25, అక్టోబర్ 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్' 12వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 12 

వివిధ రకాల సైన్యాల గురించి; ముఖ్యంగా కిరాయి సైన్యాల గురించి






నేను ప్రారంభంలో పరిశీలించడానికి ప్రతిపాదించిన వివిధ రకాల సంస్థానాల యొక్క లక్షణాలను విశేషంగా (సంస్థానాల వారీగా) చర్చించిన మీదట, అలాగే వాటి యొక్క బలానికి మరియు బలహీనతకు గల కారణాలను కొంతవరకు పరిశీలించిన మీదట, అంతేకాక వాటిని పొందాలని మరియు నిలుపుకోవాలని కోరుకునే అనేకమంది అనుసరించే పద్దతులను సూచించిన మీదట, ప్రతి ఒక సంస్థానం ఉపయోగించే దాడి మరియు రక్షణ సాధనం (సైన్యం) గురించి సామాన్యంగా (generally) చర్చించడమే ఇప్పుడు నాకు మిగిలి ఉన్నది.

ఒక రాజుకు తన పునాదులు బలంగా నిర్మింపబడి ఉండటం అనేది ఎంతో అవసరం, లేదంటే అతడు తప్పనిసరిగా వినాశనానికి గురి అవుతాడు అనే దానిని మనం పైన చూసాం. అన్ని రాజ్యాలకు --అవి కొత్తవైనా, లేక పాతవైనా లేక మిశ్రమమైనవైనా-- ప్రధానమైన పునాదులు మంచి శాసనాలు మరియు మంచి సైన్యాలు. ఒక రాజ్యానికి మంచి సైనిక సంపత్తి లేనట్లైతే మంచి చట్టాలు ఉండబోవు. దీనిని అనుసరించి మంచి సైనిక సంపత్తి ఉన్న రాజ్యాలు మంచి చట్టాలను కలిగి ఉండగలవు. కనుక నేను చట్టాల గురించిన చర్చను వదిలేసి సైన్యాల గురించి మాత్రమే మాట్లాడతాను.

కనుక ఇప్పుడు నేను ఏమి చెబుతానంటే, ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే సైన్యాలు తన స్వంతవైనా (own ) అయి ఉంటాయి లేదంటే అవి కిరాయిసైన్యాలు (mercenaries ) లేదా ఇతరులు సాయం కొరకు పంపిన సైన్యాలు (auxiliaries ) లేదంటే మిశ్రమ సైన్యాలైనా (mixed ) అయి ఉంటాయి. కిరాయి సైన్యాలు మరియు ఇతరులు పంపిన సైన్యాలు నిరుపయోగమైనవి మరియు ప్రమాదకరమైనవి. తన రాజ్యాన్ని కిరాయి సైన్యాల మీద ఆధారపడి నిలుపుకునేవాడు దృఢంగానూ ఉండలేడు లేక సురక్షితంగానూ ఉండలేడు. ఎందుకంటే వాటిలో ఐకమత్యం ఉండదు, దురాశాపూరితమైనవి, క్రమశిక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు, స్నేహితులతో దుందుడుకుగానూ, శతృవులతో పిరికిపందల్లానూ వ్యవహరిస్తాయి. వాటికి దేవుడంటే భయం ఉండదు. మనిషికి విశ్వాసపాత్రులుగా ఉండరు. దాడి మొదలు కానంతవరకే విధ్వంసం జరగకుండా ఉంటుంది. (వారి మీద దాడి జరిగినప్పుడల్లా ఓటమి సంభవిస్తుంది) శాంతి సమయాలలో నీవు వారి దోపిడీకి గురి అవుతావు. యుద్ధ సమయంలో నీ శతృవు యొక్క దోపిడీకి గురి అవుతావు. కారణమేమిటంటే --నీ కోసం మరణించడనికి వారు ఇష్టపడేలా చేయడానికి సరిపోని అతితక్కువ వేతనం కన్నా-- వారిని యుద్ధరంగాన్ని అంటిపెట్టుకుని ఉండేలా చేసే మరే ఇతర ఆకర్షణగానీ, కారణంగానీ వారు కలిగిలేరు. నీవు యుద్ధం చేయని సమయంలో మాత్రమే వారు నీ సైనికులుగా ఉండటానికి ఇష్టపడతారు, యుద్ధం రాగానే వారు శత్రువు నుండి పలాయనం చిత్తగించి అదృశ్యమైపోతారు. ఈ విషయాన్ని నిరూపించడంలో పెద్దకష్టమేమీ ఉండదు. ఎందుకంటే అనేక సంవత్సరాలపాటు తన ఆశలన్నీ కిరాయి సైన్యాలమీదే నిలపటం తప్ప ఇటలీ నాశనానికి మరేదీ కారణం కాదు. మొదట్లో అవి కొంత మెరుగ్గా కనబడి, వారితో వారే ఎదురైనప్పుడు ధైర్యసాహసాలు కనబరచినప్పటికీ, విదేశీయులు ప్రవేశించినప్పుడు మాత్రం వారు తామేమిటో చూయించారు. ఆ విధంగా ఫ్రాన్స్ రాజైన ఛార్లెస్ అతి సునాయాసంగా ఇటలీని తన స్వాధీనం లోనికి తెచ్చుకునే వీలు కలిగింది. ‘మన (ఇటాలియన్ల) పాపాలే దీనికి కారణం’ అని అన్నవాడు నిజమే చెప్పాడు. కానీ అవి అతడనుకున్న పాపాలు కాదు, నేను చెప్పిన పాపాలు. అంతేకాక అవి రాజుల యొక్క పాపాలు గనుక వాటికి శిక్షను అనుభవించింది కూడా రాజులే.

నేను ఈ (కిరాయి) బలగాల అవాంఛనీయ లక్షణం గురించి మరింత స్పష్టంగా విశదీకరించాలని కోరుకుంటున్నాను. ఈ కిరాయి సైన్యాల యొక్క సైన్యాధిపతులు బలవంతులో లేక బలహీనులో అయి ఉంటారు. వారు గనుక బలవంతులైతే నీవు వారిని నమ్మలేవు. ఎందుకంటే అటువంటి వారు వారి యజమానివైన నిన్నే అణచివేయడం ద్వారానో లేక నీ అభీష్టానికి విరుద్ధంగా మరెవరినో అణచివేయడం ద్వారానో వారు ఎల్లప్పుడూ తమ ఔన్నాత్యాన్నే కోరుకుంటారు. అలా కాక ఆ సైన్యాధిపతి సమర్థుడు కాకపోతే నీవు మామూలు పద్దతిలో నాశనమైపోతావు. తన చేతిలో సైన్యాలు కలిగిన ఎవరైనా సరే -అతడు కిరాయి సైన్యాధిపతి అయినా, కాకపోయినా కూడా- ఇదే విధంగా ప్రవర్తిస్తాడని ఎవరైనా అంటే దానికి నా సమాధానం: ఒక రాజు గానీ, లేక ఒక రిపబ్లిక్ గానీ సైన్యాన్ని ఉపయోగించవలసి వచ్చినపుడు; రాజు ఐతే స్వయంగా తానే సైన్యాధిపత్యం వహించడానికి వెళ్ళవలసి ఉంటుంది. రిపబ్లిక్ ఐతే తన పౌరులలో ఒకరిని పంపవలసి ఉంటుంది. ఒకవేళ అతడు అందుకు తగని వాడని నిరూపణ అయితే అతడిని మార్చవలసి ఉంటుంది, తగిన వాడని నిరూపణ అయితే చట్టాల యొక్క బలం ద్వారా అతడిని తగిన హద్దులలో ఉంచవలసి ఉంటుంది. రాజులు గానీ, రిపబ్లిక్‌లు గానీ తమ స్వంత సైన్యాల మీద ఆధారపడినపుడు గొప్ప విజయాలను పొందాయనీ, అదే కిరాయి సైన్యాలను ఉపయోగించటం వలన నష్టం తప్ప మరేమీ జరగలేదనీ అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాము. స్వంత సైన్యాలు కలిగిన రిపబ్లిక్‌ను దాని యొక్క పౌరులలో ఒకని యొక్క నియంత్రణ (పాలన) లోకి తీసుకురావడం, విదేశీ సైన్యాల మీద ఆధారపడిన దానిని తేవడాని కన్నా ఎక్కువ కష్టం అవుతుంది (అంటే ఆ దేశ సైన్యాధికారి కుట్ర ద్వారా దేశాన్ని తన పాలనలోకి తెచ్చుకోవాలనుకుంటే అది కష్టసాధ్యం ) రోమ్ మరియు స్పార్టా స్వంత సైన్యాలు కలిగి ఉండి అనేక శతాబ్దాల పాటు స్వేచ్ఛగా నిలిచాయి. స్విస్ ప్రజలు పూర్తిగా స్వంత సైన్యాలు కలిగి ఉండి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉన్నారు.

ప్రాచీన కాలంలో మనకు కిరాయి సైన్యాల గురించిన ఒక ఉదాహరణ కార్తజినియన్‌ల (Carthaginians ) విషయంలో ఉన్నది. కార్తజినియన్‌లు తమ స్వంత పౌరులనే సైన్యాధికారులుగా కలిగి ఉన్నప్పటికీ, రోమ్‌తో వారి మొదటి యుద్ధం యొక్క ముగింపులో, వారు తమ కిరాయి సైన్యాల చేత దాదాపూ వినాశనమైపోయారు. (తమ స్వంత సేనాని) ఎపామినొండాస్ (Epaminondas ) మరణించిన తరువాత థెబన్లు (Thebans ), (మాసిడోనియాకు చెందినవాడైన) ఫిలిప్ ఆఫ్ మాసిడోన్‌ను (Philip of Macedon ) తమ సేనాధిపతిగా చేసారు. (వారి సేనానిగా పోరాడి ) విజయం సాధించిన తరువాత అతడు వారి స్వేచ్ఛను హరించాడు. డ్యూక్ ఫిలిప్పో (Duke Filippo ) మరణించిన తరువాత మిలనీస్ వెనటియన్స్ కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఫ్రాన్సిస్కో స్ఫోర్జా (Francesco Sforza ) ను నియమించారు. అతడు శతృవులను కారావాగ్గియో (Caravaggio ) వద్ద ఓడించి, వారితోనే చేతులు కలిపి తన యజమానులైన మిలనీస్‌నే కూలదోశాడు. ఇతడి తండ్రి నేపుల్స్ రాణి అయిన జొహన్న (గియోవన్న) (Johanna ) కొలువు చేస్తున్నపుడు, ఆమెను హఠాత్తుగా సైన్యాలేవీ లేకుండా అరక్షితంగా వదిలివేయడంతో, ఆమె తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఆరగాన్ రాజు (King of Aragon ) యొక్క చేతులలో వాలవలసి వచ్చింది.

‘గతంలో వెనటియన్స్ మరియు ఫ్లోరెంటైన్స్, తమ భూభాగాలను ఈ (కిరాయి) సైన్యాల ద్వారా విస్తరించుకున్నా కూడా వాటి యొక్క సేనాధిపతులు తమను రాజులుగా చేసుకోవాలని కోరుకోకుండా, వారిని విశ్వాసంతో సేవించారు’ అని ఎవరైనా అంటే నేను ఇలా బదులిస్తాను: ఈ విషయంలో ఫ్లోరెంటైన్స్ అదృష్టవంతులు, ఎందుకంటే భయపడటానికి అవకాశం ఉన్న సమర్థులైన సేనానులలో కొందరు విజయం సాధించలేదు, కొందరు ప్రత్యర్థులను కలిగి ఉన్నారు, కొందరు వేరే ఇతర విషయాలకు తమ ఆశలను మళ్ళించారు.

విజయాన్ని పొందని వారిలో గియోవన్ని అకుటో (Giovanni Acuto ) ఒకడు. అతడు పరాజయం పాలవడంతో అతడి విశ్వాసపాత్రత పరీక్షను ఎదుర్కొనలేదు. ఒకవేళ ఇతడు విజేత అయినట్లైతే, ఫ్లోరెంటైన్స్ పూర్తిగా ఇతని చేత చిక్కి ఉండేవారనే విషయం ప్రతీ ఒకరికీ తెలుసు. స్ఫోర్జా మరియు బ్రాసెస్చి (Sforza had the Bracceschi ) ఎల్లవేళలా ప్రత్యర్థులు. అందువలన వారు ఒకరినొకరు కాపు కాసుకున్నారు. అంతకన్నా ముఖ్యంగా ఫ్రాన్సెస్కో (స్ఫోర్జా) తన ఆశలను లొంబార్డీ (మిలన్) వైపు మళ్ళించాడు; బ్రాసియో చర్చి మరియు నేపుల్స్ రాజ్యాల వైపు మళ్ళించాడు. మనం కొద్దికాలం క్రితం జరిగిన విషయానికి వద్దాం. ఫ్లోరెంటైన్స్ తమ సేనానిగా పగొలొ విటెల్లి (Pagolo Vitelli ) ని నియమించారు. అతడు ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. అతడు సాధారణ స్థితి నుండి సైన్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఉన్నత స్థానానికి ఎదిగాడు. అతడు గనుక పీసాను (Pisa ) జయించినట్లైతే, ఫ్లోరెంటైన్స్ పూర్తిగా అతడి అధికారంలోకి వచ్చి ఉండేవారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే అప్పుడిక అతడు శత్రుపక్షం వహిస్తే వారు నిస్సహాయులుగా మిగిలిపోతారు, అదే సమయంలో వారు అతడిని తమతోనే కలిగి ఉంటే వారు తప్పక అతడి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవలసి వస్తుంది.

వెనటియన్స్ సాధించిన విజయాలను మనం పరిశీలించినట్లైతే ఆ దేశ ప్రజలలోని అన్నివర్గాలవారు -గొప్పవారు గానీయండి, సామాన్య ప్రజలు గానీయండి– యుద్ధాలలో ధైర్యసాహసాలతో పోరాడినంత కాలం, వారు సురక్షితంగా మరియూ గొప్పగా వ్యవహరించినట్లుగా మనం తెలుసుకుంటాం. వారు భూమి మీద కాకుండా నీటిమీద యుద్ధం చేసినంతకాలం ఇలానే జరిగింది. ఐతే వారు భూమిమీద యుద్ధం చేయడం ప్రారంభించగానే తమకు ప్రావీణ్యం ఉన్న ఈ పద్దతులన్నింటినీ వదిలేసి ఇటలీ సంప్రదాయాలను (కిరాయి సైన్యాలను ఉపయోగించడం) అనుసరించారు. భూమి మీద వారి విస్తరణ యొక్క ప్రారంభంలో, ఎక్కువ ప్రాంతాన్ని కలిగి లేకపోవడం వలన, మరియు వారి గొప్ప ప్రఖ్యాతి కారణంగా, వారికి తమ సేనానుల వలన అంతగా భయపడవలసిన పని లేకుండా పోయింది. ఐతే వారు కార్మిగ్నుయోలా (Carmignuola ) నేతృత్వంలో తమ భూభాగాలను విస్తరించిన తరువాత తమ పొరపాటును తెలుసుకున్నారు. ఎలా అంటే అతడి ఆధ్వర్యంలో డ్యూక్ ఆఫ్ మిలన్‌ను ఓడించినపుడు, వారు అతడిని ఎంతో ధైర్యసాహసాలు మరియు నైపుణ్యం కలిగిన నాయకుడిగా గ్రహించారు. ఐతే మరోపక్క, ఆ తదుపరి యుద్ధాన్ని కొనసాగించటంలో అతడు ఎంతో నిరాసక్తంగా వ్యవహరించడాన్ని చూసి, ఇక అతడి నేతృత్వంలో ఎటువంటి విజయాలు నమోదు కావని భావించారు. అయితే వారు -తాము సాధించినదంతా కోల్పోగలమనే భయంతో అతడిని బహిష్కరించలేక- అతడి నుండి తమను తాము రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలో అతడిని హతమార్చారు. ఆ తరువాత వారు తమ సేనానులుగా బార్టోలొమియో డ బెర్గమో, రొబెర్టో డ సాన్ సెవేరినో, ద కౌంట్ ఆఫ్ పిటిగ్లియానో (Bartolomeo da Bergamo, Roberto da San Severino, the count of Pitigliano ) మొదలైన వారిని నియమించారు. వారి వలన వెనటియన్స్‌కు ఎప్పుడూ అపజయం తెచ్చిన ప్రమాదాలే తప్ప విజయం తెచ్చిన ప్రమాదాలు కలగలేదు (అపజయమే తప్ప విజయం ఏనాడూ రాలేదు). ఆవిధంగా, తదుపరి వైలా (Vaila) వద్ద; ఒకేఒక యుద్ధంలో ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో, తాము ఎంతో కష్టంతో సాధించినదంతా వారు కోల్పోయారు. ఎందుకంటే ఇటువంటి (కిరాయి) సైన్యాలతో విజయాలు చాలా నెమ్మదిగా, ఎంతో ఆలస్యంగా వస్తాయి. అవి కూడా పరిగణించదగినవి కావు. కానీ అపజయాలు మాత్రం హఠాత్తుగా వస్తాయి, అపశకునాన్ని తెస్తాయి.

ఈ ఉదాహరణల మూలంగా నేను ఎన్నో సంవత్సరముల నుండి కిరాయి సైన్యాలచే రక్షించబడుతున్న ఇటలీ (ప్రస్తావన) కి వచ్చాను కనుక ఈ విషయం గురించి కొంత లోతుగా వెళ్ళాలనుకుంటున్నాను. దాని వలన కిరాయిసైన్యాల యొక్క పుట్టుక మరియు పెరుగుదల గురించి తెలుసుకున్నవారికి, వాటితో తగినవిధంగా వ్యవహరించడం మరింత తేలిక అవుతుంది. ఆధునిక కాలంలో (రోమన్) సామ్రాజ్యం యొక్క అధికారం ఇటలీలో గుర్తింపు కోల్పోతుండగా, పోప్ యొక్క లౌకిక అధికారాలు మరింత పెరుగుతుండగా, ఇటలీ ఒక్కసారిగా అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలైపోయింది అన్న విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి. అనేక పెద్ద నగరాలు -చక్రవర్తి అండతో అప్పటివరకూ తమను అణచివేతకు గురిచేసిన- తమ ప్రభువులమీద తిరుగుబాటు చేశాయి. తిరుగుబాటు చేసిన ఈ నగరాలను చర్చి తన లౌకిక అధికారాలను పెంపు చేసుకోవడం కోసం సమర్థిస్తే: అనేక ఇతర నగరాలలో వాటి యొక్క పౌరులే రాజులయ్యారు. దీనిమూలంగా ఇటలీ పాక్షికంగా చర్చి మరియు కొన్ని రిపబ్లిక్‌ల చేతులలోకి వెళ్ళిపోయింది. పూజారులను కలిగి ఉన్న చర్చి, మరియు సైనిక వ్యవహారాలలో అనుభవం లేని పౌరులను కలిగి ఉన్న రిపబ్లిక్‌లు, రెండూ కూడా విదేశీయులను (కిరాయి సైన్యాలను) నియమించుకోవడం ప్రారంభించాయి.

మొట్టమొదట ఈ విధమైన సైనిక పద్దతికి ప్రాచుర్యం కల్పించినవాడు రొమాగ్నాకు చెందిన అల్బెరిగొ డ కొనియో (Alberigo da Conio ). ఇతని వద్ద శిక్షణ పొందిన వారిలో బ్రాసియో మరియు స్ఫోర్జాలు తమ కాలంలో ఇటలీలోనే నిర్ణయాత్మకమైన వారు. వీరి తరువాత ఇప్పటివరకు ఇటలీ సేనలను నడిపిన ఇతర సేనానులందరూ వచ్చారు. వీరందరి ప్రతాపం యొక్క ఫలితం ఏమిటంటే, ఇటలీ ఛార్లెస్ చేతిలో ఓటమి పాలయ్యింది. లూయిస్ చే లూటీ చేయబడింది, ఫెర్డినాండ్ చే ధ్వంసం చేయబడింది, స్విట్జర్లాండ్ చేతిలో అవమానింపబడింది.

(ఛార్లెస్ మరియు లూయీస్ ఫ్రెంచ్ రాజులు; ఫెర్డినాండ్ స్పానిష్ రాజు)

ఈ కిరాయి సైన్యాల యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటంటే పదాతిదళాల (infantry ) యొక్క ఖ్యాతిని తగ్గించి, తద్వారా తమ (అశ్విక దళాల) (cavalry ) ప్రాముఖ్యతను పెంచుకోవడం. వీరు ఇలా చేయడానికి కారణం వారికి తమదైన భూభాగం లేకపోవడం మరియు జీవిక కోసం వారు తమ వృత్తి మీదనే ఆధారపడటం వలన అనేక మంది సైనికులను వారు పోషించలేరు, అదే సమయంలో కొద్ది మంది పదాతి సైనికుల వలన వారికి ఏ విధమైన ప్రాముఖ్యతా రాదు, కనుక వారు అశ్వికదళం వైపు మొగ్గుచూపారు. అలా అయితే తక్కువ సైనికులతోనే ప్రాముఖ్యత వస్తుంది, మరియు పోషించడం కూడా సులభసాధ్యం. పరిస్థితి ఎక్కడకు దారితీసిందంటే ఇరవై వేల సైనికులున్న ఒక సైన్యంలో రెండువేల మంది పదాతిదళ సైనికులు కూడా కనబడరు. వీటన్నింటికీ తోడుగా ఈ కిరాయి సైన్యాలు తమకు, తమ సైనికులకు శ్రమను మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి అందుబాటులో ఉండే ప్రతీ పద్దతినీ ఉపయోగిస్తాయి. యుద్ధంలో ఒకరినొకరు (శత్రుదేశపు కిరాయి సైనికులను) చంపరు, అయితే వారిని యుద్ధ ఖైదీలుగా పట్టుకుని, పరిహారంగా ధనం వసూలు చేయకుండానే విడిచిపెడతారు. వారు ఏ పట్టణం మీదా రాత్రిపూట దాడి చేయరు, అలాగే పట్టణాలలో ఉన్న సైనికులు తమను ముట్టడించిన సైన్యాన్ని రాత్రిపూట ఎదుర్కోరు, తమ సైనిక విడిది చుట్టూ వారు రక్షణ గోడలు గానీ, కందకాలు గానీ ఏర్పాటు చేయరు, చలికాలంలో యుద్ధానికి బయలుదేరరు. ఇవన్నీకూడా వారి యొక్క సైనిక నియమావళిచే అనుమతించబడ్డాయి. నేను చెప్పినట్లుగా శ్రమనూ మరియూ ప్రమాదాలనూ తప్పించుకోవడానికి వారిచే రూపొందించబడ్డాయి. ఈ విధంగా కిరాయి సైన్యాలు ఇటలీని బానిసత్వంలోకి, హీన స్థితిలోకి తీసుకెళ్ళాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి