11, అక్టోబర్ 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 9వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం- 9 

పౌర సంస్థానం గురించి






ఇప్పుడు నేను రెండవ పద్దతి గురించి చెబుతాను. (మొదటి పద్దతి పై అధ్యాయంలో వివరించబడింది) అదేమిటంటే ఒక ప్రముఖ పౌరుడు కుట్ర ద్వారా లేక హింస ద్వారా కాకుండా తన తోటి పౌరుల యొక్క మద్దతుతో తన దేశానికి రాజు కావడం. ఇటువంటి దానిని ‘పౌర రాజ్యం’(civil principality) గా పిలువవచ్చు. దీనిని పొందడానికి గొప్ప ప్రతిభాపాటవాలు గానీ, లేక అసాధారణమైన అదృష్టం గానీ అవసరం లేదు. కేవలం నిశిత దృష్టి (happy shrewdness) మాత్రమే అవసరం. తదుపరి నేను చెప్పేదేమిటంటే అటువంటి రాజ్యం ప్రజల మద్దతు ద్వారాగానీ లేక ప్రభువంశీకుల (nobles) మద్దతు ద్వారా గానీ పొందబడుతుంది. ఎందుకంటే అన్ని నగరాలలోనూ ఈ రెండు వర్గాలు ఉంటాయి. దీనివలన ప్రభువంశీకులచే తాము పరిపాలింపబడకూడదనీ, వారిచే అణచివేతకు గురికాకూడదనీ ప్రజలు కోరుకునే పరిస్థితీ; అలాగే ప్రజలను పాలించాలి, వారిని అణచివేయాలి అని ప్రభువంశీకులు కోరుకునే పరిస్థితీ తలయెత్తుతాయి. అంతేకాక ఈ రెండు విరుద్ధమైన కోరికలనుండి నగరాలలో ఈ మూడింటిలో ఏదో ఒక ఫలితం తలయెత్తుతుంది. అవి సంస్థానం (principality), లేక స్వీయ ప్రభుత్వం (self- government ) లేక అరాచకత్వం (anarchy ).

ప్రజల చేతగానీ లేక ప్రభువంశీకులచేత గానీ - వారిలో ఎవరికో ఒకరికి అవకాశం వచ్చిన దాని ప్రకారంగా - ఒక సంస్థానం సృష్టింపబడుతుంది. ఎలా అంటే ప్రజలను నియంత్రించలేమని గ్రహించిన ప్రభువంశీకులు తమలో ఒకరి యొక్క ప్రఖ్యాతిని నినదిస్తూ- ఆ విధంగా అతని నీడలో వారు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోగలిగేటట్లుగా- అతనిని రాజుగా చేస్తారు. ప్రభువంశీకులను నిరోధించలేమని తెలుసుకున్న ప్రజలు కూడా తమలో ఒకని యొక్క ప్రఖ్యాతిని నినదిస్తూ- అతని అధికారం ద్వారా ఆత్మరక్షణ చేసుకునేటట్లుగా- అతడిని రాజుగా చేస్తారు. ప్రభువంశీకుల సహాయం ద్వారా సార్వభౌమత్వాన్ని పొందినవాడు ప్రజల సహాయం ద్వారా దానిని చేరుకున్నవాని కన్నా ఎక్కువ కష్టంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే మొదటివాని చుట్టూ అతనితో సములుగా తమను భావించుకునే వారు అనేకమంది ఉంటారు. దీనిమూలంగా అతడు వారిని తన అభీష్టానుసారంగా పాలించనూలేడు లేక సమాధానపరచనూ లేడు. అయితే ప్రజామద్దతుతో సార్వభౌమత్వాన్ని చేరుకున్నవాడు తానొక్కడే ఉంటాడు. అతనియెడల విధేయత చూపడానికి సిద్ధంగా లేనివారు అతని చుట్టూ కొద్దిమందే ఉంటారు, లేనిచో అసలు ఉండరు.

దీనికి తోడుగా నిజాయితీగా వ్యవహరించడం ద్వారా మరియు ఇతరులకు హాని తలపెట్టకుండా ప్రభువంశీకులను ఎవరూ తృప్తిపరచలేరు. కానీ ప్రజలను తృప్తిపర్చవచ్చు. ఎందుకంటే వారిలక్ష్యం ప్రభువంశీకుల లక్ష్యం కన్నా ఎక్కువ ధర్మబద్ధమైనది. ప్రభువంశీకులు అణచివేయాలని కోరుకుంటే ప్రజలు కేవలం అణచి వేతకు గురికాకూడదని మాత్రమే కోరుకుంటారు. మరో విషయం ఏమిటంటే శత్రుత్వం వహించిన ప్రజలనుండి రాజు తనను ఎన్నడూ రక్షించుకోలేడు, ఎందుకంటే వారు అనేకమంది ఉంటారు. అదేసమయంలో ప్రభువంశీకుల నుండి అతడు తనను రక్షించుకోగలుగుతాడు. ఎందుకంటే వారు సంఖ్యలో కొద్దిమందే ఉంటారు గనుక. శత్రుత్వం వహించిన ప్రజల వలన ఏ రాజైనా మహా అయితే వారిచే త్యజించబడవచ్చు (abandonment). కానీ శతృత్వం వహించిన ప్రభువంశీకుల వలన త్యజించబడే భయమేకాదు, వారంతా ఇతడిమీద తిరగబడే (rise against) అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా గొప్ప చాకచక్యాన్ని (craft) మరియు దూరదృష్టిని కలిగి ఉండటం వలన వారు ఎల్లప్పుడూ కాలం తమ రక్షణకు అనుకూలంగా ఉండేటట్లు చూచుకొంటారు, అంతేకాక విజేత ఎవరు అవగలరని వారు భావిస్తారో వాని పక్షాన ఉండటాన్నే వారు కోరుకుంటారు. ఇంకా రాజు ఎల్లప్పుడూ అదే ప్రజలతో కలసి జీవించక తప్పదు. కానీ అదే ప్రభువంశీకులతోనే ఎల్లప్పుడూ కలసి జీవించవలసిన అవసరం మాత్రం లేదు. ఎందుకంటే వారిని అతడు ఏరోజైనా రూపొందించగలడు మరియు రూపుమార్చగలడు (make and unmake). అంతేకాక తనకిష్టం వచ్చినపుడు వారికి అధికారం ఈయనూగలడు లేక తీసివేయనూగలడు.

ఐతే ఈ విషయాన్ని తేటతెల్లం చేయడానికి, ప్రభువంశీకులు ప్రధానంగా రెండువిధాలుగా పరిగణించబడాలని నేను చెబుతున్నాను. ఎలా అంటే నీ పురోభివృద్ధిలో పాలుపంచుకునేటట్లుగా తమ నడవడికను మలచుకునేవారు (binds them entirely to your fortune) లేక అలా చేయనివారు. ఆవిధంగా పాలుపంచుకునేవారిని -వారు దురాశలేని వారైనట్లైతే (దోపిడీ ప్రవృత్తి లేని వారైనట్లైతే)- వారిని ప్రేమించాలి మరియు గౌరవించాలి. ఆ విధంగా పాలుపంచుకోని వారిని మరలా రెండువిధాలుగా పరిగణించాలి. పిరికితనం వలన మరియు సహజంగానే వారికి ధైర్యం లేకపోవడం వలన కొందరు ఆ విధంగా చేయకపోవచ్చు (పాలుపంచుకోకపోవచ్చు). అలాంటపుడు వారి సేవలను నీవు పొందాలి -మరిముఖ్యంగా వారిలో వివేకవంతులైన వారి సేవలు- ఎందుకంటే మంచిరోజులలో వారు నిన్ను గౌరవిస్తారు, కష్టకాలంలో వారివలన నీకు ఏవిధమైన భయం ఉండదు. కానీ ఉద్దేశ్యపూర్వకంగా మరియు స్వార్థపూరిత లక్ష్యాలతో వారు నీ పురోభివృద్ధిలో పాలుపంచుకోక దూరంగా ఉంటే అది వారు నీ గురించి కన్నా తమ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారన్నదానికి నిదర్శనం. అటువంటి వ్యక్తులతో రాజనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారు తనకు బాహాటమైన శతృవులు అన్నట్లుగా వారితో వ్యవహరించాలి. ఎందుకంటే అతడి కష్టకాలంలో ఎల్లప్పుడూ అతడి వినాశనానికే వారు కృషి చేస్తారు.

కనుక ప్రజల మద్దతుతో రాజైన వాడు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలి. తన వలన అణచివేతకు గురికాకుండా ఉండటాన్ని మాత్రమే వారు కోరుకుంటున్నారని తెలుసుకుని అతడు సులభంగానే వారితో స్నేహపూర్వకంగా ఉండగలుగుతాడు. కానీ ఎవరైతే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రభువంశీకుల మద్దతుతో రాజౌతాడో అతడు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడాన్నే కోరుకోవాలి. వారిని తన సంరక్షణలోనికి తీసుకున్నట్లైతే దానిని అతడు సులువుగానే నెరవేర్చగలుగుతాడు. ఎందుకంటే మనుషులు, తాము ఎవరినుండైతే చెడును ఊహిస్తున్నారో వారినుండే తమకు మంచి ఎదురైనపుడు అలా మంచి చేసినవానితో వారు మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆ విధంగా తమ మద్దతుతో రాజైనప్పటికంటే త్వరితంగా, మరింతగా ప్రజలు అతడిని ప్రేమిస్తారు (అతడికి అంకితమౌతారు). ఒకరాజు ప్రజల ప్రేమను పొందడానికి అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ పరిస్థితులను బట్టి మారతాయి కనుక ఎవరూ స్థిరమైన సూత్రీకరణలను చేయలేరు. కనుక నేను వాటిని వదిలివేస్తున్నాను. ఐతే నేను మరలా చెబుతున్నాను. ఒక రాజుకు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండటం అనేది అవసరం, లేనిచో కష్టకాలంలో అతనికి రక్షణ ఉండదు.

నబీస్ (Nabis) అనబడే స్పార్టన్ల రాజు మొత్తం గ్రీసు దేశం చేసిన దాడిని మరియు విజయోత్సాహంతో ఉన్న రోమన్ సైన్యం యొక్క దాడిని తట్టుకుని వారి నుండి తన దేశాన్ని మరియు తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. ఈ ముప్పును అధిగమించడానికి అతడికి కొద్దిమంది నుండి మాత్రమే తనను రక్షించుకోవలసిన అవసరం ఏర్పడినది. ప్రజలు కనుక శతృత్వంతో ఉన్నట్లైతే ఇది (ఈ జాగ్రత్త) సరిపోయి ఉండేదికాదు. “ ప్రజలను నమ్ముకున్నవాడు బురదను నమ్ముకున్నట్లే” (He who builds on the people, builds on the mud) అనే సాధారణ సామెత ద్వారా నేను చెప్పిన ఈ విషయాన్ని ఎవరూ సవాలు చేయవద్దు. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి ప్రజలను నమ్ముకుని, తాను తన శత్రువుల చేతగానీ, లేక ప్రభుత్వాధికారుల చేతగానీ అన్యాయానికి గురైనపుడు, తనను ప్రజలు రక్షిస్తారని అనుకుంటే ఆ సామెత నిజమే కావచ్చు. ఎందుకంటే అటువంటి సందర్భాలలో ఎక్కువగా అతడు మోసపోవడమన్నదే జరుగుతుంది. రోమ్‌లో గ్రాచికి మరియు ఫ్లోరెన్స్‌లో మెస్సర్ జెయోర్జియోస్కాలి కి ఇలానే జరిగింది. కానీ ప్రజలలో నమ్మకాన్ని ఉంచినది ఒక రాజు -శాసించగలిగిన వాడు, ధైర్యవంతుడు, కష్టకాలంలో నిరుత్సాహపడనివాడు, తగుజాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపనివాడు, తన స్థిరనిర్ణయంతో, ఉత్సాహంతో ప్రజలందరిలో ఉత్తేజాన్ని నింపేవాడు- అయినట్లైతే అతడు మోసగింపబడడు. పైగా అతడు తన పునాదులను చక్కగా నిర్మించుకున్నట్లుగా తెలుస్తుంది.

(నబిస్: స్పార్టా నియంత, 195 B.C లో ఫ్లామినినస్ నేతృత్వంలో రోమన్లచే జయించబడ్డాడు. 192B.C లో చంపబడ్డాడు.)

ఇటువంటి సంస్థానాలు, పౌరసంస్థానాల నుండి నిరంకుశ రాజ్యాలుగా మారే క్రమంలో వీటికి కష్టకాలం సంభవిస్తుంది. ఎందుకంటే వీటి యొక్క రాజులు వ్యక్తిగతంగానైనా పరిపాలిస్తారు లేక పరిపాలనాధికారుల ద్వారానైనా ( through magistrates) పరిపాలన సాగిస్తారు. రెండవ పద్దతిలో వారి ప్రభుత్వం బలహీనంగానూ మరియు మరింత అరక్షితంగానూ ఉంటుంది. ఎందుకంటే అది పూర్తిగా పరిపాలనాధికారులుగా వ్యవహరిస్తున్న పౌరుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కాక ఈ పరిపాలనాధికారులు మరిముఖ్యంగా కల్లోల సమయంలో రహస్యమైన కుట్ర ద్వారాగానీ లేక బాహాటమైన వ్యతిరేకత ద్వారాగానీ ప్రభుత్వాన్ని చాలా సులువుగా కూలదోయగలరు. అంతేగాక రాజుకు కల్లోల సమయం నడుమన నిరంకుశాధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉండదు. ఎందుకంటే పౌరులు మరియు ప్రభుత్వ సిబ్బంది (citizens and subjects) పరిపాలనాధికారుల నుండి ఆదేశాలు అందుకోవడానికి అలవాటుపడి ఉండటంతో ఈ గందరగోళం మధ్యన అతడికి విధేయత చూపగలిగే స్థితిలో ఉండరు. అంతేకాక కష్టకాలంలో అతడు విశ్వసించగల మనుషుల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అటువంటి రాజు తాను శాంతి సమయాలలో ఆచరించే వాటిమీద ఆధారపడలేడు. శాంతి సమయంలో పౌరులు రాజ్యం యొక్క అవసరంలో ఉంటారు. అప్పుడు ప్రతిఒక్కరూ అతనితో ఏకీభవిస్తారు, అందరూ హామీ ఇస్తారు, మృత్యువు సుదూరంగా ఉన్న ఆ సమయంలో అతని కొరకు మరణించడానికి అందరూ సిద్ధపడతారు. ఐతే కష్టకాలంలో, అంటే రాజ్యం పౌరుల యొక్క అవసరంలో ఉన్నపుడు వారిలో కొద్దిమంది మాత్రమే అతనికి లభిస్తారు. అంతేకాక ఈ ప్రయోగం ఎంతో ప్రమాదకరమైనది కనుక దీనిని ఒకసారి మాత్రమే ప్రయత్నించాలి. కనుక వివేక వంతుడైన రాజు తన పౌరులు అన్నిరకాలైన, అన్నివిధాలైన పరిస్థితులలోనూ, ఎల్లప్పుడు కూడా రాజ్యం యొక్క మరియు తనయొక్క అవసరాన్ని కలిగి ఉండేటట్లుగా జాగ్రత్తపడాలి. అప్పుడు వారంతా ఎల్లవేళలా విశ్వాసపాత్రులుగానే ఉంటారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి