11, అక్టోబర్ 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 7వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 7

ఇతరుల సహాయం ద్వారా లేక అదృష్టం ద్వారా పొందిన నూతన సంస్థానాల గురించి






సాధారణ స్థితినుండి కేవలం అదృష్టం వలన రాజులుగా మరిన వారికి అలా మారడంలో పెద్ద కష్టమేమీ ఉండదు. కానీ ఆస్థానాన్ని నిలుపుకోవడంలో మాత్రం వారు ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటారు. తమ లక్ష్యాన్ని వారు రెక్కలతో ఎగురుకుంటూ చేరుతున్నారా అన్నట్లుగా వారు తమ మార్గంలో ఏవిధమైన ఆటంకాన్ని ఎదుర్కోవడం జరగదు. కానీ ఆ అత్యున్నత స్థానాన్ని చేరుకున్న తరువాత మాత్రం వాళ్ళను కష్టాలు ముంచెత్తుతాయి. ధనానికి బదులుగాగానీ, లేక దాత యొక్క ప్రసన్నత వలన గానీ రాజ్యాన్ని పొందినవారు ఈ విభాగానికి చెందుతారు. గ్రీసు దేశంలో అయోనియా మరియు హెల్లెస్పాంట్ ప్రాంతాలలోని నగరాలలో డేరియస్‌చే అనేక మంది రాజులుగా రూపొందించబడ్డారు. డేరియస్ యొక్క రక్షణ మరియు పేరుప్రఖ్యాతుల కొరకు వారు ఆ నగరాలను పాలిస్తుంటారు. సైన్యాన్ని అవినీతికి పాల్పడేటట్లు చేయడం ద్వారా సాధారణ స్థితి నుండి సామ్రాజ్యాన్ని పొందిన చక్రవర్తులు కూడా ఈ విభాగానికే చెందుతారు. అటువంటి రాజులు పూర్తిగా తమకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టిన రాజు యొక్క ప్రసన్నత మీద మరియు అతని యొక్క బాగోగుల మీద ఆధారపడి ఉంటారు. అవి రెండూ స్థిరమైనవీ కావు, సురక్షితమైనవీ కావు. అంతేకాక వారిలో తమ స్థానాన్ని కాపాడుకోగల పరిజ్ఞానం గానీ, శక్తిగానీ లోపించి ఉంటాయి. వారికి కావలసిన పరిజ్ఞానం ఎందుకు ఉండదంటే మంచి నైపుణ్యం మరియు బలమైన వ్యక్తిత్వం ఉంటే తప్ప చిరకాలం సాధారణ వ్యక్తులుగా జీవించిన అటువంటి వారికి రాజ్యాన్ని ఎలా పాలించాలో తెలిసి ఉంటుందని అనుకోలేము. వారికి కావలసిన శక్తి ఎందుకు ఉండదంటే విశ్వాశపాత్రమైన సైన్యాలు వారికి ఉండవు.

అనుకోకుండా హఠాత్తుగా పొందబడిన రాజ్యాలు -ప్రకృతిలో పుట్టిన పిమ్మట త్వరితగతిన పెరిగే అన్ని ఇతర విషయాలవలే- తమను తాకే మొదటి తుఫాను గాలికే కూలిపోకుండా నిలవగలిగేలా వేళ్ళూనుకోవడంగానీ, పట్టును కలిగి ఉండటం గానీ ఎన్నడూ జరగదు. ముందే చెప్పినట్లుగా అలా ఒక్కసారిగా రాజులైనవారు విధి తమ ఒడిలో చేర్చిన దానిని కాపాడుకోవడాన్ని త్వరితగతిన నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండి, తాను రాజవడానికి ముందు ఆ రాజ్యానికి ఇతరులచే వేయబడిన పునాదులను తాను రాజయిన పిమ్మట కూడా బలీయం చేయగలిగితే మాత్రం అది ఇందుకు మినహాయింపు.

సామర్థ్యంతోగానీ, అదృష్టం వలనగానీ రాజుగా ఎదిగే ఈ రెండు విధానాలకు సంబంధించి నాకు జ్ఞాపకం ఉన్న కాలపరిధినుండి రెండు ఉదాహరణలను సూచిస్తాను. అవి Francesco Sforza మరియు Cesare Borgia. ఫ్రాన్సెస్కో తగిన మార్గాల ద్వారా, అసాధారణ సామర్థ్యంతో సాధారణస్థితి నుండి డ్యూక్ ఆఫ్ మిలన్‌గా ఎదిగాడు. అనేక ప్రయత్నాల ద్వారా పొందిన ఆ స్థానాన్ని స్వల్ప ప్రయాస ద్వారానే కాపాడుకున్నాడు. మరో పక్క ప్రజలచే డ్యూక్ ఆఫ్ వాలెంటినో గా పిలువబడే సీజర్ బోర్గియా తన తండ్రి ప్రాబల్యం సాగుతున్న కాలంలో రాజ్యాన్ని సంపాదించాడు. ఆవిధంగా ఇతరుల సైన్యం మరియు ఐశ్వర్యం ద్వారా తాను పొందిన రాజ్యంలో వేళ్ళూనుకోవడానికి ఒక వివేకవంతుడైన వాడు మరియు ఒక సమర్థవంతమైనవాడు చేయవలసిన ప్రతీ పనీ చేసినప్పటికీ, తీసుకోవలసిన ప్రతీ చర్యా తీసుకున్నప్పటికీ తన తండ్రి ప్రాబల్యం క్షీణించగానే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.

ఎందుకంటే పైన తెలిపిన విధంగా తన అధికారానికి పునాదులను ముందుగా నిర్మించుకోనివాడు తనకు సామర్థ్యం ఉన్న పక్షంలో తరువాత నిర్మించుకుంటాడు. ఐతే ఆ పునాదులు భవనానికీ, భవన నిర్మాతకు కూడా కష్టాన్ని కొనితెచ్చేటట్లుగా నిర్మించబడతాయి. డ్యూక్ ఆఫ్ వాలెంటినో గైకొన్న వివిధ చర్యలను మనం పరిశీలించినట్లైతే తన భవిష్యత్ అధికారం కొరకు అతడు ఎంతో బలమైన పునాదులు నిర్మించుకున్నాడని తెలుస్తుంది. వాటి గురించి చర్చించడం అనవసరమని నేను అనుకోను. ఎందుకంటే ఒక కొత్త రాజుకు నేర్పడానికి అతడి చేతలకన్నా ఉత్తమమైన పాఠాలు ఏమిటో నాకు తెలియదు. అతడు గైకొన్న చర్యలు అతడికి అంతిమవిజయాన్ని సమకూర్చలేక పోవడంలో అతడి దోషం ఏమీలేదు. దానికి కారణం అసాధారణంగా, అత్యంత తీవ్రంగా విధి వక్రించడమే.

తన కొడుకైన డ్యూక్ వాలెంటినోను గొప్పవాడిని చేసే ప్రయత్నంలో పోప్ అలెగ్జాండర్-6 సమీప మరియు సుదూర కష్టాలను అనేకం ఎదుర్కొన్నాడు. మొదటగా చర్చికి చెందని రాజ్యానికి అతడిని ప్రభువును చేయడానికి అతడికి మార్గమేమీ కనపడలేదు. అదే సమయంలో చర్చికి చెందే రాజ్యానికి అతడిని ప్రభువును చేయాలనుకుంటే అందుకు డ్యూక్ ఆఫ్ మిలన్ మరియు వెనటియన్స్ సమ్మతించరని తెలుసు. ఎందుకంటే ఫయెంజా మరియు రిమిని అప్పటికే వెనటియన్స్ యొక్క సంరక్షణలో ఉన్నాయి. తదుపరి అతడు ఎదుర్కొన్న కష్టం: ఇటలీ సైన్యాలు, మరీ ముఖ్యంగా తనకు సహాయంగా నిలవగలిగే అవకాశం ఉన్న సైన్యాలు తన ప్రాభవానికి భయపడే వారైన ఓర్సిని మరియు కొలొన్నెసి వంశస్తులు మరియు వారి అనుచరుల చేతులలో ఉన్నాయి. అందువలన వాటిని విశ్వసించలేడు. పర్యవసానంగా ఉన్న పరిస్థితులను తారుమారు చేయడం మరియు ఇటలీ లోని రాజ్యాలను గందరగోళానికి గురిచేయడం అవసరమయినది. దాని మూలంగా వాటిలో కొంతభాగానికి తనను తాను సురక్షితంగా అధిపతిని చేసుకోవచ్చు. వెనటియన్స్ వేరే ఇతర కారణాలతో ఫ్రెంచ్ వారిని మరోసారి ఇటలీలోకి రప్పించే విధంగా పథకం పన్నారని తెలియడంతో పోప్‌కు మార్గం సులువైపోయింది. వారి పథకాన్ని పోప్ అలెగ్జాండర్ వ్యతిరేకించకపోవడమేకాక ఫ్రెంచ్ రాజు (12వ లూయీ) యొక్క ప్రధమ వివాహాన్ని రద్దుపరచడం ద్వారా మరింతగా బలపరిచాడు (Ann of Brittany ను వివాహం చేసుకోవడానికి వీలు కలిగేటట్లుగా). దాని మీదట కింగ్ లూయీ వెనటియన్స్ యొక్క సహాయంతో మరియు అలెగ్జాండర్ యొక్క సమ్మతితో ఇటలీలోకి ప్రవేశించాడు. రొమాగ్నా మీద దండయాత్ర చేయడానికి పోప్ అతడి నుండి సైనిక దళాలను స్వీకరించిన వెంటనే లూయీ మిలన్ లో ప్రత్యక్షమయ్యాడు. ఫ్రెంచ్ సైన్యాలపేరు వినగానే రొమాగ్నా పోప్‌కు లొంగిపోయింది. ఆ విధంగా డ్యూక్ వాలెంటినో రొమాగ్నాను స్వంతం చేసుకొని, కొలొన్నెసిని అణచివేసి తన విజయాలను పదిలపరచుకోవాలనీ, మరింతగా విస్తరించాలనీ అభిలషిస్తున్న సమయంలో రెండు ఆటంకాలనెదుర్కొన్నాడు. ఒకటి తన బలగాలు తన యెడల విధేయత కలిగి ఉన్నాట్లుగా కనిపించకపోవడం, మరొకటి ఫ్రాన్సు రాజు సానుకూలంగా లేకపోవడం. వివరంగా చెప్పాలంటే తాను ఉపయోగిస్తున్న ఓర్సిని బలగాలు కీలక సమయంలో తనకు మద్దతుగా నిలబడవనీ, రాజ్యవిస్తరణను ఆటంకపరచడం మాత్రమే కాక తాను అప్పటికే జయించిన వాటిని కూడా వారు తననుండి స్వాధీనం చేసుకుంటారనీ, ఫ్రాన్సు రాజు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాడనీ అతడు భయపడ్డాడు. ఫయెంజాను చేజిక్కించుకున్న తరువాత బొలోగ్నా మీద దాడి చేస్తున్న సమయంలో ఓర్సిని బలగాలు ఎంతో అనిష్టంగా ఆ దాడిలో పాల్గొన్నప్పుడే అతడికి వాటి స్వభావం అవగతమైనది. డ్యూక్ ఆఫ్ అర్బినోను స్వాధీనం చేసుకున్న తరువాత తాను టస్కనీ మీద దాడిచేయబోతున్న సమయంలో ఆ దాడిని నిలువరించాలని ఫ్రాన్సు రాజు లూయీ తనను బలవంతం చేసినపుడే అతడికి రాజు యొక్క మనసు అర్థమైనది. ఈ కారణాలవలన డ్యూక్ వాలెంటినో ఇక మీదట ఇతరుల బలగాల మీద మరియు అదృష్టం మీద ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు.

మొదటి చర్యగా అతడు రోమ్‌లోని ఓర్సిని, కొలొన్నెసి ముఠాలను బలహీనం చేశాడు. వాళ్ళ అనుచరులలో సచ్ఛీలురందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. వారికి మంచి జీతభత్యాలను అందించాడు. వారందరికీ స్థాయికి తగిన విధంగా మంచి ఉద్యోగాలను, అధికారాలను కల్పించి గౌరవింఛాడు. దానితో కొద్దినెలల కాలంలోనే వారికి పాత ముఠాలతో ఉన్న సంబంధాలన్నీ తొలగిపోయి వారంతా డ్యూక్ కి నమ్మకస్థులైన అనుచరులుగా మారిపోయారు. దీని తరువాత –కొలొన్నా శిబిరపు అనుచరులనందరినీ చెల్లా చెదురు చేసి-ఓర్సిని శిబిరాన్ని కూడా నేలరాయగల అవకాశం కోసం ఎదురుచూశాడు. ఆ అవకాశం కూడా త్వరలోనే రావడంతో దానిని డ్యూక్ సద్వినియోగం చేసుకున్నాడు. ఎలాగంటే డ్యూక్ మరియు చర్చి యొక్క ప్రాబల్యం తమను నాశనం చేయగలదని చివరికి అర్థం చేసుకున్న ఓర్సిని పెరూగియా ప్రాంతంలోని మాగియోన్ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాని మూలంగా అర్బినోలో తిరుగుబాటు చెలరేగింది, రొమాగ్నాలో అల్లర్లు జరిగి డ్యూక్ కు లెక్కలేనన్ని కష్టనష్టాలు సంభవించాయి. వీటన్నింటినీ కూడా అతడు ఫ్రెంచ్ వారి సహాయంతో అధిగమించాడు. తన అధికారాన్ని పునఃస్థాపించుకున్న డ్యూక్, ఇకమీదట ఫ్రెంచ్ వారిని గానీ, లేక మరే ఇతర విదేశీ సహాయాన్ని గానీ నమ్మకుండా, తన ఎత్తుగడల మీదే అధారపడ్డాడు. తన ఆలోచనలను బయట పడకుండా జాగ్రత్త పడటంలో ఇతడు ఎంత సమర్థుడంటే, సిగ్నొర్ పగోలో యొక్క మధ్యవర్తిత్వం ద్వారా (ఇతడిని డ్యూక్ ఎంతో శ్రద్ధ చూపడం ద్వారా, ధనం, వస్త్రాలు, గుఱ్ఱాలు ఈయడం ద్వారా ప్రలోభపెట్టాడు.) -ఓర్సిని వర్గం అమాయకంగా సినిగాలియాలో డ్యూక్ అధికారపరిధిలోకి వచ్చిచేరే విధంగా- వారితో తిరిగి సత్సంబంధాలు ఏర్పరచుకోగలిగాడు. నాయకులందరూ అంతమొందించబడి, వారి అనుచరులందరూ ఇతనికి సన్నిహితులుగా మార్చబడి, డ్యూక్ తన అధికారానికి చాలినంతగా మంచి పునాదులు (మొత్తం రొమాగ్నాను మరియు డ్యూక్‌డమ్ ఆఫ్ అర్బినోను కలిగి ఉండటం ద్వారా) నిర్మించుకునాడు. తమకు మెరుగైన జీవితం లభించినదని బావిస్తున్న ఆ రాజ్యాల ప్రజలందరూ కూడా ఇతడికి సానుకూలంగా మారడం వలన అతడి నడవడికలోని ఈ భాగం గమనించదగినది మరియు ఇతరులచే అనుకరించదగినది అవడం వలన దీనిని నేను విస్మరించదలచుకోలేదు.

డ్యూక్ (సీజర్ బోర్గియా) రొమాగ్నాను ఆక్రమించినపుడు అది చాలా బలహీనులైన రాజుల పరిపాలనలో ఉన్నట్లుగా గమనించాడు. వారు ప్రజల బాగోగులు చూడటం కన్నా వారిని దోపిడీ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక వారు ప్రజలను సమైఖ్యంగా ఉంచడం కన్నా వారు విచ్ఛిన్నమై పోవడాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తుండటంతో దేశం దొంగతనాలు, దోపిడీలు, పోట్లాటలు ఇంకా అనేక రకాల హింసాయుత ఘటనలతో నిండిపోయింది. దానితో అతడు ఆ రాజ్యంలో శాంతిభద్రతలను తిరిగి నెలకొల్పి, తన అధికారానికి లోబడి ఉండేటట్లు చేసుకోవడానికి గాను అక్కడ మంచి రాజప్రతినిధిని నియమించడం అవసరమని నిర్ణయించుకున్నాడు. దానికొరకు అతడు మెస్సెర్ రామిరో డి ఓర్కో అనబడే వ్యక్తికి పూర్తి అధికారాలనిచ్చి నియమించాడు. అతడు చురుకైనవాడు మాత్రమేకాక చాలా క్రూరుడు. అతడు అనతికాలంలోనే శాంతిభద్రతలను, సమైఖ్యతను విజయవంతంగా పునరుద్ధరించాడు. కానీ ఆ తదుపరి అంతటి అపరిమిత అధికారం తనను ప్రజాద్వేషానికి గురిచేస్తుంది కనుక, ఇక మీదట అది అనవసరమని తలచిన డ్యూక్ ఆ రాజ్యంలో ప్రతిభావంతుడైన న్యాయాధికారి నేతృత్వంలో ఒక న్యాయస్థానాన్ని నెలకొల్పాడు. దానిలో అన్ని పట్టణాలకు చెందిన న్యాయవాదులు ఉంటారు. అప్పటి వరకు ఆ రాజ్యంలో ప్రదర్శింపబడిన క్రూరత్వం వలన తన యెడల ద్వేషం జనించినదని తెలుసుకున్న డ్యూక్, ప్రజల మనసుల నుండి దానిని చెరిపివేసి, వారి విశ్వాసాన్ని పొందడానికి గానూ జరిగిన అకృత్యాలకు తాను కారణం కాదనీ, అవి కేవలం రాజప్రతినిధి యొక్క కౄరస్వభావం వలనే సంభవించాయనీ ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఉద్దేశంతో అతడు ఒక రోజు ఉదయం రామిరోకు శిరచ్ఛేదం చేయించి, వధ్యశిల మరియు రక్తమోడుతున్న గొడ్డలి తోపాటుగా అతడి మృతదేహాన్ని సెసేనా పట్టణపు వ్యాపార కూడలిలో పడవేశాడు. ఆ భయానక దృశ్యం చూచిన ప్రజలు దిగ్భ్రాంతితో పాటు సంతృప్తిని కూడా పొందారు.

ఇక మనం అసలు విషయానికి వద్దాం. డ్యూక్ ఇప్పుడు తగిన విధంగా శక్తివంతుడై, తనకు కావలసిన విధంగా సైన్యాన్ని కూడగట్టడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాలన్నింటి నుండి ఎంతో కొంత సురక్షితంగా ఉండి, -తాను మరింతగా రాజ్య విస్తరణకు పూనుకున్న పక్షంలో తనకు హాని తలపెట్టగలిగే ఇరుగు పొరుగు శక్తులన్నింటినీ- పూర్తిగా నేలరాచాడు. ఇక ఆలోచించవలసినది ఫ్రాన్సు గురించే. ఎందుకంటే ఫ్రాన్సు రాజు చివరకు తను చేసిన తప్పు తెలుసుకుని ఇక మీదట తనకు మద్దతివ్వడని డ్యూక్‌కు తెలుసు. అందువలన ఇక నుండి కొత్త మిత్రుల కోసం అన్వేషణ ప్రారంభించి, -గేటే ఆక్రమణలో నిమగ్నులై ఉన్న స్పానియార్డుల మీద దాడి చేయడానికి నేపుల్స్ రాజ్యం మీదకు దండెత్త దలచిన ఫ్రాన్స్‌కు- సహాయం చేయకుండా వాయిదా వేసాడు. ఫ్రాన్స్ నుండి తనను రక్షించుకోవడమే డ్యూక్ యొక్క ఉద్దేశం. పోప్ అలెగ్జాండర్ జీవించి ఉన్నట్లైతే ఈ లక్ష్యాన్ని అతడు చాలా త్వరగానే నెరవేర్చుకోగలిగి ఉండేవాడు.

వర్తమాన పరిస్థితులకు సంబంధించి అతడు తీసుకున్న చర్యల క్రమం ఆ విధంగా ఉన్నది. అయితే భవిష్యత్తుకు సంబంధించి మొట్టమొదటగా భయపడుతున్న దేమిటంటే చర్చికి తదుపరి వారసుడు ఒకవేళ తనతో స్నేహపూర్వకంగా మెలగకుండా, తన తండ్రియైన పోప్ అలెగ్జాండర్ తనకు ఇచ్చినదంతా తననుండి తిరిగి తీసుకునే పరిస్థితిని ఎదుర్కోవడానికి అతడు నాలుగు రకాల మార్గాలలో జాగ్రత్త వహించాడు. మొదటిది తాను పదవీచ్యుతులను గావించిన ప్రభువులందరి కుటుంబాలను తుదముట్టించడం ద్వారా, వారు కొత్త పోప్ చేతి సాధనాలుగా మారకుండా నిరోదించాడు (పోప్‌కు సాకు దొరకకుండా నిరోధించాడు). రెండవది రోమ్ లోని ప్రముఖులందరినీ తనకు అనుకూలురుగా మార్చుకుని, వారి సహాయం ద్వారా పోప్‌కు కళ్ళెం వేయగలిగేటట్లుగా చర్యతీసుకున్నాడు. మూడవది మతాధికారులందరినీ సాధ్యమైనంత వరకు తన నియంత్రణ లోనికి తెచ్చుకునాడు. నాల్గవది ప్రస్తుత పోప్ అయిన తన తండ్రి మరణించే లోగానే మొదటి దెబ్బను కాచుకోగలిగేంత దృఢంగా తన అధికారాన్ని సుస్థిరంచేసుకోవడం. ఈ నాల్గింటిలో అలెగ్జాండర్ మరణించేనాటికి మూడింటిని నెరవేర్చాడు. అతడు తనచే పదవీచ్యుతులు గావింపబడిన ప్రభువులలో చేజిక్కిన వారందరినీ హతమార్చాడు. కొద్దిమంది తప్పించుకున్నారు. రోమన్ ప్రముఖులందరినీ తనకు అనుకూలురుగా మార్చుకునాడు. అలాగే మతాధికారులలో కూడా చాలా మందిని తన పక్షం వైపు తిప్పుకున్నాడు. డ్యూక్ తన రాజ్యాన్ని మరింతగా విస్తరించడం కొరకు టస్కనీకి అధిపతి కావాలని తలచాడు. Perugia మరియు Piombino లను అప్పటికే అతడు స్వాధీనం చేసుకుని ఉన్నాడు. అంతేకాక పిసా ఇతని సంరక్షణలోనే ఉన్నది. ఫ్రాన్సు గురించి ఏ మాత్రం ఆలోచించాల్సిన పని లేకపోవడంతో (ఎందుకంటే ఫ్రెంచి వారు నేపుల్స్ రాజ్యం నుండి స్పానియార్డులచే తరిమివేయబడటం వలన ఇరువురూ కూడా డ్యూక్ స్నేహాన్ని అర్ధించవలసిన అవసరం ఏర్పడింది.) ఇతడు పిసాను తటాలున ఆక్రమించాడు. దీని తరూవాత Lucca మరియు Siena -ఫ్లోరెంటైన్ల అసూయవలన కొంత, భయం వలన కొంత- వెంటవెంటనే లొంగిపోయాయి. దీనితో ఫ్లోరెన్స్ డ్యూక్ నుండి తనకు రక్షణలేదని గ్రహించింది. అతడు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లైతే -అలెగ్జాండర్ చనిపోయిన సంవత్సరంలోనే అతడు స్వాధీనం చేసుకోబోతున్నాడు కనుక-ఇతరుల శక్తిమీద గానీ, తన అదృష్టం మీద గానీ ఆధారపడకుండా పూర్తిగా తన బలం మరియు ధైర్యం మీదనే ఆధారపడగలిగి, తానొక్కడే నిలవగలిగేంతటి అధికారాన్ని, ప్రతిష్టను అతడు పెంపొందించుకోగలుగుతాడు.

డ్యూక్ తన ఖడ్గానికి మొదటిసారిగా పనిచెప్పిన తరువాత 5 సంవత్సరాలకు అలెగ్జాండర్ మరణించాడు. తన కొడుకైన డ్యూక్‌ను అతడు -రొమాగ్నాలో మాత్రమే అధికారం సుస్థిరమై ఉండి, మిగతావన్నీ అస్థిరంగా ఉన్న పరిస్థితిలో- అత్యంత శక్తివంతమైన రెండు శత్రుసైన్యాల నడుమన వదిలి జబ్బుపడి మరణించాడు. అయినా కూడ డ్యూక్‌లో ఎంతటి ధైర్యం మరియు సామర్థ్యం ఉన్నవంటే అతడికి మనుషులను ఎలా తనకు అనుకూలురుగా మార్చుకోవాలో లేక ఎలా వారిని నాశనం చేయాలో బాగా తెలుసు. అలాగే అతడు కొద్ది కాలవ్యవధిలోనే నిర్మించిన పునాదులు ఎంతటి బలమైన వంటే అతడి పొంతనే ఆ శతృసైన్యాలు గనుక లేకుండా ఉన్నట్లైతే లేక అతడు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లైతే ప్రతీ కష్టాన్నీ అధిగమించగలిగి ఉండేవాడు. (ఇతడు లేని సమయంలో) రొమాగ్నా ఎంతో విశ్వాసపాత్రంగా నెలరోజుల పైగా ఇతడి కోసం ఎదురుచూచింది. (అనారోగ్యంతో) సగం మరణించి ఉన్న పరిస్థితిలో కూడా ఇతడు రోమ్‌లో సురక్షితంగా ఉన్నాడు. ఆ సమయంలో రోమ్ మీదకు దాడికి వచ్చిన Baglioni, Vitelli మరియు Orsini లు అతడి మీద ఎటువంటి విజయాన్ని పొందలేకపోయాయి. ఈ విషయాలన్నింటిని బట్టి అతడు నిర్మించిన పునాదులు ఎంతటి బలమైనవో గ్రహించవచ్చు. మరిముఖ్యంగా తనకు ఇష్టమైన వ్యక్తిని పోప్‌గా చేయలేకపోయినా కనీసం తనకు ఇష్టంలేని వ్యక్తి పోప్‌గా ఎన్నిక కాకుండా ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉండటం వలన అలెగ్జాండర్ మరణ సమయంలో ఇతడు చక్కని ఆరోగ్యంతో ఉన్నట్లైతే, అన్ని విషయాలూ ఇతనికి సానుకూలంగా జరిగి ఉండేవి. జూలియస్ II పోప్‌గా ఎన్నికైన రోజున డ్యూక్ నాతో “నా తండ్రి మరణిస్తే జరగబోయే విషయాలన్నింటి గురించి ముందుచూపుతో ఆలోచించి, వాటన్నింటి కొరకు తగిన విధంగా జాగ్రత్తపడ్డాను కానీ నిజంగా నా తండ్రి యొక్క మరణం సంభవించినపుడు స్వయంగా నేనే మృత్యుముఖంలో ఉంటానన్న విషయాన్ని మాత్రం ఊహించలేకపోయానని” అన్నాడు.

(అలెగ్జాండర్-VI 18, ఆగష్టు, 1503న జ్వరంతో మరణించాడు.)

డ్యూక్ యొక్క చేతలన్నింటినీ సమీక్షించినపుడు అతడిలో నాకు తప్పేమీ కనిపించలేదు. మీదుమిక్కిలి, అదృష్టం లేక ఇతరుల యొక్క సైన్యాల ద్వారా రాజ్యాధికారాన్ని పొందినవారందరూ అనుకరించడానికి ఇతడిని ఒక నమూనాగా ప్రతిపాదించడం (నేను ప్రతిపాదిస్తున్నట్లుగా) సబబని నాకు అనిపిస్తున్నది. గొప్పవైన ధైర్యసాహసాలు, సమున్నతమైన ఆశయాలు కలిగిన అతడు మరోవిధంగా ప్రవర్తించగలిగేవాడు కాదు. అతడి తండ్రి కొద్దికాలం మాత్రమే జీవించడం, మరియు స్వయంగా తాను రోగగ్రస్తుడు కావడం; ఇవి మాత్రమే అతడి ప్రణాళికలు విజయవంతం కాకుండా నిరోధించాయి. కనుక ఎవరైతే కొత్తగా సాధించిన రాజ్యంలో –శతృవుల నుండి తమను కాపాడుకోవడం, కొత్త మిత్రులను ఏర్పరచుకోవడం, బలప్రయోగం ద్వారానో లేక ఎత్తుగడలద్వారానో ప్రాబల్యాన్ని సాధించడం, ప్రజలలో తన యెడల భయభక్తులు కలిగించడం, సైనికులచే గౌరవింపబడి వారి విధేయతను పొందడం, తనకు హాని తలపెట్టగలిగిన శక్తిగానీ, లేక అలా చేయాలనే తలంపు గానీ ఉన్న వారందరినీ తుదముట్టించడం, పాత విధివిధానాలను తొలగించి నూతన విధానాలను ప్రవేశపెట్టడం, కఠినంగానూ అలాగే దయతోనూ, ఉదారతతోనూ మరియు విశలాదృక్పథంతోనూ మెలగడం, రాజభక్తిలేని సైన్యాన్ని రద్దుచేసి నూతన సైన్యాన్ని నిర్మించడం, రాజులు, రారాజులు తనకు సహాయం చేయడంలో వారికి లాభమున్నట్లు, తనకు ఆగ్రహం కలిగించడం వారికి ప్రమాదమన్నట్లు వారు భావించే విధంగా వారితో సంబంధాలను కలిగి ఉండటం--ఇలా ఇవన్నీ అవసరమని భావిస్తాడో అతడు డ్యూక్ యొక్క చేతలకన్నా సజీవమైన నమూనాను పొందలేడు.

రెండవ జూలియస్‌ను పోప్‌గా ఎన్నుకున్న విషయంలో మాత్రమే ఇతడిని మనం నిందించగలం. కారణం ఆ ఎంపిక సరైనది కాదు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్లు తనకు ఇష్టమైన వ్యక్తిని పోప్‌గా ఎన్నుకునే సామర్థ్యం లేకపోయినా, వేరెవరినైనా పోప్ కాకుండా నిరోధించగలిగి ఉండేవాడు. మతాధికారులలో తన వలన దెబ్బతిన్నవారు గానీ లేక పోప్ అయిన మీదట తన వలన భయం ఉన్నవారు గానీ పోప్ అవడానికి ఇతడు సమ్మతించి ఉండవలసినది కాదు. ఎందుకంటే మనుషులు భయం వలన గానీ లేక కోపం వలన గానీ హాని తలపెడతారు (శత్రువులుగా మారతారు). ఇతని వలన దెబ్బతిన్న వారిలో కొందరు San Pietro ad Vincula, Colonna, San Giorgio మరియు Ascanio. మిగిలినవారందరూ పోప్ అయిన మీదట ఇతని వలన భయం ఉన్నవారే. రోయిన్ మరియు స్పానియార్డులు తప్ప. (స్పానియార్డులు వారికున్న సంబంధ బాంధవ్యాలు మరియు బాధ్యతల మూలంగా, రోయిన్ ఫ్రాన్స్ రాజ్యంతో తనకున్న సంబంధం రీత్యా శక్తివంతుడుగా ఉండటం వలన) అందువలన డ్యూక్ మొదటి ప్రత్యామ్నాయంగా స్పానియార్డులలో ఒకరు పోప్‌గా ఎన్నిక అవడానికి ప్రయత్నించి ఉండవలసినది. అందులో విఫలమైన పక్షంలో రోయిన్ ఎన్నిక కావడానికి సమ్మతించి ఉండవలసినది. అంతేకానీ San Pietro ad Vincula (జూలియస్-II) ఎన్నికకు తన సమ్మతిని తెలిపి ఉండవలసినది కాదు.

‘గొప్పస్థానంలో ఉన్న వ్యక్తులు కొత్తగా చేసిన మేలు మూలంగా పాత గాయాలను మరచిపోతార’ని నమ్మేవాడు మోసపోతాడు. ఈ విధంగా డ్యూక్ తన ఎంపికలో తప్పు చేశాడు. ఆ తప్పే అంతిమంగా అతడి వినాశనానికి కారణమైనది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి