11, అక్టోబర్ 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 8వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 8

కుట్రద్వారా రాజ్యాధికారాన్ని పొందినవారి గురించి






సాధారణ స్థితినుండి ఒక వ్యక్తి రాజుగా ఎదగడానికి అదృష్టం ద్వారానో లేక ప్రతిభద్వారానో కాకుండా మరో రెండు పద్దతులు కూడా ఉన్నాయి. రిపబ్లిక్‌ల గురించి చెప్పేటపుడు వాటిలో ఒకటి విస్తృతంగా చర్చించబడినా కూడా వాటిని ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేను. ఆ మార్గాలు ఏవంటే కుట్ర, కుతంత్రాలద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం లేదంటే ఒక సాధారణవ్యక్తి తోటిపౌరుల యొక్క సహాయ సహకారాల ద్వారా తన దేశానికి రాజు కావడం. మొదటి పద్దతి రెండురకాల ఉదాహరణల ద్వారా వివరించబడుతుంది. ఒకటి ప్రాచీనమైనది, మరోటి ఆధునికమైనది. (రెండవపద్దతి గురించి తరువాతి (9వ) అధ్యాయంలో వివరించబడుతుంది) ఇక ఈ విషయంలోకి మరింత లోతుకి వెళ్ళకుండా, వాటిని అనుసరించాలనుకునే వారికి ఈ రెండు ఉదాహరణలు చాలని నేను అనుకుంటున్నాను.

అగాథోక్లెస్ (Agathocles, 361BC-289BC) అనబడే సిసిలియన్ మామూలు స్థితి మాత్రమే కాదు, అతి దుర్భరమైన స్థితినుండి సిరాకస్ కు రాజు అయ్యాడు. (ఇటలీకి సమీపంలోగల ‘సిసిలీ’ అనే ద్వీపంలో ‘సిరాకస్’ అనే నగరం ఉన్నది) ఒక కుమ్మరివాని కొడుకైన ఇతడు తన కెరీర్‌లోని అన్ని దశలలోనూ చాలా దుష్ప్రవర్తనతో కూడిన జీవితం గడిపాడు. అయినప్పటికీ ఇతడు దుష్ప్రవర్తనకు తోడుగా మానసికంగానూ మరియూ శారీరకంగానూ దృఢత్వం కలిగినవాడవడంతో సైన్యంలో చేరి అంచెలంచెలుగా Praetor of Syracuse స్థాయికి ఎదిగాడు. ఆ స్థానంలో నిలదొక్కుకోవడంతోనే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనీ, అలాగే అప్రయత్నంగా ప్రజామోదంతో సాధించుకున్న ఆ అధికారాన్ని ఇతరులకు బద్ధుడు కాకుండా హింసతో నిలుపుకోవాలనీ బాగా యోచించి నిర్ణయించుకున్నాడు. ఈ లక్ష్యం కొరకు అతడు ఆ సమయంలో తన సైన్యంతో సిసిలీలో యుద్ధం చేస్తున్న అమిల్కర్ (Amilcar) అనే కార్తజినియన్‌తో ఒక అవగాహనకు వచ్చాడు. ఒక రోజు ఉదయం ఇతడు రిపబ్లిక్ కు సంబంధించిన విషయాలను చర్చించాలనే మిషతో సిరాకస్ పట్టణపు ప్రజలను, సెనేట్‌ను సమావేశపరిచాడు. అతడి సైగతో సైనికులు సెనేటర్స్ అందరినీ, మరియు ప్రజలలో ధనవంతులనూ హతమార్చారు. ఆ విధంగా వారు హతమార్చబడిన తరువాత ఆ నగర సార్వభౌమత్వాన్ని అతడు ఎటువంటి ప్రజావ్యతిరేకత లేకుండా చేజిక్కించుకున్నాడు. (ఆ తరువాత) అతడు కార్తజినియన్లచే రెండు సార్లు ఓడింపబడి, చివరికి ముట్టడింపబడినప్పటికీ తన నగరాన్ని రక్షించుకోగలగటమే కాదు, నగర రక్షణార్థం కొంత సైన్యాన్ని వదలి, మిగతా సైన్యంతో ఆఫ్రికా మీద దండెత్తి అనతికాలంలోనే సిరాకస్ నగరాన్ని ముట్టడి నుండి విముక్తం చేశాడు. గత్యంతరం లేని పరిస్థితిలో కార్తజినియన్‌లు అగాథోక్లెస్‌తో సంధిచేసుకుని, సిసిలీని అతనికే వదిలేసి ఆఫ్రికాతో సరిపెట్టుకున్నారు.

దీనిని బట్టి అతడి యొక్క చేతలను మరియు అతడు సాధించిన విజయాలను పరిశీలించినవారు అందులో అదృష్టం పాత్ర ఏమీలేదని తెలుసుకుంటారు. పైన తెలిపినట్లుగా ఏ ఒక్కరి సహాయం లేకుండా, సైనికవృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి, ప్రతీదశనూ అనేక కష్టనష్టాలతో అధిగమించి, అద్వితీయమైన స్థానాన్ని చేరుకుని, ఆ తదుపరి ఆ స్థానాన్ని ఎంతో ధైర్యంతో అనేక ప్రమాదాలకోర్చి పదిలంచేసుకున్నాడు. అయినా కూడా తోటి పౌరులను హతమార్చడం, స్నేహితులను మోసం చేయడం, విశ్వాసం, దయ, మతం అన్నవి లేకుండా ఉండటం; ఇవన్నీ ప్రతిభాసామర్థ్యాలుగా గణింపబడవు. అటువంటి పద్దతులు సామ్రాజ్యాన్ని తెస్తేతేవచ్చు గానీ, పేరు ప్రతిష్టలను తేలేవు. అయినా కూడా కష్టనష్టాలను సహించడంలో మరియు వాటిని అధిగమించడంలో అగాథోక్లెస్ యొక్క మానసిక దృఢత్వంతోబాటు, ప్రమాదాలలోకి అడుగిడటంలో మరియూ వాటినుండి బయటపడటంలో అతడి యొక్క ధైర్యాన్ని పరిశీలించినట్లైతే ప్రఖ్యాత నాయకుల కన్నా అతడు తక్కువగా ఎందుకు పరిగణింపబడుతున్నాడో మనకు కారణం కనబడదు. అయినప్పటికీ ఇతడి ఆటవిక కౄరత్వం మరియు అంతులేని ఘోరకృత్యాలతో కూడుకున్న అమానవీయత ప్రఖ్యాత వ్యక్తులతో బాటుగా ఇతడిని పరిగణించడానికి అనుమతించవు. కనుక, ఏ విధంగా కూడానూ ఇతడు సాధించిన దానికి కారణంగా అదృష్టాన్నో లేక ప్రతిభనో మనం చూపలేము.

ఈ రోజులలో, 6వ అలెగ్జాండర్ పరిపాలనా సమయంలో ఓలివెరొట్టో డ ఫెర్మో (Oliverotto da Fermo) చాలా సంవత్సరాల క్రితమే అనాథగా మారి గివోవన్ని ఫొగ్లియని అనబడే తన మేనమామచే పెంచబడ్డాడు. అతడి యవ్వన ప్రారంభ దినాలలో పగోలో విటెల్లి క్రమశిక్షణలో తర్ఫీదు పొంది, సైన్యంలో ఉన్నత స్థాయిని పొందాలనే ఉద్దేశ్యంతో అతడి క్రింద పనిచేయడానికి సైన్యంలో చేర్చబడ్డాడు. పగోలో చనిపోయిన తరువాత అతడి సోదరుడైన విటెల్లొజొ క్రింద సైన్యంలో పనిచేసి, అనతికాలంలోనే తన తెలివితేటలతో, శారీరక, మానసిక దృఢత్వంతో తన వృత్తిలో అగ్రగణ్యుడిగా నిలిచాడు. కానీ ఇతరుల వద్ద పనిచేయడం చిన్నతనంగా భావించిన అతడు ఫెర్మో రాజ్యం యొక్క స్వేచ్ఛకన్నా దాని బానిసత్వాన్నే ఎక్కువగా కోరుకున్న (దేశద్రోహులైన) ఆ రాజ్యపు పౌరులు కొందరి సహాయంతో మరియు విటెల్లెషి మద్దతుతో ఫెర్మోను స్వాధీనం చేసుకోవాలని పథక రచన చేశాడు. ఆ పథకం ప్రకారం అతడు తన మేనమామ అయిన గియోవన్ని పొగ్లియానికి ఈ విధంగా జాబు రాశాడు. చాలా సంవత్సరాలనుండి ఇంటికి దూరంగా ఉండటం వలన, తనను, స్వంత ఊరిని ఓసారి చూడాలనుకుంటున్నట్లు, అలాగే తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తి సంగతి కూడా ఓసారి పరికించాలనుకుంటున్నట్లు రాశాడు. ఇంకా తాను గౌరవాన్ని పొందడానికి తప్ప మరిదేని కోసం శ్రమించనప్పటికీ, స్వంత ఊరి ప్రజలకు తాను ఇన్నాళ్ళూ సమయాన్ని వ్యర్థంగా గడపలేదని తెలియజేయటం కొరకు గౌరవప్రదంగా ఆ ఊరికి రావాలనుకుంటున్నట్లు, అందుకొరకు తన స్నేహితులు, అనుచరులతో కూడిన వందమంది గుఱ్ఱపు రౌతులను వెంట తేవాలని అనుకుంటున్నట్లు రాశాడు. ఇంకా తనను ఫెర్మియన్‌లు గౌరవప్రదంగా స్వాగతించేటట్లు గా ఏర్పాటు చేయమని తన మేనమామను అర్థిస్తూ, అది అంతా తానొక్కడికే గౌరవం కాదనీ, తనను పెంచి పెద్దచేసిన తన మేనమామకు కూడా గౌరవమేనని కూడా రాశాడు.

ఆ ప్రకారంగా గియోవన్ని తన మేనల్లుడికి జరగవలసిన గౌరవమర్యాదలలో లోటులేకుండా చూచాడు. ఫెర్మియన్స్ అతడిని సగౌరవంగా స్వాగతించేటట్లు చేసి, తన స్వంత ఇంటిలోనే అతడికి బస ఏర్పాటు చేశాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి, తన దుర్మార్గమైన పథకానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న ఓలివెరొట్టొ (పథకం ప్రకారం) ఒక ఘనమైన విందును ఏర్పాటుచేసి దానికి తన మేనమామ అయిన గియోవన్ని ఫోగ్లియానిని మరియు ఫెర్మో నగరానికి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. విందు మరియు అటువంటి విందులలో సాధారణంగా ఉండే వినోద కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత ఓలివరెట్టో తెలివిగా పోప్ అలెగ్జాండర్ మరియు అతడి కొడుకైన సీజర్ బోర్గియాల గొప్పతనం గురించి మరియు వారు చేపడుతున్న కార్యాల గురించి మాటాడుతూ గంభీరమైన చర్చను ప్రారంభించాడు. అతడు మాట్లాడుతున్న దానికి గియోవన్ని మరియు ఇతరులు సమాధానమిస్తుండగా అతడు హఠాత్తుగా పైకి లేచి, ఇటువంటి విషయాలను అందరి ముందూ కాక వ్యక్తిగతంగా (ప్రైవేటుగా) మాట్లాడుకోవాలని చెబుతూ మరో గదిలోనికి నడిచాడు. గియోవన్ని మరియు ఇతరులు కూడా అతడిని అనుసరించి అదే గదిలోనికి వెళ్ళారు. వారు అక్కడ ఆసీనులయ్యారో లేదో రహస్య ప్రదేశాలలో దాగి ఉన్న సైనికులు దూసుకొచ్చి గియోవన్ని మరియు మిగిలినవారిని హతమార్చారు. ఈ హత్యాకాండ తరువాత ఓలివెరొట్టొ తన అశ్వాన్ని అధిరోహించి, నగర వీధులలో కలియదిరుగుతూ- ప్రజలు భయంతో విధిలేక తనకు విధేయత తెలపడానికీ మరియు తాను రాజుగా ఉండే ప్రభుత్వాన్ని అనుమతించడానికీ గాను- చీఫ్ మెజెస్ట్రేట్‌ను రాజసౌధంలో బంధించాడు. అసంతృప్తితో తనకు హాని తలపెట్టగలిగే వారినందరినీ హతమార్చాడు. అంతేకాక ఆ రాజ్యాన్ని నిలుపుకున్న సంవత్సరకాలంలో అతడు ఫెర్మో నగరం మీద పట్టును కలిగి ఉండటమే కాక తన ఇరుగుపొరుగు వారందరికీ అసాధ్యుడుగా మారే విధంగా నూతనమైన పౌర, సైనిక శాసనాలతో శక్తివంతుడిగా రూపొందాడు. సీజర్ బోర్గియా చేత గనుక ఇతడు మోసగింపబడకపోయినట్లైతే ఇతడిని పదవీచ్యుతిడిని చేయడం అగాథోక్లెస్ ను పదవీచ్యుతుణ్ణి చేయడమంత కష్టమయి ఉండేది. కానీ సీజర్ బోర్గియా పైన చెప్పిన విధంగా ఇతడిని సినిగాలియాలో ఓర్సిని, విటెల్లిల తోపాటుగా పట్టుకున్నాడు. ఆ విధంగా తన మేనమామను చంపిన ఒక సంవత్సరకాలం తరువాత, ధైర్యసాహసాలలో మరియు దుర్మార్గంలో తనకు గురువైన విటెల్లొజొ తో పాటుగా పీక నులిమి చంపబడ్డాడు (Strangled).

ఇతరులు అనేకమంది కౄరత్వం మూలంగా యుద్ధసమయం సంగతి దేముడెరుగు కనీసం శాంతియుత సమయంలో సైతం తమ రాజ్యాన్ని రక్షించుకోలేకపోతుంటే, అగాథోక్లెస్ మరియు అటువంటి ఇంకొందరు అనంతంగా ఘోరకృత్యాలకూ మరియు కౄరత్వానికీ పాల్పడిన తరువాత కూడా తమ దేశంలో చిరకాలం సురక్షితంగా మనగలగడం, బాహ్యశత్రువుల నుండి తమను తాము రక్షించుకోగలగడం, ప్రజలు వారి యెడల ఎన్నడూ కుట్రకు పాల్పడకపోవడం….ఇదంతా ఎలా సంభవం అని ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఐతే ఇది కౄరత్వాన్ని ‘సరిగా అమలు చేయడం’, లేక ‘సరిగా అమలు చేయకపోవడం’ అన్న దాన్ని అనుసరించి జరిగింది అని నేను నమ్ముతున్నాను. ఆత్మరక్షణార్థం ఒకేఒక్క సమయంలో అమలు చేయబడిన కౄరత్వాన్ని, తదుపరి కాలంలో -ప్రజల మంచి కోసం వినియోగపడని పక్షంలో- కొనసాగకుండా ఉండే కౄరత్వాన్ని ‘సరిగా అమలు చేయబడిన కౄరత్వం’ (well employed ) గా చెప్పవచ్చు (చెడును సరియైనది అని చెప్పడం సాధ్యమైనట్లైతే). ఆరంభంలో స్వల్పంగా ఉండి కాలం గడిచే కొలదీ తగ్గకపోగా ద్విగుణీకృతమౌతూ పోయేది ‘సరిగా అమలు చేయబడని కౄరత్వం’ (ill-employed). మొదటి పద్దతిని ఆచరించేవారు దైవసహాయం ద్వారాగానీ లేక మానవసహాయం ద్వారాగానీ అగాథోక్లెస్ వలే తమ పరిపాలనను కొంత సులువుగా చేయగలుగుతారు. రెండవ పద్దతిని అనుసరించేవారికి తమను తాము కాపాడుకోవడం సాధ్యం కాదు.

ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నపుడు విజేత తాను తీసుకోవలసిన కఠిన చర్యలన్నింటినీ (తాను చేయవలసిన గాయాలన్నింటినీ) క్షుణ్ణంగా పరీక్షించి, వాటిని ప్రతిరోజూ పునరావృతం చేయవలసిన పనిలేకుండా వాటన్నింటిని ఒకేదెబ్బతో అమలు చేయవలసి ఉన్నది. ఆ విధంగా ప్రజలను అస్థిరపరచకుండా ఉండటం ద్వారా వారిలో తిరిగి నమ్మకాన్ని కలిగించగలుగుతాడు. అంతేకాక వారికి మేలుచేయడం ద్వారా వారి అభిమానాన్ని సంపాదిస్తాడు. పిరికితనం వలన గానీ, లేక చెడుసలహా వలన గానీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించేవాడు ఎల్లప్పుడూ ఖడ్గాన్ని చేబూని ఉండవలసి వస్తుంది. అతడు ప్రజల మీద ఆధారపడలేడు, నిరంతరం అదే పనిగా పునరావృతమయ్యే కౄరత్వం వలన బాధలను అనుభవిస్తున్న ప్రజలు కూడా ఇతడిని విశ్వాసపాత్రుడిగా చూడరు. అందువలన గాయలన్నింటినీ కూడా ఒకేసమయంలో చేస్తే తక్కువగా బాధిస్తాయి గనుక తక్కువ ఆగ్రహాన్నే కలుగజేస్తాయి. చేసే మేలును మాత్రం కొద్దికొద్దిగా చేస్తే ఆ ఆనందం దీర్ఘకాలం ఉంటుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా రాజనేవాడు అనుకోకుండా జరిగే మంచి లేక చెడు సంఘటనల వలన తన ప్రవర్తనా విధానం మారకుండా ఉండే విధంగా తన ప్రజల మధ్యన జీవించాలి. ఎందుకంటే మారవలసిన అవసరం కష్టకాలంలో కలిగితే అప్పటికి కఠిన చర్యలు తీసుకునే సమయం మించిపోయి ఉంటుంది. అలాగే మెతకవైఖరి అవలంబిస్తే, నీవు తప్పనిసరి పరిస్థితిలో అలా ప్రవర్తించావని పరిగణింపబడి, దాని నిమిత్తం ఏ ఒక్కరూ నీకు కృతజ్ఞత చూపకపోవడంతో నీకు ఏ విధంగానూ ఆ మెతక చర్యలు సహాయకారిగా ఉండవు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి