9, జులై 2010, శుక్రవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 4వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 4 

అలెగ్జాండర్ చేత జయించబడిన డేరియస్ సామ్రాజ్యం అలెగ్జాండర్ మరణానంతరం అతని వారసుల మీద ఎందుకు తిరుగుబాటు చేయలేదు?







అలెగ్జాండర్ ద గ్రేట్ కొద్ది సంవత్సరాలలోనే ఆసియా మీద విజయాన్ని సాధించి, అక్కడ తన అధికారం ఇంకా స్థిరపడకముందే మరణించాడు. ఒక కొత్త రాజ్యాన్ని సంరక్షించుకోవడంలో ఉండే కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని అతడు మరణించటం వలన సామ్రాజ్యం మొత్తం తిరుగుబాటు చేస్తుందని భావించబడింది. కానీ అతని వారసులు దానిని సమర్థవంతంగా సంరక్షించుకోగలిగారు. అలాచేయడంలో వారికి కేవలం తమ దురాశ మూలంగా మరియు ఒకరి యెడల ఒకరు అసూయ చెందడం మూలంగా తలయెత్తిన కష్టం తప్ప మరెటువంటి ఇతర కష్టం ఎదురుకాలేదు.

ఇలా జరగటం ఎవరికైనా కొత్తగా అనిపించి కారణం అడిగితే, నేను ఈ విధంగా సమాధానమిస్తాను. మనకు తెలిసిన అన్ని సంస్థానాలూ రెండు వేర్వేరు విధానాలలో పరిపాలింపబడుతున్నాయి. ఒక విధానంలో రాజు మరియు కొంతమంది సేవకుల సమూహం ఉంటుంది. వారంతా ఆ రాజు యొక్క ప్రసన్నత వలన మరియు అనుమతి వలన రాజ్యాన్ని పరిపాలించడంలో అతనికి మంత్రులుగా సహకరిస్తుంటారు. మరో విధానంలో రాజు మరియు కొందరు ప్రభువంశీకులు ఉంటారు. వారు తమ హోదాను రాజు యొక్క దయ వలన కాక అనువంశికంగా కలిగి ఉంటారు. ఈ ప్రభువంశీకులు అందరికీ తమను వారి రాజుగా గుర్తిస్తూ, ఎంతగానో ప్రేమించే ప్రజలతో కూడుకున్న స్వంత రాజ్యాలు ఉంటాయి. రాజు మరియు అతని సేవకులచే పరిపాలింపబడే రాజ్యాలు రాజుకు చాలా ప్రాముఖ్యత కలుగజేస్తాయి. ఎందుకంటే దేశం మొత్తంలో ఇతని కన్నా ఉన్నతుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి మరెవరూ ఉండరు. ఒకవేళ ఇతరులు ఎవరైనా గౌరవాన్ని పొందినా కూడా, రాజు యొక్క మంత్రులుగా, అధికారులుగా వారు గౌరవాన్ని పొందుతారేగానీ వారి యెడల మరేవిధమైన వ్యక్తిగత ప్రేమాభిమానాలు ఉండవు.

ఈ రెండు ప్రభుత్వ విధానాలకూ మనకాలంలో మంచి ఉదాహరణలు టర్కీ మరియు ఫ్రాన్స్. టర్కిష్ సామ్రాజ్యం మొత్తం ఒక్క రాజు చేతనే పాలింపబడుతూ ఉంటుంది. ఇతరులు అందరూ సేవకులుగా ఉంటారు. అతడు రాజ్యాన్ని ‘సంజక్’లు అనబడే విభాగాలుగా విభజించి, వాటన్నింటికి ఒక్కొక పరిపాలనా అధికారిని నియమిస్తాడు. ఆ పరిపాలనా అధికారులను రాజు తన చిత్తానుసారంగా బదిలీ చేస్తుంటాడు. ఒకరి స్థానంలో మరొకరిని నియమిస్తుంటాడు. అయితే ఇందుకు విరుద్ధంగా ఫ్రాన్స్ దేశపు రాజు వంశపారంపర్య అధికారం కలిగిన అనేక మంది ప్రభువంశీకులచే పరివేష్ఠితుడై ఉంటాడు. వారిలో ప్రతి ఒక్కరూ తమ స్వంత ప్రజలనుండి గుర్తింపునూ, ప్రేమాభిమానాలనూ పొందుతుంటారు. ఆ ప్రభువంశీకులంతా కొన్ని ప్రత్యేకాధికారాలను కలిగి ఉంటారు. రాజుకు సైతం వాటిని తొలగించడం కష్టసాధ్యం.

ఈ రెండు రాజ్యాల యొక్క వేరువేరు లక్షణాలను పరిశీలించిన వారు టర్కీ రాజ్యాన్ని ఆక్రమించడం కష్టసాధ్యమనే విషయాన్ని గ్రహిస్తారు. అయితే ఒకసారి దానిని జయించడమంటూ జరిగితే ఆ తదుపరి దానిని నిలుపుకోవడం మాత్రం సులభ సాధ్యం. టర్కీని జయించడంలో ఉన్న కష్టాలకు కారణాలు ఏమిటంటే దండెత్తాలని అనుకునేవారికి ఆ రాజ్యంలోని ఏ ప్రభువంశీకుల నుండి కూడా పిలుపు అందదు. అలానే శత్రురాజు యొక్క సహచరులు రాజద్రోహానికి పాల్పడటం ద్వారా తమ దురాక్రమణ ప్రయత్నాలకు ఏదైనా సహాయం మందవచ్చని ఆశించే వీలు కూడా ఉండదు. పైన తెలిపిన కారణాల వలన ఇలా జరిగింది. అవేమంటే రాజు యొక్క మంత్రులు అతనికి కేవలం సేవకులూ మరియు అతని మీద ఆధారపడి బ్రతికే బానిసలు అవడం మూలాన వారు అంత తేలికగా రాజద్రోహానికి పాల్పడరు. ఒకవేళ వారు ద్రోహానికి పాల్పడినా కూడా వారి నుండి అందే సహాయం ఏమీ ఉండదు. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా వారు ప్రజలను కూడగట్టలేరు కనుక. కనుక టర్కీని జయించాలనుకునేవారు మొదట తన వారంతా సంఘటితంగా ఉండటం గురించి ఆలోచించాలి. అలానే శతృశిబిరంలోని రాజద్రోహాలమీద కాకుండా తన స్వీయశక్తి మీదే ఆధారపడాలి. అయితే ఒకసారి టర్కీ జయించబడిన తరువాత, అది తన సైన్యాన్ని తిరిగి కూడగట్టలేని విధంగా యుద్ధరంగం నుండి తరిమి వేయబడిన తరువాత ఒక్క రాజకుటుంబానికి తప్ప మరిదేనికీ భయపడవలసిన పనిలేదు. దానిని కూడా తుదముట్టించిన తరువాత ఇక భయపడవలసిన వారు ఒక్కరు కూడా మిగిలి ఉండరు. మిగిలిన వారెవరికీ ప్రజలలో పలుకుబడి ఉండదు కనుక విజేత ఆ రాజ్యాన్ని జయించడానికి పూర్వం వారి మీద ఏ విధంగా ఆధారపడలేదో, అలాగే జయించిన తరువాత వారికి భయపడాల్సిన పని కూడా లేదు.

ఫ్రాన్సు వంటి పరిపాలన ఉన్న రాజ్యాలలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. అటువంటి చోట్ల అసమ్మతివాదులు, మార్పును అభిలషించేవారూ ఎల్లప్పుడూ ఉంటారు కనుక ఎవరో ఒక ప్రభువంశీకుడి సహాయసహకారాల ద్వారా చాలా సులభంగా ఆ రాజ్యంలో ప్రవేశించవచ్చు. అటువంటి వ్యక్తులు ముందే తెలుపబడిన కారణాలరీత్యా తమ రాజ్యం మీద నీవు దండెత్తడానికి మార్గాన్ని సుగమం చేయడమే కాక నీవు సులువుగా విజయం సాధించడానికి తోడ్పడతారు. అయితే ఆ తదుపరి ఆ రాజ్యాన్ని సంరక్షించుకొనే ప్రయత్నంలో నీచే రాజ్యాన్ని కోల్పోయినవారి నుండే కాక నీకు సహాయం చేసినవారి నుండి కూడా నీవు అంతులేని కష్టాలను ఎదుర్కొంటావు. నీకు వ్యతిరేకంగా జరిగే తదనంతర పరిణామాలన్నింటికీ మిగిలిపోయిన రాజవంశీకులందరూ నాయకత్వం వహిస్తారు కనుక రాజకుటుంబాన్ని ఒక్కదాన్ని మట్టుబెట్టినందువల్ల ప్రయోజనమేమీ ఉండదు. ఈ రాజవంశీకులను నీవు ఇటు సంతృప్తి పరచలేక అటు తుదముట్టించలేక సతమతమవుతూ ఏదో ఒక సమయంలో జయించిన రాజ్యాన్ని తిరిగి కోల్పోతావు.

ఇప్పుడు నీవు డేరియస్ ప్రభుత్వ స్వభావాన్ని పరీక్షించినట్లైతే, అది టర్కీ సామ్రాజ్యంతో పోలి ఉన్నట్లుగా తెలుసుకుంటావు. కనుక అలెగ్జాండర్‌కు ముందుగా అతడిని యుద్ధంలో ఓడించి, అటు పిమ్మట అతడి రాజ్యాన్ని సొంతం చేసుకోవలసిన అవసరం ఒక్కటే ఉన్నది. అలా విజయం సాధించిన తరువాత డేరియస్ చంపబడి, పైన తెలిపిన కారణాల వలన ఆ రాజ్యం అలెగ్జాండర్‌కు శాశ్వతంగా స్వంతమైపోయింది. అలెగ్జాండర్ వారసులు సంఘటితంగా ఉన్నట్లైతే ఆ రాజ్యాన్ని చాలా సులువుగా, సురక్షితంగా తమ స్వాధీనంలో ఉంచుకోగలిగేవారు. ఎందుకంటే ఆ రాజ్యంలో మరే ఇతర కల్లోలాలూ చెలరేగలేదు..వీళ్ళు స్వయంగా సృష్టించుకున్నవి తప్ప.

(డేరియస్ పర్షియా రాజు)

అయితే ఫ్రాన్సును పోలిన ప్రభుత్వ విధానం ఉన్న రాజ్యాలను సంరక్షించుకోవడం ఇంత తేలిక కాదు. స్పెయిన్, గాల్ మరియు గ్రీసు రాజ్యాలు చిన్న చిన్న సంస్థానాలతో కూడుకున్నవి కనుక అక్కడ రోమన్‌లకు వ్యతిరేకంగా తరచూ తిరుగుబాట్లు చెలరేగుతుండేవి. ఆ సంస్థానాల జ్ఞాపకాలు (పాత ప్రభువుల యొక్క జ్ఞాపకాలు) ఉన్నంతకాలం రోమన్‌ల పెత్తనం ఏనాడూ సురక్షితంగా లేదు. కానీ కాలక్రమంలో రోమన్‌ల అధికారం వలన మరియు వారి పరిపాలన దీర్ఘకాలం కొనసాగటం వలన ఆ పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోయి రోమన్ల పెత్తనం సురక్షితంగా మారింది. తరువాత తమలో తాము కలహించుకున్న సమయంలో తాము అక్కడ కలిగి ఉన్న పలుకుబడిని బట్టి ఆ రాజ్యాలలో కొంత కొంత భాగాన్ని వారిలో ప్రతి ఒకరూ తమతో ఉంచుకోగలిగారు. ఆయాచోట్ల పాత ప్రభువుల యొక్క కుటుంబాలు తుదముట్టించబడటంతో రోమన్‌లు తప్ప వేరెవ్వరూ ప్రభువులుగా గుర్తించబడలేదు.

ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నట్లైతే అలెగ్జాండర్ ఆసియాలోని తన సామ్రాజ్యాన్ని సులువుగా సంరక్షించుకున్న వైనం యెడల, అలాగే పిర్రస్ మరియు అనేకమంది ఇతరులు తాము జయించిన రాజ్యాలను సంరక్షించుకోవడంలో ఎదుర్కున్న కష్టాల యెడల ఆశ్చర్యబోవలసిన అవసరం ఎవరికీ ఉండదు. ఎందువల్లనంటే దీనికి కారణం విజేత బలవంతుడో లేక బలహీనుడో అవటం కాదు. వారు జయించిన రాజ్యాల యొక్క లక్షణాలలోని తేడాలే దీనికి కారణం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి