11, అక్టోబర్ 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 11వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 11 

చర్చి అధీనంలోని సంస్థానాల గురించి





చర్చి అధీనంలోని సంస్థానాల గురించి చెప్పడమే ఇప్పుడు మిగిలిపోయింది. వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ముందు మాత్రమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటిని పొందడానికి శక్తిసామర్థ్యాలో లేక అదృష్టమో అవసరమౌతుంది గానీ వాటిని సంరక్షించుకోవడానికి ఆ రెంటిలో దేని అవసరమూ ఉండదు. ఎందుకంటే అవి మతపరమైన ఆదేశాలద్వారా సంరక్షించబడుతూ ఉంటాయి. ఈ మతపరమైన ఆదేశాలు ఎంత శక్తివంతమైనవంటే, ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నవంటే, ఈ సంస్థానాలు వాటి యొక్క రాజులు ఏ విధంగా ప్రవర్తించినా, ఏ విధంగా జీవించినా కూడా సురక్షితంగానే ఉంటాయి. ఈ రాజులు మాత్రమే రాజ్యాలను కలిగి ఉంటారు కానీ వాటిని రక్షించరు. అలాగే ప్రజలను కలిగి ఉంటారు గానీ వారిని పాలించరు. అలాగే వారి రాజ్యాలకు ఏ విధమైన రక్షణ లేకపోయినప్పటికీ అవి వారి చేజారిపోవు. ప్రజలు తాము పాలింపబడనప్పటికీ వారు ఆసంగతిని పట్టించుకోరు. అంతేకాక వారికి తమ రాజభక్తిని వీడే కోరికగానీ, సామర్థ్యం గానీ ఉండవు. కనుకనే ఇటువంటి సంస్థానాలు మాత్రమే సురక్షితమైనవి మరియు సంతోషప్రదమైనవి. మానవ మేథస్సు అందుకోలేని శక్తులచేత రక్షించబడుతున్న వీటి గురించి నేను ఇంకేమీ మాట్లాడను. ఎందుకంటే భగవంతుడి చేతనే గౌరవింపబడి, నిర్వహింపబడుతున్న వాటి గురించి చర్చించడం అనేది ఒక దుందుడుకు వ్యక్తి యొక్క చేష్టగా భావించబడుతుంది.

అయినప్పటికీ --పోప్ అలెగ్జాండర్-VI కు ముందు ఇటలీ సార్వభౌములు [కేవలం సార్వభౌములేకాదు ప్రతీ చిన్న రాజు, భుస్వామి కూడా, వారెంత తక్కువస్థాయి వారైనప్పటికీ] చర్చియొక్క ప్రాపంచిక అధికారాలను చిన్న చూపు చూశారు. కానీ ఇప్పుడు ఫ్రాన్సురాజంతటివాడు దానిముందు భయపడిపోతున్నాడు. అతడిని అది ఇటలీ నుండి తరిమివేయగలిగింది. అలాగే వెనటియన్స్‌ను నాశనం చేయగలిగింది— దీనిని గమనించిన మీదట ప్రాపంచిక అధికారాలలో చర్చి అంత ఉన్నత స్థాయిని చేరుకోవడం ఏ విధంగా సంభవించింది అని ఎవరైనా నన్ను అడిగితే, సమధానం అందరికీ తెలిసినదే అయినప్పటికీ, దానిని కొంత జ్ఞాపకం చేసుకోవడం అనవసరం అని నాకనిపించదు.

ఫ్రాన్స్ రాజైన ఛార్లెస్ ఇటలీలోకి ప్రవేశించక ముందు [Charles VIII invaded Italy in 1494.] ఈ దేశం పోప్, వెనటియన్స్, నేపుల్స్ రాజు, డ్యూక్ ఆఫ్ మిలన్ మరియు ఫ్లోరెంటైన్స్… ఇలా వీరి యొక్క పరిపాలన కింద ఉన్నది. ఈ రాజ్యాలు రెండు ముఖ్యమైన ఒప్పందాలను కలిగి ఉన్నాయి. ఒకటి సాయుధసైన్య సమేతుడైన ఏ విదేశీయుడినీ ఇటలీ లోనికి ప్రవేశించనీయకూడదు. మరొకటి తమలో ఎవరూ కూడా రాజ్యవిస్తరణకు పూనుకోకూడదు. వీరందరిలో కూడా పోప్ మరియు వెనటియన్స్ వలనే ఎక్కువ భయాందోళనలు నెలకొన్నాయి. వెనటియన్స్‌ను అదుపులో ఉంచడానికి, ఫెర్రారాను రక్షించడం కొరకు జరిగిన విధంగా మిగిలిన రాజ్యాలన్నీ కూటమిగా ఏర్పడటం అవసరం. పోప్‌ను నియంత్రించడానికి ఓర్సిని మరియు కొలోన్నెసి అనే రెండు వర్గాలుగా విడిపోయిన రోమన్ జమీందారులను ఉపయోగించారు. వారు ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో గొడవపడి సాక్షాత్తూ పోప్ కళ్ళముందే ఆయుధాలను చేబూని నిలబడతారు. ఈ కారణంగా పోప్ అధికారం బలహీనంగా, అరక్షితంగా ఉండిపోయింది. అప్పుడప్పుడు ధైర్యవంతుడైన సిక్స్టస్ లాంటి పోప్ తలయెత్తినప్పటికీ అతడి వివేకంగానీ అతడి అదృష్టం గానీ ఈ చీకాకులనుండి అతడిని రక్షించలేదు. అంతేకాక పోప్ యొక్క జీవితకాలం తక్కువ అవడం కూడా బలహీనతకు ఒక కారణం. ఒక పోప్ యొక్క సగటు జీవితకాలమైన 10 సంవత్సరాలలో అతడు చాలా కష్టం మీద ఒక వర్గాన్ని మాత్రమే అణచివేయగలుగుతాడు. ఉదాహరణకు ఒక పోప్ కొలొన్నెసి వర్గాన్ని దాదాపూ అణచివేశాడనుకుందాం. తరువాతవచ్చే పోప్ ఓర్సిని వర్గానికి శత్రువుగా మారి, వారి ప్రత్యర్థులకు మద్దతిస్తాడు. ఆ విధంగా కొలొన్నెసి వర్గం మరలా జీవం పోసుకుంటుంది. అయినా కూడా ఓర్సిని వర్గాన్ని నాశనం చేయగలిగేంతటి సమయం అతడికి ఉండదు. పోప్ యొక్క ప్రాపంచిక అధికారాలను (రాజకీయ అధికారాలను) ఇటలీలో ఎవరూ మన్నించకపోవడానికి ఇదీ కారణం.

ఆ తరువాత 6వ అలెగ్జాండర్ తలయెత్తాడు. ఇతడు అందరు పోప్‌ల్లా కాకుండా ధనంతో, సైన్యంతో ఒక పోప్ ఏ విధంగా విజయాలు సాధించవచ్చో నిరూపించాడు. అలాగే డ్యూక్ వాలెంటినో (6వ అలెగ్జాండర్ కుమారుడు) సహాయ సహకారాల ద్వారా, ఫ్రెంచ్ వారి దురాక్రమణను ఒక అవకాశంగా మలచుకోవడం ద్వారా, -నేను డ్యూక్ చేసిన పనుల గురించి మాట్లాడేటపుడు- పైన తెలిపిన అన్ని విషయాలను ఈయన సాధించాడు. ఇతని ఉద్దేశ్యం చర్చి యొక్క శక్తిని పెంచడం కాదు. డ్యూక్ యొక్క శక్తిని పెంచడం మాత్రమే. అయినప్పటికీ ఇతడు చేసిన పనులు చర్చి యొక్క శక్తి పెరగడనికీ, దాని గొప్పదనానికీ దోహదపడ్డాయి. అతడి మరణం తరువాత, డ్యూక్ వినాశనం తరువాత ఆ చర్చే అతడి శ్రమయొక్క ఫలానికి వారసురాలయింది.

ఆ తరువాత పోప్ జూలియస్ వచ్చాడు. మొత్తం రొమాగ్నాను పొందడం ద్వారా, -మరియు రోమన్ జమీందారుల యొక్క ప్రాభవం క్షీణించి, అలెగ్జాండర్ కొట్టిన చావుదెబ్బల మూలంగా వారి యొక్క ముఠాలన్నీ చెల్లాచెదురై పోయి ఉన్న పరిస్థితిలో- చర్చి బలంగా ఉండటం గమనించాడు. అంతేగాక అలెగ్జాండర్‌కు ముందు ఎవరూ చేయని రీతిలో ధనాన్ని పోగుజేయడానికి మార్గం సుగమంగా ఉన్నట్లుగా కూడా గమనించాడు. అటువంటి విషయాలను జూలియస్ కేవలం అనుసరించడమే కాదు వాటిని ఇంకా వృద్ధిచేశాడు. బొలోగ్నాను పొందడానికి, వెనటియన్స్‌ను నాశనం చేయడానికి, ఇటలీ నుండి ఫ్రెంచివారిని తరిమివేయడానికి ఇతడు నిర్ణయించుకున్నాడు. ఈ పథకాలన్నింటిలోనూ ఇతను విజయం సాధించాడు. ఇంతేకాక మరింత ప్రశంసనీయమైన అంశమేమంటే అతడు నిర్వర్తించిన ప్రతీకార్యం చర్చిని మాత్రమే బలోపేతం చేశింది తప్ప ఏ వ్యక్తినో బలోపేతం చేయలేదు. మరిముఖ్యంగా ఓర్సిని మరియు కొలొన్నెసి వైరివర్గాలను కూడా ప్రారంభంలో (తాను అధికారంలోకి వచ్చినపుడు) వాటికున్న స్థాయికే పరిమితం చేశాడు. వారి మధ్యన ఘర్షించాలనే ఉద్దేశ్యాలు కొంత మిగిలి ఉన్నప్పటికీ రెండు విషయాలు స్థిరంగా ఉండేటట్లు జాగ్రత్తపడటం ద్వారా వారిని నియంత్రించగలిగాడు. మొదటిది, చర్చి యొక్క గొప్పదనం. దీని ద్వారానే ఇతడు వాటిని భయపెట్టాడు. రెండవది వారిలో మతాధికారులు ఉండాటానికి అనుమతించకపోవడం. ఎందుకంటే మతాధికారులే వారి మధ్యన ఘర్షణలకు కారకులవుతున్నారు. ఈ వైరి ముఠాలలో మతాధికారులు ఉన్నప్పుడల్లా అవి ఎంతోకాలం శాంతియుతంగా ఉండవు. దీనికి కారణం మతాధికారులు రోమ్‌కు ఇంటా బయటా ఘర్షణలను ఎగదోసి, మద్దతు కొరకు భూస్వాములను (జమీందారులను) బలవంతం చేస్తారు. ఈ విధంగా మతాధికారుల దురాశల మూలంగా భూస్వాముల మధ్యన అభిప్రాయ భేదాలు, కల్లోలాలు పొడసూపుతాయి.

ఈ కారణాల మూలంగానే (జూలియస్ తరువాత పోప్ గా వచ్చిన) దైవసమానుడైన పోప్ లియో చర్చి అత్యంత శక్తివంతంగా ఉన్నట్లు గమనించాడు. తన ముందువారు దానిని సైనికంగా ఉన్నతంగా రూపొందిస్తే ఇతడు దానిని తన మంచితనం ద్వారా, అంతులేని సుగుణాల ద్వారా మరింత గొప్పగా, మరింత గౌరవనీయమైనదిగా రూపొందించాలని మనం ఆశిద్దాం.

Pope Alexander VI (1492-1503). Pope Julius II (1503-1513). Pope Leo X (1513-1521).


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి