు, పులి, సింహం లాంటి జంతువులు తామస కర్మకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

‘తండ్రి’ తామస కర్మ, ‘తల్లి’ రాజస కర్మ, ‘సంతానం’ సాత్విక కర్మ.

‘సృష్టి’ సాత్విక కర్మ, ‘స్థితి’ రాజస కర్మ, ‘లయం’ తామస కర్మ.

‘పరోపకారం’ సాత్విక కర్మ, ‘స్వార్థం’ రాజస కర్మ, ‘భగవత్ సేవ’ తామస కర్మ.

‘జ్ఞాన సముపార్జన’ (జ్ఞాన యోగం) సాత్విక కర్మ, ‘ఐహిక సమృద్ధిని సాధించుట’ (రాజయోగం) రాజస కర్మ, ‘పారమార్థిక చింతన’ (భక్తి యోగం)తామస కర్మ.

‘సాదాజుట్టు’ సాత్విక కర్మ, ‘అలల వంటి జుట్టు’ (వేవీ హైర్) రాజస కర్మ, ‘ఉంగరాల జుట్టు’ తామస కర్మ.

మనం ఇతరులతో ‘సున్నితంగా ప్రవర్తిస్తే’ అది సాత్విక కర్మ, ‘యుక్తిగా ప్రవర్తిస్తే’ అది రాజస కర్మ, ‘క్రూరంగా ప్రవర్తిస్తే’ అది తామస కర్మ.

విందు చేసే సందర్భంలో ‘పంక్తి భోజనం’ తామస కర్మ, ‘టేబుల్ మీల్స్’ రాజస కర్మ, ‘బఫే’ సాత్విక కర్మ.

మనం ‘సంతోషంగా ఉంటే’ అది సాత్విక కర్మ, ‘గంభీరంగా ఉంటే’ అది రాజస కర్మ, ‘కోపంగా ఉంటే’ అది తామస కర్మ.

ఆంతరిక ప్రపంచంలో ‘బుద్ధి’ సాత్విక కర్మకు, ‘మనసు’ రాజస కర్మకు, ‘ఇంద్రియాలు’ తామస కర్మకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాయి.

‘ఫ్యూడలిజం’ తామస కర్మ, ‘కాపిటలిజం’ రాజస కర్మ, ‘కమ్యూనిజం’ సాత్విక కర్మ.

మనం అవలంబించే వృత్తులలో సాత్విక కర్మ ‘ఉద్యోగం’, రాజస కర్మ ‘వ్యాపారం’, తామస కర్మ ‘సైనిక వృత్తి’.

మానవుడిని కర్మకు ప్రేరేపించే వాటిలో ‘సంకల్పం’ సత్వగుణానికి, ‘స్వభావం’ రజోగుణానికి ‘జీవేచ్ఛ’ తమోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

మానవుడు చేసే కర్మలు విజయవంతమయ్యేటట్లు సహకరించే శక్తులలో ‘మానవ ప్రయత్నం’ సత్వగుణానికి, ‘విధి అనుకూలత’ రజోగుణానికి, ‘దైవానుగ్రహం’ తమోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

ఈ విధంగా ప్రతి కర్మ కూడా మూడు గుణాలలో ఏదో ఒక గుణానికి ప్రాతినిథ్యం వహిస్తూ మిగతా రెండు గుణాలలోనూ తన అనురూపాలను కలిగి ఉంటుంది.

ఈ గీతాశాస్త్రం ఐదువేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణునిచే చెప్పబడింది. గీతాబోధ అనంతరం ప్రపంచంలో అనేక సంఘటనలు జరిగాయి.. ఎన్నో మతాలు ఉద్భవించాయి. అనేక విజ్ఞాన శాస్త్రపు ఆవిష్కరణలు జరిగాయి, రాజకీయంగా చరిత్ర అనేక మలుపులు తిరిగింది. అనేక విషయాల మీద ఎన్నో సిద్ధాంతాలు వెలువడ్డాయి. ప్రపంచం ఎంతో సంక్లిష్టంగా మారింది. ఇదంతా వెరసి లెక్కకు మిక్కిలిగా ఉన్న లక్షల కొలదీ కర్మల సమూహం. ఎన్ని ఉన్నా ఈ కర్మలన్నీ కూడా త్రిగుణాల పరిధిలోకే వస్తాయి.ప్రతి కర్మ కూడా ఈ మూడు గుణాలలో ఏదోఒక గుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ మూడు గుణాలకు అన్యమైన కర్మ ఉండదు, ఉండబోదు.

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః|

సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్యాత్త్రిభిర్గుణైః|| (అ.18-శ్లో.40)

ప్రకృతి వలన కలిగిన ఈ మూడు గుణాలతో ముడిపడని వస్తువేదీ భూలోకంలో గానీ, స్వర్గలోకంలో గానీ, దేవతలలో కానీ లేదు.

మునుముందు ఈ ప్రపంచం మరింతగా సంక్లిష్టతనొందనీ.. అపుడు సైతం ఆయా కర్మలన్నీ కూడా ఈ త్రిగుణాల పరిధిలోకే వస్తాయి. ఎందుకంటే కర్మలకు త్రిగుణాలే పరమావధి. ఆ అవధిని దాటి అవి ఎక్కడకూ వెళ్ళలేవు… (సశేషం)


3, సెప్టెంబర్ 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---18 (గీతా వ్యాసాలు)





I. కర్మ స్వరూపం

జగత్తు (ప్రకృతి) త్రిగుణాత్మకమన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రకృతి లేక జగత్ సంబంధమైన సత్వము, రజస్సు, తమస్సు అను మూడు (త్రి) గుణాల వలనే సమస్త కర్మలూ జరుగుతున్నాయని గీతలో అనేకసార్లు చెప్పబడింది.

ప్రకృతేః క్రియామాణాని గుణైః కర్మాణి సర్వశః | (గీత:అ.3-శ్లో.27)

ప్రకృతి గుణాల వలన సర్వకర్మలు జరుగుతున్నాయి.


ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః | (అ.13-శ్లో.30)

ప్రకృతి వల్లనే సమస్త కర్మలూ సాగుతున్నాయి.


నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టనుపశ్యతి | (అ.14-శ్లో.19)

కర్మలన్నిటికీ గుణాలను తప్ప మరోదాన్ని కర్తగా భావించకూడదు.


I.A : కర్మ భావన-కర్తృత్వం

ఇప్పుడు 'కర్మ భావన' (Concept of Karma) గురించి పరిశీలిద్దాం. సాధారణంగా కర్మ అంటే మనకు ఉండే అవగాహన మానవుడు చేసే పని అని.అంటే కర్మకు కర్తృత్వం మనం మానవుడికి ఆపాదిస్తాము. కానీ సర్వకర్మలూ ప్రకృతి గుణాల వలనే జరుగుతున్నాయని గీతాకారుడు చెప్పినపుడు కర్మల యొక్క కర్తృత్వం ప్రకృతి గుణాలకు ఆపాదింపబడింది. గీతాకారుడు ఇలా ఎందువల్ల చెప్పాడో, దీని అసలు అర్థం ఏమిటో మనకు ఈ క్రింది నిర్ధారణల ద్వారా తెలుస్తుంది.

I.B : ప్రాతినిథ్యం-అనురూపాలు

‘గుణం వలన జరిగే కర్మ’ అంటే ‘గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మ’ అని అర్థం. అంటే ఒక కర్మ సత్వగుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే ఆ కర్మను సత్వగుణం వలన జరిగిన కర్మగా చెబుతాము. ఒక కర్మ రజోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే ఆ కర్మను రజోగుణం వలన జరిగిన కర్మగా చెబుతాము. అలాగే ఒక కర్మ తమోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే ఆ కర్మ తమోగుణం వలన జరిగిన కర్మగా చెబుతాము. దీనిని బట్టి సర్వకర్మలూ త్రిగుణాల వలనే జరుగుతున్నాయంటే సర్వకర్మలూ త్రిగుణాలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాయని అర్థం.

ఏ కర్మైనా త్రిగుణాలలో ఏదో ఒక గుణానికి తప్పనిసరిగా ప్రాతినిథ్యం వహిస్తుంది. అంటే ఒక కర్మ సాత్వికమైనా అయి ఉండాలి లేదా రాజసమన్నా అయి ఉండాలి లేదా తామసమన్నా అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ మూడింటిలో ఏదో ఒకటి అయితీరాలి. ఈ మూడింటిలో దేనికీ చెందని కర్మ మూడు లోకాలలో ఎక్కడా ఉండదు.

మరో విషయమేమంటే ఏదేనీ ఒక గుణానికి చెందిన కర్మ మిగతా రెండు గుణాలలోనూ తన అనురూపాలను కలిగి ఉంటుంది. అంటే ఒక విషయానికి సంబంధించి సాత్విక కర్మ ఉంటే అదే విషయానికి సంబంధించి రాజస కర్మ ఉంటుంది. అలాగే అదే విషయానికి సంబంధించి తామస కర్మ కూడా ఉంటుంది. అలా మూడు గుణాలకు ప్రాతినిథ్యం వహించే ఈ మూడు కర్మలు కలసి ఏదో ఒక విషయాన్ని లేక ఏదో ఒక పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.

ఈ రెండు నిర్థారణలను మనం కొన్ని ఉదాహరణల ద్వారా రూఢిపరచుకోవచ్చు.

‘వాతావరణం’ అనే విషయాన్ని తీసుకుంటే దాని యొక్క సాత్విక కర్మ ‘చలి’, దాని రాజస కర్మ ‘వర్షం’, దాని తామస కర్మ ‘ఎండ’. ఇక్కడ మూడు గుణకర్మలలోనూ సత్వ గుణకర్మ ఐన చలి, రజోగుణ కర్మ ఐన వర్షం, తమోగుణ కర్మ ఐన ఎండ.. ఈ మూడునూ కలసి ‘వాతావరణం’ అనే పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.

అలాగే ‘మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరి’అనే విషయాన్నే తీసుకుంటే దానికి సంబంధించి సాత్విక కర్మ ‘ఉపేక్ష’, రాజస కర్మ ‘స్వేచ్ఛ’, తామస కర్మ ‘అదుపు’.

మనం ఏదైనా సమాచారాన్ని ఇతరులకు చెప్పే సందర్భంలో సాత్విక కర్మ ‘నిజం’, రాజస కర్మ ‘అబద్ధం’, తామస కర్మ ‘ఏమీ చెప్పక పోవడం’.

‘వ్యవస్థ’ అనే విషయాన్నే తీసుకుంటే దానికి సంబంధించిన సాత్విక కర్మ ‘వ్యక్తి’, రాజస కర్మ ‘సమాజం’, తామస కర్మ ‘రాజ్యం’.

అలాగే జీవన విధానానికి సంబంధించి సాత్విక కర్మ ‘సంస్కరణ’(మార్పు), రాజస కర్మ ‘అభ్యుదయం’, తామస కర్మ ‘సంప్రదాయం’.

ఆలోచనా విధానానికి సంబంధించి సాత్విక కర్మ ‘హేతుబద్దత’, రాజస కర్మ ‘శాస్త్రీయత’, తామస కర్మ ‘విశ్వాసం’.

భాషకు సంబంధించి సాత్విక కర్మ ‘వాడుక భాష’,రాజస కర్మ ‘శిష్ట భాష’ (విద్యావంతులైన కొందరికే అర్థమయ్యే భాష, ఉదాహరణకు ఇంగ్లీషు), తామస కర్మ ‘పురాతన భాష’ (పురోహిత వర్గానికి తప్ప వేరెవ్వరికీ అర్థం కాని సంస్కృతం, లాటిన్, హీబ్రూ లాంటివి).

వ్యక్తి సమాజంలో మనుగడ సాగించేటపుడు అలవరచుకోవలసిన లక్షణాల విషయంలో సాత్విక కర్మ ‘విజ్ఞానం’, రాజస కర్మ ‘వ్యవహార దక్షత’, తామస కర్మ ‘శీలం’.

ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితికి సంబంధించి సాత్విక కర్మ ‘పచ్చిక బయలు’, రాజస కర్మ ‘దట్టమైన అడవులు’, తామస కర్మ ‘ఎడారి’.

ఉదకము యొక్క వివిధ రూపాలకు సంబంధించి సాత్విక కర్మ ‘మంచు’, రాజస కర్మ ‘నీరు’, `తామసకర్మ ‘ఆవిరి’.

భగవంతుని గురించి అభిప్రాయము తెలియజేయునపుడు సాత్విక కర్మ ‘భగవంతుడు లేడనుట’, రాజస కర్మ ‘భగవంతుడు మన కొరకు త్యాగము చేయుననుట’, తామస కర్మ ‘భగవంతుని కొరకు మనము త్యాగము చేయవలెననుట’.

దర్పణం యొక్క ఉపరితలం విషయంలో సాత్విక కర్మ ‘కుంభాకార’, రాజస కర్మ ‘సమతల’, తామస కర్మ ‘పుటాకార’.

ధనాన్ని ‘అసలు ఖర్చు చేయక పోతే’ అది సాత్విక కర్మ, ‘మితంగా ఖర్చు చేస్తే’ అది రాజస కర్మ, ‘ధారాళంగా ఖర్చు చేస్తే’ అది తామస కర్మ.

కాలం విషయంలో సాత్విక కర్మ ‘భవిష్యత్ కాలం’, రాజస కర్మ ‘వర్తమాన కాలం’, తామస కర్మ ‘భూత కాలం’…(సశేషం)


2, సెప్టెంబర్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---17 (రెండవ అధ్యాయం (గీతా వ్యాసాలు) ప్రారంభం)





రెండవ అధ్యాయం : ఉపోద్ఘాతం

మొదటి అధ్యాయంలో మానవుడు సమాజంలో ఒక సమగ్రమైన, సమతుల్యమైన వ్యవస్థను ఏర్పరచే ప్రయత్నంలో ప్రపంచ చరిత్రలో రాజకీయంగా, సామాజికంగా క్రమంగా వచ్చిన మార్పులను, జరిగిన సంఘటనలను ఒక నూతన దృక్కోణంలో అధ్యయనం చేయడం జరిగినది. ఇప్పుడీ రెండవ అధ్యాయంలో ఆ నూతన దృక్కోణం యొక్క తాత్విక నేపథ్యాన్ని అంటే ఆ అధ్యయనమంతా ఏ తాత్విక పునాది మీద ఆధారపడి జరిగినదో, అలానే ఏ తాత్విక భావనల ఆధారంగా ఈ దేశంలో నూతన వ్యవస్థను ఏర్పరచాలని భావించడం జరుగుతున్నదో ఆ తాత్విక విచారధారను తెలిసుకుందాం.

ఈ తత్త్వవిచారం పూర్తిగా కొత్తదేమీ కాదు. అర్థవివరణ మాత్రమే కొత్తది. మూలం మన ప్రాచీన భారతీయ తత్త్వశాస్త్రమే. అంటే నేనీ తత్త్వ విచారాన్ని invent చేయలేదు.. discover మాత్రమే చేశాను. భావ గర్భితమైన భారతీయ తత్త్వశాస్త్ర సారమైన గీత నుండి మనకు కావలసిన తాత్త్వికార్థాలను వెలికి తీయడానికి ప్రయత్నించాను.

భారతీయ తత్త్వశాస్త్రం పరిపూర్ణమైనది.. అద్వితీయమైనది. ఐతే దాని ప్రధాన సమస్య ‘భాష్యం’. ఎందుకంటే భారతీయ తత్త్వశాస్త్రం పరోక్షంగా ఉంటుంది.. భావగర్భితంగా, నర్మగర్భంగా ఉంటుంది. దాని అర్థాన్ని వెలికితీయడానికి భాష్యం తప్పనిసరి. ఆదిశంకరుడు మొదలుకొని ఎందరి ద్వారానో ఈ తత్త్వశాస్త్రానికి రకరకాల భాష్యాలు వచ్చాయి. అయితే అవన్నీ మతపరమైన సమస్యల చుట్టూ మరియు పారలౌకిక, పారమార్థిక విషయాల చుట్టూనే తిరిగాయి. ఐహిక విషయాలకు ముఖ్యంగా రాజకీయాలు, సామాజిక వ్యవస్థల వంటి విషయాలకు అనువర్తింపచేసుకునే విధంగా భాష్యాలు వెలువడలేదు. అందుకే ఆ ప్రయత్నం నేను చేశాను.

భారతీయ తత్త్వశాస్త్రం మొత్తాన్నీ నేను అధ్యయనం చేయలేదు. కేవలం దాని సంగ్రహ రూపమైన భగవద్గీతనే నేను ప్రమాణంగా తీసుకున్నాను. అది కూడా గీత మొత్తానికి నేను భాష్యం రాయలేదు. మనకు కావలసిన తత్త్వవిచారానికి సరిపోయేటట్లుగా సుమారు ఓ నలభై శ్లోకాలను తీసుకుని తత్త్వనిర్మాణం చేయడానికి ప్రయత్నం చేశాను.

మొదటి అధ్యాయం చివరిలో ఓ మాట ఉన్నది. “ఈ జగత్తులో ఎవ్వరి భావాలతో, ఎవ్వరి ఒప్పుకోలుతో నిమిత్తం లేని సత్యమనేది ఒకటి ఉన్నది. దానిని చేరే మార్గం కూడా ఉన్నది. దానిని మానవుడు తెలుసుకోవాలి” అని. ఆ సత్యాన్ని తెలుసుకునే దిశగానే ఈ తత్త్వవిచారం ఉంటుంది.

ఈ తత్త్వం మానవుడి కర్మాచరణకు మార్గదర్శకంగా ఉంటుంది కనుక ఈ మొత్తం తత్త్వనిర్మాణాన్ని నేను ‘కర్మయోగం’గా పిలిచాను. ఆ కర్మయోగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కర్మయోగం

ఏ మానవుడైనా సత్యాన్నే ఆచరించాలనుకుంటాడు. సత్యం కోసమే పరితపిస్తాడు. సత్యం వలన మాత్రమే అంతిమంగా శాంతి పొందుతాడు. కానీ మానవుని యొక్క ఈ ఉద్దేశం అంత సులభంగా నెరవేరదు.స్వయంగా అతని అంతరంగం నుండే అతనికి ఆటంకాలెదురౌతాయి. సత్యం కాని దానిని సత్యంగా భ్రమపడి.. దానినే ఆచరించి, సత్యానికి దూరమయ్యే పరిస్థితి కలుగుతుంది. ఈ దుస్థితి నుండి మానవుడిని రక్షించి, సత్యానికి చేరువ చేసేదే కర్మయోగం.


మానవుడు చరిత్రలో ఎక్కువగా సత్యాన్ని ఒక ఆదర్శంగా భావించాడేగానీ సత్యాన్ని ప్రత్యేకించి విశ్లేషించలేదు. సత్యస్వరూపం గురించి మానవుడు ఏవో మాటలకందని భావజాలాన్ని ఏర్పరచుకున్నాడుగానీ, తార్కిక దృష్టితో సత్యమీవిధంగా ఉంటుందని చర్చించలేదు. అలా సత్యాన్ని తెలుసుకునే ఏ ప్రయత్నం చేయలేదు. అందుకే సత్యం గురించి ఎవరికి తోచిన విధంగా వారు వాఖ్యానించారు. ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వారు సత్యంగా ప్రతిపాదించారు.

కానీ మహోన్నతమైన భారతీయ తాత్త్విక జగత్తులో సత్యం గురించి అత్యంత స్పష్టమైన నిదర్శనాలున్నాయి. అయితే భారతీయ తాత్త్వికత (వ్యాసుని వరకు) అంతా ‘ముకుళితమైనది’(Folded Philosophy). ఇది భారతీయ తత్త్వశాస్త్రానికి గల విలక్షణత. ఉపనిషత్తులు, దర్శనాలు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఇత్యాది తత్త్వశాస్త్రాలలో గానీ, పురాణాలలోగానీ, ఇతిహాసాలలో గానీ సత్యస్వరూపాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా సులువుగానే అర్థం చేసుకొనేటట్లుగా కొంచెం పరోక్షంగా చెప్పారు. అందుకే భారతీయ తత్త్వశాస్త్రాన్ని ‘ముకుళితమైనది’ అనవలసి వచ్చింది. అందువలనే దీనికి ఇన్ని భాష్యాలు, ఇన్ని వ్యాఖ్యలు. దాన్ని సమర్థవంతంగా విడదీయవలసిన కర్తవ్యం, అవసరం భారతీయులమైన మనందరిదీ. అలా చేయగలిగిన నాడు సత్యం ఆవిష్కరింపబడుతుంది. ఈ కార్యం దుష్కరమైనది కూడా కాదు. భారతీయ తాత్త్విక చింతనలోని సత్యస్వరూపాన్ని సులువుగానే విశదీకరించవచ్చు.

సత్యం ఎడల మనకు ఉన్న శ్రద్ధను నిరూపించుటకొరకు, దాని యెడల నిజంగా శ్రద్ధ ఉన్నవారే దానిని పొందగలిగేటట్లు ఋషులు తత్త్వశాస్త్రాన్ని ఈ విధంగా నిర్మించారు. శంకరుడాదిగా ఈ తత్త్వశాస్త్రంలోని అంతరార్థాన్ని అవగాహన చేసుకొనుట కొరకు, విశదీకరించుట కొరకు భారతీయులు ఎంతగా కృషి చేశారో, ఎంతగా తపించారో జగమెరిగిన విషయమే.

శంకరుడు, మధ్వాచార్యుడు, రామానుజుడు ఇత్యాది మతాచార్యులంతా భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి, సత్యస్వరూపాన్ని ఆచరణలో సాధించటానికి చేసిన ప్రయత్నాలలో రకరకాల వ్యాఖ్యలు చెప్పారు. ఐతే వారంతా చారిత్రకంగా హిందూమత సంస్కరణకు, పునరుద్ధరణకు, ఆధునికీకరణకు ఉద్దేశింపబడినవారు గనుక వారు తమ లక్ష్యాలు, ఉద్దేశాలకు అనుగుణంగానే భాష్యాలు చెప్పారు. వీరు తమ సంస్కరణ లక్ష్యాలు సాధించగలిగినా సత్యం విషయంలో అభిప్రాయ భేదాలకు, వాదోపవాదాలకు కారకులయ్యారు.

ఐతే మనం శ్రద్ధతో భారతీయ తత్త్వశాస్త్ర జగత్తుకే మకుటాయమానం అనదగిన, ఉపనిషద్సారమైన భగవద్గీతను పరిశీలించినట్లైతే సత్యాన్ని సులభంగానే గ్రహించవచ్చు. గీతా శాస్త్రంలో సత్యం గురించి చెప్పబడిన విషయాన్ని మూడు సూత్రాలలో సంగ్రహంగా తెలుపవచ్చు. అవి:

1. ‘సత్వము’, ‘రజస్సు’, ‘తమస్సు’ అను పరస్పర విరుద్ధమైన మూడు గుణాల ‘మౌలిక మిశ్రమం’ ఈ ‘జగత్తు’.

2. అవే మూడు గుణాల అంశీభూత సమ్మేళనం ‘సత్యం’.

3. జగత్తు నుండి సత్యాన్ని ఆవిష్కరించే సాధనం ‘యజ్ఞం’.

మొదటి సూత్రం మనకు ‘కర్మ స్వరూపం’ మరియు ‘జగత్ స్వరూపం’ లను వివరిస్తుంది. రెండవ సూత్రం ‘సత్యస్వరూపం’ ను వివరిస్తుంది. మూడవ సూత్రం ‘యజ్ఞం’, లేక ‘నిష్కామ కర్మ’ యొక్క స్వరూపాన్ని వివరిస్తుంది.

సత్య స్వరూపాన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే మొదట మనం విధిగా కర్మ స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి…(సశేషం)


23, ఆగస్టు 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---16 (మొదటి అధ్యాయం చివరి భాగం)





ఎందుకీ వైఫల్యం..?!


ఇస్లాం,కాపిటలిజం,కమ్యూనిజం.. ఇవి మూడునూ మానవుడు యావత్ మానవాళినంతటినీ ఉద్దేశించి ఒక చక్కటి సామాజిక, రాజకీయ వ్యవస్థ కొరకు ఒకదాని తరువాత ఒకటిగా చేసిన మూడు మహా ప్రయత్నాలు. ఇవి మూడునూ విఫలమయ్యాయి. అయితే ఇవి విఫలమైనది అంతిమ లక్ష్య సాధనలో మాత్రమే. వీటి ఫలితంగా ప్రపంచంలో అనేక మార్పులు జరిగాయి.. అనేక అద్భుతాలు సంభవించాయి. తుదకు నేటి రూపం ఏర్పడింది. ఈ విధంగా ఇవి చాలా ప్రయోజనాన్నే సాధించాయి. ఐతే మానవుని ఆ చిరకాల స్వప్నం మాత్రం నెరవేరలేదు. ఆ విషయంలో మాత్రం మానవుడు వైఫల్యాన్నే చవి చూశాడు.

తన వైఫల్యానికి కారణాన్ని సమీక్షించుకోక తప్పని పరిస్థితి ఇప్పుడు మానవునికి ఏర్పడింది.ఈ విధంగా ఒకదాని తరువాత ఒకటిగా విఫలయత్నాలు చేసుకుంటూ పోయే అవకాశం ఇక మానవునికి లేదు. అది ఆ మూడింటితోనే సరి.మానవుని వైఫల్యానికి ప్రధాన కారణం ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా మానవుడు ప్రతిక్రియాత్మక ధోరణితోనే వ్యవహరించాడు గానీ అసలు సత్యమేమిటనిగానీ, రాగద్వేష రహితంగా సరైన విధానమేమిటనిగానీ ఆలోచించలేదు. తన ప్రతిక్రియాత్మక ధోరణినే మానవుడు సరియైన విధానంగా, సత్యంగా భావించాడు. నేటి పరిభాషలో చెప్పాలంటే మానవుడు Proactiv గా కాక Reactive గా కృషి చేశాడు.అందువలనే విఫలం చెందాడు.

ఒక చక్కటి సామాజిక, రాజకీయ వ్యవస్థ కొరకు ప్రయత్నించేటపుడు ‘సరి అయిన వ్యవస్థ అంటే అసలు ఎలా ఉండాలి?’.. అని ఆలోచింపక అప్పటికి సమస్యగా పరిణమించిన విషయాలకు పరిష్కారంగా తోచిన ప్రతిక్రియాత్మక ధోరణితో నూతనమైన వ్యవస్థలను నిర్మించాడు. అందువలన అవి అప్పటికి సమస్యలను పరిష్కరించినా, కాలక్రమంలో ఈ పరిష్కారాలే మరలా కొత్త రూపంలో సమస్యలుగా రూపాంతరం చెందాయి. తిరిగి మానవుడు ఆ వ్యవస్థను కాదని తిరిగి కొత్త వ్యవస్థను నిర్మించేటపుడు కూడా మరలా ప్రతిక్రియాత్మక ధోరణితోనే వ్యవహరించాడు. దానితో అవికూడా అప్పటికి సమస్యలను పరిష్కరించినా కొంత కాలానికి తిరిగి స్వయంగా అవే సమస్యలుగా పరిణమించాయి.

అరాచకానికి వ్యతిరేకంగా జనించిన ఇస్లాం విషయంలో ఇలానే జరిగింది. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జనించిన కాపిటలిజం విషయంలో ఇలానే జరిగింది. కాపిటలిజానికి వ్యతిరేకంగా జనించిన కమ్యూనిజం విషయంలో ఇలానే జరిగింది. కనుక ఇకనైనా మానవుడు తన ప్రతిక్రియాత్మక ధోరణికి స్వస్థి పలికి రాగద్వేష రహితంగా అంటే ఏ ఒక్క వ్యవస్థ మీద కూడా ఇష్టాన్ని కానీ అనిష్టాన్ని కానీ ప్రదర్శించకుండా అసలు సత్యమేమిటని ఆలోచించాలి. తనకు సమస్యగా పరిణమించిన వ్యవస్థను ద్వేషించడం మానుకుని ‘అసలు సత్యస్వరూపమైన వ్యవస్థ ఎలా ఉంటుంది?’ అని ఆలోచించాలి. ద్వేషించడం కనుక జరిగితే ఆ వ్యవస్థకు ప్రతిక్రియనే మానవుడు కోరుకుంటాడు.. ఆ ప్రతిక్రియనే సత్యమనుకుంటాడు.

మానవుడు చరిత్రలో ఏ వ్యవస్థను నిర్మించేటపుడైనా మొదట తాత్విక విచారణ చేసేవాడు. ఆ తాత్విక పునాదిపైనే ఆయా వ్యవస్థలను నిర్మించేవాడు. ఐతే ఆ తాత్విక విచారధారలన్నీ సత్యాన్ని కాక అప్పటి తన ప్రతిక్రియాత్మక ధోరణినే ప్రతిబింబించేవి. ఆ ధోరణే పునాదిగా గలిగిన వ్యవస్థలు కూడా అలానే వ్యవహరించేవి.. తుదకు విఫలం చెందేవి.

ఇస్లాం ఆవిర్భవించిన నేపథ్యం అరాచకం. ఆ రోజులలో ప్రపంచంలో అనాగరిక జాతులు అల్లకల్లోలం సృష్టిస్తుండేవి.కనుక మానవుడి ఆలోచనాధోరణిని ఆ అరాచకం ప్రభావితం చేసింది. అరాచకానికి ప్రతిక్రియగా పటిష్ఠమైన రాజ్యశక్తి నిర్మాణానికి మానవుడు మొగ్గుచూపాడు. ఆ ధోరణి కలిగిన తాత్వికచింతనే చేశాడు. అదే సత్యంగా భావించాడు. అలా ఏర్పడినదే ఇస్లాం.

కానీ మితిమీరిన రాజ్యశక్తి కాలక్రమంలో సామాజిక వికాసానికి ఆటంకంగా పరిణమించినది.దానితో మానవుడు మరలా ఆలోచనలో పడ్డాడు. ఈ సారి సామాజిక వికాసానికి అనుకూలమైన తాత్విక విచారణ చేశాడు. రాజ్యశక్తిని సమస్యగా భావించాడు. ఈ పునాది మీద ఏర్పడినదే కాపిటలిజం. కానీ కాలక్రమంలో మితిమీరిన సామాజిక స్వేచ్ఛ వ్యక్తి ప్రయోజనానికి భంగకరంగా మారింది. దానితో మానవుడు మరలా ఆలోచనలో పడ్డాడు. తిరిగి సామాజిక వికాసాన్ని సమస్యగా భావించి వ్యక్తి ప్రయోజనానికి అనుగుణమైన తాత్విక చింతన చేశాడు. ఆ తాత్విక పునాది మీదనే సామ్యవాదాన్ని నిర్మించాడు.కానీ కాలక్రమంలో ఈ సామ్యవాదం వలన అసలు మానవుని సామాజిక జీవనం యొక్క మౌలిక లక్ష్యాలే దెబ్బతినటంతో తిరిగి ఆ సామ్యవాదాన్ని కూడా వదిలేశాడు.

ఇప్పుడు ప్రపంచంలో ఒక రకమైన భావశూన్యత ఏర్పడింది. ఇటువంటి శూన్యత సమీప గతంలో ఎప్పుడూ ఏర్పడలేదు. ఇస్లాం ప్రపంచాన్ని డామినేట్ చేసిన రోజుల్లో ఇస్లామిక్ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శంగా ప్రజాదరణ పొందాయి. తరువాతి కాలంలో ఆ సిద్ధాంతం వెనుకబడగానే కాపిటలిస్టు అభ్యుదయభావాలు ప్రపంచాన్ని డామినేట్ చేశాయి. అవి కూడా వెనుకడుగు వేయగానే సామ్యవాద ఆదర్శ భావజాలం ప్రపంచాన్ని డామినేట్ చేసింది. ఇప్పుడు అలా డామినేట్ చేసిన భావజాలమేదీ ప్రపంచంలో లేదు. ఇప్పుడు మానవుని ముందున్నది మూడు విఫలయత్నాలు మాత్రమే.

ఈ విధంగా మానవుడు గతకాలంలో సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఒక సమస్య పోతే మరో సమస్యనెదుర్కొన్నడు. ఏది సమస్యకు పరిష్కారమని ఢంకా భజాయించి చెప్పాడో అదే తిరిగి సమస్యగా పరిణమించడంతో నివ్వెరపోయాడు. ప్రతీసారీ ఇలానే జరగటంతో మానవుడు మ్రాన్పడిపోయాడు.

మానవుడు చరిత్రలో చాలా హడావుడి చేశాడు. కానీ ఏదీ నిలబడలేదు.దీనివలన ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట వాస్తవమైనా .. నేటి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సంపత్తి కలిగిన ప్రపంచం ఆయా ప్రయత్నాల ఫలితమే అయినా.. మానవుని అసలు లక్ష్యమైన ‘వ్యవస్థలోని అన్ని అంగాల ప్రయోజనం సమంగా నెరవేరే’ రాజకీయ, సామాజిక వ్యవస్థ మాత్రం నిర్మింపబడలేదు. కనుక ఇకనైనా మానవుడు తన ప్రతిక్రియాత్మక ధోరణిని వదలి.. రాగద్వేషపూరితమైన ఆలోచనాధోరణిని వదలి సరియైన తాత్విక విచారధారతో సత్యాన్ని కనుగొనాలి. తనకు తోచిన దానిని, తన భావాలకు అనుకూలంగా ఉన్నదానిని, అప్పటి సమస్యకు పరిష్కారంగా ఉన్నదానిని సత్యంగా భావించే ధోరణిని విరమించుకోవాలి.

ఈ జగత్తులో ఎవ్వరి భావాలతో ఎవ్వరి ఒప్పుకోలుతో నిమిత్తంలేని సత్యమనేది ఒకటి ఉన్నది.దానిని చేరే మార్గం కూడా ఉన్నది. దానిని మానవుడు తెలుసుకోవాలి.దానిని ఆచరిస్తేనే మానవుడికి ప్రయోజనం. దాని ద్వారానే మానవుని చిరకాల లక్ష్యం నెరవేరుతుంది. అటువంటి అనిమిత్త సత్యాన్ని తెలుసుకోకుండా తనకు నచ్చిన దానిని సత్యంగా ప్రకటించకూడదు. అదే మానవుడు చేసిన తప్పు. దాని ప్రతిఫలమే ఈ వైఫల్యం…(సశేషం)

(ఇంతటితో ‘ప్రపంచ చారిత్రక, రాజకీయ పరిణామాల సంగ్రహ అధ్యయనం’ అనే మొదటి అధ్యాయం సమాప్తం)



21, ఆగస్టు 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---15



(గమనిక: ‘మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమే’ అనబడు గత టపాలోని అంశానికి ఇది కొనసాగింపు)

ఏకధృవ ప్రపంచం-నయా దోపిడి

తరువాతి దశ సోవియట్ పతనానంతర దశ. ఇది కాపిటలిజం యొక్క నాల్గవ మరియు అంతిమ దశ. ఈ దశలో కాపిటలిజానికి కమ్యూనిస్టు భయం తొలగిపోయింది. ఈ దశకు కూడా అమెరికానే నాయకత్వం వహిస్తున్నది. అయితే ఈ సారి తానొక్కటే అగ్రరాజ్యంగా ఏకధృవ ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా మారింది. కమ్యూనిస్టు భీతి తొలగిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ దశలో సంస్కరణల పేరుతో తిరిగి నయా దోపిడీ విధానాలను తెరపైకి తెస్తున్నది. ఈ సంస్కరణల వలన పేదవారు యధావిధిగా దోపిడీ పాలౌతుంటే బూర్జువా సామాజిక శక్తులు, ఇతర మధ్య తరగతి వర్గం ఎనలేని లాభాలను పొందుతున్నాయి.

మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో సామాజిక మైన ఉత్పత్తి వనరులను, మౌలిక సదుపాయాలను బూర్జువా వర్గం అభివృద్ధి చేస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థ సామాజిక ప్రయోజనాలను మాత్రమే ఉద్దేశించినది కనుక. కానీ అలా అభివృద్ధి చేసిన సామాజిక వనరులను బూర్జువా వర్గాలు తమ స్వంత ఆస్థిగా మార్చుకుంటాయి లేదా తమ స్వలాభం ఉన్నపుడే అలా అభివృద్ధి చేస్తాయి. ఆ అభివృద్ధిని చూపి అదే దేశాభివృద్ధి అంటుంది. ఆ ఉత్పత్తి వనరులలో ఉద్యోగాలను వ్యక్తి ప్రయోజనం గా చూపుతుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనం కల్ల. ఇద్దరికి ఉద్యోగాలు లభిస్తే పది మంది బ్రతుకులు వీధిన పడుతుంటాయి. సామ్యవాద ఉద్యమ ఫలితంగా ఇప్పుడు కొల్లదారీ బూర్జువా వర్గం బాహాటమైన దోపిడీ విధానం మానుకున్నది. అంత మాత్రాన అది వ్యక్తి ప్రయోజనం కొరకు పాటుపడుతున్నదనీ.. ఈ వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనం నెరవేరుతున్నదనీ అనుకోవటం మూర్ఖత్వమే.

ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కొరకు పేదల పంటపొలాలను గుంజుకొనే ధైర్యం ఈ బూర్జువా వర్గానికి సామ్యవాద సిద్ధాంతపు ఓటమి వల్లనే వచ్చింది. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకత్వాలతో కడుతున్న సాగునీటి ప్రాజెక్టులు వందలాది ఎకరాల పంటపొలాలను, వేలాదిమంది సామాన్య ప్రజలు నివసిస్తున్న గ్రామాలను, పల్లెలను ముంపునకు గురిచేస్తుంటే అది బూర్జువా వర్గానికి మేలు చేసే ఉత్పత్తి వనరుల అభివృద్ధింగానే ఉంటుంది తప్ప వ్యక్తి ప్రయోజనం దిశగా అవి జరగటంలేదు. రోడ్డుమార్గాలవంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి సైతం కొల్లదారీ బూర్జువా వర్గం యొక్క ప్రయోజనాలను ఉద్దేశించినవే.

ఈ అభివృద్ధి జరగాల్సిందే. కానీ వ్యక్తి అందుకొరకు బలికాకూడదు. ఎందుకంటే సరైన వ్యవస్థలో సమాజం యొక్క అభివృద్ధితో పాటు వ్యక్తి సైతం ప్రయోజనం పొందుతాడు. కానీ ప్రస్తుత భారతదేశంలో ఇంతటి సామాజిక అభివృద్ధి జరుగుతున్నా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ ఆత్మహత్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి.ఇందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే మరి ఇంకెందరు చావలేక బ్రతకలేక దుర్భర దారిద్ర్యంతో అల్లాడుతున్నారో కదా!

ఈ విధంగా కాపిటలిజం చరిత్రలో జరిగే మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తటం వలనే నేటికీ స్థిరంగా నిలబడి తనకన్నా పురోగామి అయిన కమ్యూనిజాన్నే ఓడించగలిగినది.

ప్రస్తుత దశ కాపిటలిజం యొక్క అంతిమ దశ.ఈ దశ మీద పోరాడే మానవుడు తన అంతిమ రాజకీయ, సామాజిక వ్యవస్థను నిర్మిస్తాడు. కాపిటలిజం యొక్క ఈ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకునే మానవుడు దాన్ని శాశ్వతంగా అంతమొందించే వ్యూహాన్ని రచించాలి. అపుడు మాత్రమే మానవుడు తన చిరకాల స్వప్నాన్ని-వ్యవస్థలోని మూడు అంగాలూ సమానంగా ప్రయోజనం పొందే రాజకీయ, సామాజిక వ్యవస్థను- సాకారం చేసుకోగలుగుతాడు… (సశేషం)


భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---14





మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమే

గడచిన చరిత్రను పరిశీలిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభంజనంతో ఫ్యూడల్ ఇస్లాం తన ప్రాభవాన్ని దాదాపూ కోల్పోయింది. కానీ ఆ విధంగా కమ్యూనిజం యొక్క ప్రభంజనంతో కాపిటలిజం తన ప్రాభవాన్ని కోల్పోలేదు.

ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిజం ఆవిర్భవించింది. అంటే ఫ్యూడలిజం కన్నా కాపిటలిజం ప్రగతిశీలమైనది.కాపిటలిజం కన్నా కమ్యూనిజం ప్రగతిశీలమైనది. చరిత్రలో ఫ్యూడలిజం తనకన్నా పురోగామి అయిన కాపిటలిజం చేతిలో చావుదెబ్బ తిన్నది. కానీ అదే విధంగా కాపిటలిజం మాత్రం తనకన్నా పురోగామిశీలియైన కమ్యూనిజం వలన నష్టపోయింది కానీ చావు దెబ్బ మాత్రం తినలేదు.పైగా కాలగతిలో పురోగామిశీలియైన కమ్యూనిజమే దెబ్బతిన్నది.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఖలీఫేట్ రద్దుతో ఇస్లాం ఆధిపత్య చరిత్ర ముగిసిపోయింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లు అగ్ర రాజ్య హోదా కోల్పోయినా అమెరికా, రష్యాలు యుద్ధానంతరం అగ్ర రాజ్యాలుగా అవతరించడంతో అమెరికా రూపంలో కాపిటలిజం తన ప్రాభవాన్ని యుద్ధానంతరం కూడా చాటుతూనే ఉన్నది. కాలక్రమంలో సోవియట్ రష్యాలోనే కమ్యూనిజం దెబ్బతిని రష్యా అగ్ర రాజ్య హోదా కోల్పోయినా కూడా అమెరికా రూపంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాభవం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అమెరికా ఒక్కటే ఇప్పుడు అగ్రరాజ్య హోదా కలిగి ఉండటంతో ఇప్పటి ప్రపంచాన్ని ఏకధృవ ప్రపంచం గా పిలుస్తున్నారు.

దీనివలన మనకు ఒక విషయం స్పష్టంగా బోధపడుతున్నది. అదేమంటే మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమేనని. ఎందుకంటే ఇస్లాం, కాపిటలిజం, కమ్యూనిజం లు మూడునూ కూడా మానవాళికి సరిసమానంగా మేలు-కీడులు చేసినప్పటికీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ప్రాభవం లేనివీ, ఈ సరికే చావుదెబ్బతిన్నవీ అయిన ఇస్లాం మరియు సామ్యవాదాలు మానవాళికి ఏవిధంగా శత్రువులు కాగలవు? ఒక వేళ ఫ్యూడలిజం కాపిటలిజం చేతిలో దెబ్బతిన్నట్లుగా కాపిటలిజం కమ్యూనిజం చేతిలో దెబ్బతిని నేడు కమ్యూనిజం ప్రాభవం కలిగిన ప్రపంచం ఏర్పడినట్లైతే మానవజాతి తన అంతిమశత్రువుగా కమ్యూనిజాన్ని పరిగణించవలసివచ్చేది. ఎందుకంటే చరిత్రలో మానవుడు అంతిమ వ్యవస్థను అప్పటికి ప్రాభవం కలిగిన వ్యవస్థను కూల్చి మాత్రమే కదా నెలకొల్పేది. కాబట్టి ఇప్పుడు అమెరికా రూపంలో కాపిటలిజం తన ప్రాభవాన్ని చాటుతున్నది కనుక ఆ కాపిటలిజాన్ని కూల్చి మాత్రమే మానవుడు తన అంతిమ సామాజిక, రాజకీయ వ్యవస్థను నెలకొల్పుతాడు. ఈ కారణ వలన మానవాళి అంతిమ శత్రువు కాపిటలిజమే.. పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రమే.

తనకన్నా పురోగామి వ్యవస్థ చేతిలో ఫ్యూడల్ వ్యవస్థ కూలిపోయినట్లుగా కాపిటలిజం తన కన్నా పురోగామి అయిన కమ్యూనిజం చేత దెబ్బ తిని ఎందుకు కూలిపోలేదు. పైగా ఆ పోరాటంలో తుదకు పురోగామి కమ్యూనిజమే ఎందుకు కూలిపోయింది? అని ప్రశ్నించుకున్నట్లైతే మనకు ఈ విధమైన సమాధానం లభిస్తుంది.

ఇస్లాంలో గానీ, కమ్యూనిజంలో గానీ లేని ఒక లక్షణం కాపిటలిజంలో ఉన్నది కనుననే కాలగతిలో కాపిటలిజం ఈనాటికీ నిలబడగలిగింది. ఆ లక్షణం వలననే తనకన్నా పురోగామి అయిన కమ్యూనిజంతో జరిగిన పోరాటంలో ఎంత నష్టపోయినా అంతిమంగా గెలిచింది. ఆ లక్షణమేమంటే కాలానుగుణంగా మారటం.. మారిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తన వ్యూహాలను తగిన విధంగా మార్చుకోవడం.

మొదట కాపిటలిజం జనించిన కాలంలో అప్పటికి కాపిటలిజం అనే పేరును కూడా సంతరించుకోలేదు. ఆ కాలంలో స్పెయిన్, పోర్చుగల్‌లు అగ్రరాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో దోపిడీ ప్రత్యక్షంగా జరిగేది. తమ వలసల నుండి కొల్లగొట్టిన సంపదను ప్రత్యక్షంగా దోపిడీ దొంగల మాదిరిగా నౌకలలో స్వదేశాలకు తరలించేవారు. ఇది ఆ వ్యవస్థ యొక్క మొదటి దశ. ఈ దశలో నౌకాబలం నిర్ణాయక శక్తిగా ఉండేది. ఆ బలం అధికంగా ఉన్న స్పెయిన్ అప్పట్లో అగ్రరాజ్యంగా చెలామణీ అయినది. పారిశ్రామిక విప్లవం సంభవించేవరకూ ఈ దశ కొనసాగింది.

కాలక్రమంలో ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు జరిగి వస్తూత్పత్తి యంత్రాల సాయంతో జరగటం ప్రారంభమైనపుడు ఈ వ్యవస్థ తన వ్యూహం మార్చినది. తన వలసలను తన దేశంలోని పరిశ్రమలకు ముడిసరకు సరఫరాదారులుగా, తమదేశ పారిశ్రామికోత్పత్తులకు మార్కెట్లుగా వాడుకున్నది. దీనివలన దోపిడీ మరింత తీవ్రంగా జరిగినది. ఈ కాలంలోనే ఈ వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ అనే పేరును సంతరించుకున్నది. ఈ కాలమే ఈ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలం. ఈ దశకు బ్రిటన్, ఫ్రాన్స్‌లు అగ్రరాజ్యాలుగా వ్యవహరించటం జరిగినది. పారిశ్రామిక ప్రగతి ఈ కాలంలో నిర్ణాయక శక్తిగా ఉండేది. ఈ దశ రెండవ ప్రపంచ యుద్ధకాలం వరకు కొనసాగింది.

తరువాత దశ వలసలను పోగొట్టుకున్నకాలం. ఈ దశ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడి సోవియట్ రష్యాలో కమ్యూనిజం పతనమయ్యేవరకూ కొనసాగింది. ఈ దశలో అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలుగా కొనసాగాయి.ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రధానంగా ఆత్మరక్షణ దశ. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షేమ రాజ్యం అవతార ఎత్తింది. కమ్యూనిజం తనమీద చేసిన ప్రధాన విమర్శలనన్నింటినీ దిద్దుకున్నది. వలసలకు స్వతంత్ర్యమిచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే సోషలిస్టు లక్ష్యాలను సాధించవచ్చంటూ సోషలిస్టు మంత్రాన్ని తానే జపిస్తూ వచ్చింది. ఈ విధంగా ప్రజలకు ప్రత్యేకించి సామ్యవాదాన్ని కోరుకునే అవసరం లేకుండా జాగ్రత్త పడింది.

సరిగా ఈ దశనే స్వాతంత్ర్యానంతరం భారతదేశం అవలంబించింది. ఈ దశ యొక్క ప్రధాన లక్షణం ‘కమ్యూనిస్టు భీతి’.

ప్రచ్ఛన్న యుద్ధం

కమ్యూనిస్టు భీతి ప్రధాన లక్షణంగా గల ఈ దశలో నిర్ణాయక శక్తి సైనిక బలం. ఈ దశలో కాపిటలిజం యొక్క ప్రధాన లక్ష్యం కమ్యూనిజాన్ని అంతమొందించడం. తుదకు తూర్పు ఐరోపా దేశాలలో మరియు సోవియట్ రష్యాలో సామ్యవాదం కూలిపోవటంతో ఈ దశ అంతరించింది. ఈ సామ్యవాద పతనం అన్నది చరిత్రలో ఇటీవలి పరిణామమే. 80వ దశకం చివరిలోనూ 90వ దశకం ప్రారంభంలోనూ ఈ పరిణామాలు జరిగాయి. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న అమెరికా మరియు సామ్యవాద వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న రష్యాకు మధ్యన సిద్ధాంతపరమైన ఆధిపత్యం కొరకు 'ప్రచ్ఛన్న యుద్ధం'(Cold War) జరిగినది. అందుకే ఈ దశ ప్రచ్ఛన్నయుద్ధ కాలంగా కూడా సుప్రసిద్ధం…(సశేషం)